భిక్కనూరు, నవంబర్ 24 : భిక్కనూర్ మండలంలో కాంగ్రెస్ నాయకులు దొంగతనంగా ఇతరుల సమాచారం సేకరించి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం, ఇన్సూరెన్స్ కార్డులు జారీ చేయడాన్ని నిరసిస్తూ మండల కేంద్రంలో బుధవారం టీఆర్ఎస్(బీఆర్ఎస్ నాయకులు) పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ భిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తుడుం పద్మ, స్వామి వారి కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండానే వారి పేర్లపైన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం, ఇన్సూరెన్సు కార్డులు వచ్చాయన్నారు. ఇవే కాకుండా గతంలోనూ భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన వారికి కూడా ఇలాగే సభ్యత్వం ఇచ్చారన్నారు. కాంగ్రెస్ నాయకులు దొంగతనంగా వ్యక్తిగత వివరాలను సేకరించి సభ్యత్వ నమోదు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
కాంగ్రెస్ నాయకులు ఇకనైనా ఇలాంటి తప్పుడు పనులు మానుకోవాలని సూచించారు. తాము కూడా కూడా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టామని ఇలాంటి తప్పుడు పనులు ఎన్నడూ చేయలేదన్నారు. కాగా అదే స్థలంలో కాంగ్రెస్ నాయకులు సైతం ధర్నా చేపట్టడంతో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను సముదాయించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి, సర్పంచ్ తునికి వేణు, మార్కెట్ కమిటీ చైర్మన్ భగవంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ నాగభూషణం గౌడ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ రాంచంద్రం, సింగిల్ విండో చైర్మన్ భూమయ్య, ఆలయ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి. ఉప సర్పంచులు నరేశ్, భిక్షపతి, టౌన్ అధ్యక్షుడు మల్లేశం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హనుమంత్రెడ్డి, నాయకులు బాబు, చంద్రం, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.