సుభాష్నగర్, మార్చి 24: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన మహాలక్ష్మి పథకానికి క్రమంగా మంగళం పాడుతున్నది. ఈ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే వంట గ్యాస్, ప్రతి మహిళకూ రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే అమలు చేస్తున్నామని గొప్పగా ప్రకటించింది. అయితే, రూ.2,500 ఆర్థిక సాయం అందజేసే ప్రక్రియను అసలు ప్రారంభించనే లేదు. ఇక రూ.500లకే వంట గ్యాస్ సరఫరాను ప్రారంభించిన సర్కారు.. కొన్నాళ్లకే చేతులెత్తేసింది.
ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. రూ.500లకే సిలిండర్ అందిం చే పథకాన్ని గొప్పగా ప్రారంభించింది. తొలి ఆర్నెళ్ల పాటు వినియోగదారుల ఖా తాల్లో సబ్సిడీ డబ్బులు జమ చేసింది. ఆ తర్వాత నుంచి నిలిపి వేసింది. గ్యాస్ ఏజెన్సీల్లో మొత్తం డబ్బు చెల్లించి సిలిండర్ తీసుకున్న లబ్ధిదారులు సబ్సిడీ డబ్బులు పడుతాయని ఎదురుచూస్తున్నారు. కానీ చాలా రోజులుగా అవి జమ కావడం లేదు. దీంతో మహిళలు అటు బ్యాంకులతో పాటు ఇటు ఏజెన్సీలు, సంబంధిత అధికారుల వద్దకు తిరుగుతున్నా సరైన సమాధానం రావడం లేదు.
నిజామాబాద్ జిల్లాలో దాదాపు 2.15 లక్షల డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి నెలా పెద్ద మొత్తంలోనే వంట గ్యాస్ వినియోగమవుతున్నది. ప్రస్తుతం సిలిండర్ ధర రూ. 985 ఉండగా, ఆ మొత్తం చెల్లించి గ్యాస్ తీసుకోవాలి. మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం లబ్ధిదారులకు రూ.485 చొప్పున తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కానీ చాలా రోజులుగా డబ్బులు జమ చేయడం లేదు. ఒక్కో కుటుంబం సగటున ఏడాదికి 8 సిలిండర్లు వినియోగిస్తుంటే, దాదాపు రూ.4 వేల మేర భారం వారిపై పడుతుంది. ఆ మొత్తాన్ని చెల్లించాల్సిన ప్రభుత్వం నిధులు జమ చేయట్లేదు.
మహాలక్ష్మి పథకం కింద రూ.500 లకే సిలిండర్ ఇస్తామన్నారు. కానీ ఏడాది కాలంగా సబ్సిడీ డబ్బులు ఖాతాలో జమ కావడం లేదు. సంబంధిత అధికారులను, గ్యాస్ ఏజెన్సీలను అడిగినా ఫలితం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం గృహలక్ష్మి పథకాన్ని సక్రమంగా అమలు చేయాలి.
– సుచరిత, గృహిణి, నిజామాబాద్