నిజామాబాద్, జూన్ 22, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజురోజుకు ఘోరంగా మారుతోంది. ఎన్నికల ముందు రైతు సంక్షేమం అని ఊదరగొట్టిన కాంగ్రెస్ పార్టీ… అధికారంలోకి వచ్చాక మాట మార్చింది. రైతులను నిలువునా మోసం చేస్తోంది. ముఖ్యంగా సన్న వడ్ల(పైన్ రైస్ వెరైటీలు) సాగుపై రూ.500 క్వింటాల్ బోనస్ పథకం ఇప్పుడు కేవలం ఏడు వంగడాలకు మాత్రమే పరిమితం చేయడంతో వానాకాలం సీజన్లో లక్షలాది మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాట్లు సిద్ధం చేసుకుని, పుటం వేసుకుని సాగు చేస్తున్న రైతులకు ఈ నిర్ణయం బాంబులా పేల్చింది.
గతంలో 30కి పైగా సన్న వెరైటీలు బోనస్కు అర్హమైనప్పటికీ ఇప్పుడు ఈ సంఖ్యను తగ్గించడం రైతులను తీవ్రంగా నిరాశ పరుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రతి పంటకు బోనస్ చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఆ తర్వాత వరి పంటకే పరిమితం చేసింది. దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వక రైతులను మోసం చేస్తోంది. తాజాగా సన్న వడ్ల సాగుకు ఆంక్షలు విధించింది. బోనస్ రావాలంటే ఏడు వంగడాలే సాగు చేయాలని చెబుతోంది. అకస్మాత్తుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. బాన్సువాడ, జుక్కల్, బోధన్ వంటి ఏరియాలో ఇప్పటికే నాట్లు కూడా పూర్తయ్యాయి. ప్రభుత్వ నిర్ణయానికి ముందే రైతులు సాగు పనులు షురూ చేశారు. రేవంత్ రెడ్డి సర్కారు తీరుపై రైతుల్లో తీవ్ర ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. తికమక నిర్ణయాలతో రైతులను గోస పెడుతున్నారని మండిపడుతున్నారు.
సన్న వడ్ల సాగు సాధారణ వడ్ల కంటే ఎక్కువ ఖర్చుతో కూడుకుంది. బోనస్ ఆశతో ఎక్కువ మంది దీనికి మారారు. ఇప్పటికే నాట్లు సిద్ధమైన రైతులు వంగడాలు మార్చలేరు. సీజన్ చివర్లో బోనస్ నిరాకరణ భారీ నష్టాలకు దారి తీస్తుంది. బోనస్ లేకపోతే మిల్లర్లు లేదా ఒపెన్ మార్కెట్లో తక్కువ ధరలకు అమ్మాల్సి వస్తుంది. వర్షాభావం, నీటి లోటు, ఎరువుల ధరల పెరుగుదల ఇప్పటికే రైతులు కష్టాల్లో ఉన్నారు.
ఈ నిర్ణయం మరింత ఇబ్బందికి గురి చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం మూలంగా రైతుల విశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. సన్న వడ్ల సాగు తగ్గితే, రాష్ట్ర ఆహార భద్రత, ఎగుమతులు, మిల్లింగ్ ఇండస్ట్రీ ప్రభావితం అవుతాయి. ప్రస్తుత సీజన్లో సన్న వడ్లు సాగు చేసిన రైతులకు బోనస్ ఇవ్వకపోతే సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు, అదనపు మద్ధతును కర్షకులు కోరుతున్నారు. తెలంగాణ వ్యవసాయం స్థిరపడాలంటే, హామీలు నెరవేర్చడం, రైతుల సమస్యలను సీజన్ ముందు పరిష్కరించడం అత్యవసరంగా మారింది. ప్రభుత్వం త్వరగా స్పందించి పాత పద్ధతిలో సన్న వడ్లు సాగు చేసిన ప్రతి రైతును ఆదుకోవాలి.
లేదంటే వానాకాలం చివర్ల భారీ నష్టాలు, ఆందోళనలు అనివార్యం అయ్యే ప్రమాదం ఉంది. తెలంగాణ ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాల్కు రూ.500 బోనస్ను ఇప్పుడు కేవలం 7 నిర్ధిష్ట వంగడాలకు మాత్రమే పరిమితం చేయడం నిరంకుషత్వానికి పరాకాష్టకు చేరిందని కర్షకులు కన్నెర్ర చేస్తున్నారు. గతంలో 30-37 వంగడాలకు బోనస్ వర్తించేది. ఇప్పుడు పరిమితి వల్ల ఇప్పటికే నాట్లు సిద్దం చేసుకున్న రైతుల్లో ఆందోళన ఏర్పడింది. చాలా మంది రైతులు ఇప్పటికే ఇతర సన్న వంగడాలు కొని పుటం వేసుకుని, నాట్లు సిద్ధం చేసుకున్నారు. వారికి బోనస్ రాకపోతే ఉత్పత్తి వ్యయాలు భరించలేక నష్టాలు ఎదురవుతాయని భయపడుతున్నారు. వానాకాలం సీజన్ మధ్యలో నియమాలు మార్చడం సర్కారు మోసంగానే అంతా భావిస్తున్నారు.
బాన్సువాడ రూరల్, జూన్ 21 : రైతులు పండిం చిన అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక బోనస్ ఇవ్వకుండా చేతులెత్తేసింది. ఈ వానాకాలంలో సాగు చేసే ఏడు రకాల వడ్లకే బోనస్ ఇస్తామని రేవంత్రెడ్డి ప్రభుత్వం ప్రకటించడం రైతులను మోసం చేయడమే. ఇప్పటికే రైతుబంధును తుంగలో తొక్కేసి, తీరా ఇప్పుడు కొర్రీలు పెట్టడం చేతకాని ప్రభుత్వానికి నిదర్శనం. రైతులు సరైన సమయంలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు.
-అనిల్, రైతు, బోర్లం
బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేసి రైతును రాజుగా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక మోసపూరిత హామీలు ఇచ్చింది. పథకాల అమలులో పూర్తిగా విఫలమయ్యింది. మాకు నచ్చిన వరిని సాగు చేస్తాం. ఏడు రకాల వడ్లు సాగు చేసే రైతులకే బోనస్ ఇస్తామని ప్రభుత్వం చెప్పడం మోసం చేయడమే. సీఎం రేవంత్రెడ్డి అనేక రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రైతుబంధు జాడే లేదు. ఇచ్చే బోనస్ సక్రమంగా ఇవ్వడం లేదు.