పెద్ద కొడప్గల్(పిట్లం), సెప్టెంబర్ 1: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర రాజకీయాలు మానుకోవాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. ఈ మేరకు పిట్లం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం షిండే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్రెడ్డి ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారని, ఫ్రీ బస్సు తప్ప ఇప్పటివరకూ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు.
అసెంబ్లీలో ఒక రోజు సమావేశం నిర్వహిస్తే భారీ వర్షాలతో పంట నష్టం, కొట్టుకుపోయిన, దెబ్బతిన్న రోడ్లపై చర్చిస్తారని అందరూ అనుకున్నారని, కానీ కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రతో సమావేశం నిర్వహించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ సీబీఐకి అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కుండపోత వర్షాలతో ప్రజలు అల్లాడిపోతున్నారని, జన జీవనం స్తంభించి పోతున్నదని తెలిపారు. వ్యాధుల బారిన పడిన ప్రజలకు ప్ర భుత్వ దవాఖానల్లో సరైన వైద్యం అందడంలేదన్నారు.
ఆస్తి, ప్రాణ నష్టం జరిగినా వాటి లెక్కలు లేవన్నారు. వేల ఎకరాల్లో పంటలు నీట మునిగిపోయాయని, యూరియా లేక రైతులు గోదాముల వద్ద పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు సమస్యలతో అల్లాడుతుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా, కాళేశ్వరం ప్రాజెక్టుపై అనవసర రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అన్నారం వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నర్సాగౌడ్, ఆకుల లక్ష్మణ్, విజయ్ పాల్గొన్నారు.