ఆర్మూర్టౌన్, ఏప్రిల్ 21: దొంగ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్, గారడీ మాటలు చెప్పే బీజేపీకి లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ చర్చిలో ఆదివారం నిర్వహించిన క్రైస్తవుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీల్లో ఒక్కటి కూడా అమలు చేయని కాంగ్రెస్కు ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ప్రజల సమస్యలను గాలికి వదిలేశారన్నారు. తనను మంచి మనసుతో ఆశీర్వదించి లోక్సభకు పంపిస్తే తెలంగాణ సమస్యలపై గళమెత్తడంతోపాటు జిల్లా అభివృద్ధికి కోట్లాడి నిధులు తెచ్చే బాధ్యత తీసుకుంటానన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్కు ఓటేయాలని కోరారు. నిరంతరం ప్రజల్లోనే ఉంటూ సేవ చేస్తానన్నారు.