ఏర్గట్ల/ కమ్మర్పల్లి, మే 12:‘మీరు వట్టి మాటలు చెప్తారు…మేము అభివృద్ధి చేస్తాం.. చేతనైతే ప్రజలకు మంచి చేయండి, చేసే వాళ్లకు అడ్డు పడకండి’ అని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకులకు హితవు పలికారు. పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేసిన ఎంపీ అర్వింద్ కూడా తనను విమర్శిస్తున్నారని, మాటల్లో కాకుండా అభివృద్ధిలో తనతో పోటీపడాలని అన్నారు. కేంద్రం నుంచి ఏమైనా నిధులు తెచ్చి అభివృద్ధి చేశారా అని ప్రశ్నించారు. మంచి చేస్తున్న వారెవరో..వట్టి మాటలు చెబుతున్న వారెవరో ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన కమ్మర్పల్లి మండల కేంద్రం నుంచి ఏర్గట్ల మండలం తడ్పాకల్ వరకు రూ.6.43 కోట్లతో బీటీ రోడ్డు పునరుద్ధరణ పనులకు, కమ్మర్పల్లి మండలం ఉప్లూర్లో, ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్, తడ్ పాకల్ గ్రామాల్లో శంకుస్థాపన చేశారు. ఏర్గట్ల మండలం తొర్తిలో రూ.కోటీ 45 లక్షలతో స్లాబ్ కల్వర్టు బ్రిడ్జి (ఎస్ఎల్బీ) పనులకు శంకస్థాపన చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సహకారంతో బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. 50 ఏండ్లలో జరగని అభివృద్ధి గడిచిన ఎనిమిదేండ్లలోనే జరిగిందని..అప్పటి కన్నా ఒక రూపాయి ఎక్కువే అభివృద్ధి జరిగిందని పేర్కొన్నారు. ఏ గ్రామంలోనైనా అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధమని మంత్రి సవాల్ విసిరారు. ఏ పార్టీలో ఉన్నాడో తెలియని ఒకాయన కూడా విమర్శలు చేస్తున్నాడని, అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరితే పారి పోయాడని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ తన సవాల్కు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.
ప్రజలు అంతా గమనిస్తున్నారు..
సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితతోపాటు తనను తిడితే పెద్దవాళ్లమై పోతామని భ్రమపడుతున్నారని అన్నారు. ప్రతిపక్షాలు ఎంత తిడితే ప్రజల్లో మాకు అంత పాజిటివ్ గ్రాఫ్ పెరుగుతుందన్నారు. ప్రజలు ఇలాంటి విషయాలన్నింటినీ గమనిస్తున్నారని.. అంతిమంగా ఎవరు కావాలో నిర్ణయించేది వారేనని అన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా తాను ఎప్పుడూ బాల్కొండ నియోజక వర్గ ప్రజల అభివృద్ధి కోసం పని చేస్తానని అన్నారు.
కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కుంట రమేశ్ రెడ్డి, ఎంపీపీలు లోలపు గౌతమి, ఉపేందర్ రెడ్డి, జడ్పీటీసీలు రాధ, గుల్లే రాజేశ్వర్, బీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు రేగుంట దేవేందర్, రాజా పూర్ణానందం, వైస్ ఎంపీపీ సల్ల లావణ్య, సర్పంచులు బద్దం పద్మ, గుల్లే లావణ్య, పత్తిరెడ్డి ప్రకాశ్ రెడ్డి, కొండ నవీన్, ఎంపీటీసీలు పిప్పెర అనిల్, జక్కని మధుసూదన్, బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు బద్దం చిన్నా రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ బద్దం రాజేశ్వర్, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు అవారి మురళి, కో-ఆప్షన్ సభ్యుడు అస్రఫ్, ఉప సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
సుడిగాలి పర్యటన
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం బాల్కొండ నియోజక వర్గంలో సుడి గాలి పర్యటన చేశారు. అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ప్రజలు, కార్యకర్తల ఇండ్లలో జరిగిన వివాహాది శుభ కార్యాల్లో పాల్గొన్నారు.