వర్ని, జనవరి 23: వర్ని మండలంలోని సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులు పూర్తికావడం కోసం బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఆయకట్టు రైతులు కలిసికట్టుగా కృషి చేద్దామని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రెండు నెలల నుంచి పనులు నిలిచిపోయాయని కాంట్రాక్టర్తో పాటు స్థానిక రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. పనుల నిమిత్తం అవసరమైన మొరాన్ని ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఒక ప్రాంతం నుంచి తరలిస్తుండగా కొందరు నాయకులు అడ్డుకుంటున్నారని స్థానికులు వెల్లడించారు.
స్పందించిన ఎమ్మెల్యే పోచారం అభివృద్ధి పనులను అడ్డుకోవడం అవివేకమని, ఐక్యంగా ఉంటూ రిజర్వాయర్ పనులు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్ణీత గడువులోగా రిజర్వాయర్ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్, అటవీ శాఖ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఎమ్మెల్యే వెంట ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్, ఎస్ఈ వాసంతి, డిప్యూటీ ఈఈ శ్రావణ్ కుమార్, ఏఈ శ్రీనివాస్, ఫారెస్ట్ రేంజ్ అధికారి పద్మారావ్, వర్ని జడ్పీటీసీ సభ్యుడు బర్దావల్ హరిదాస్, ఏఎంసీ వైస్ చైర్మన్ వెలగపూడి గోపాల్, నాయకులు మేక వీర్రాజు, భర్త్యానాయక్, గాజీరాం ఉన్నారు.