డిచ్పల్లి : తెలంగాణ యూనివర్సిటీలో వీసీ, రిజిస్టర్లు చేపడుతున్న అక్రమ అవుట్ సోర్సింగ్ నియామకాలపై ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు టీయూ పూర్వ విద్యార్థి సంఘం, టీఆర్ఎస్వీ, తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక, తెలంగాణ విద్యార్థి పరిషత్, ఎన్ఎస్యూఐ, బీసీ జేఏసీ, బీసీవీఎస్, జీవీఎస్ విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగ యువత అవసరాలను ఆసరాగా చేసుకుని నూతనంగా వచ్చిన విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు జూనియర్ అసిస్టెంట్కు రెండు నుంచి మూడు లక్షల వరకు, అటెండర్కు లక్షన్నర చొప్పున వసూలు చేశారని ఆరోపించారు.
స్వీపర్కు, సెక్యూరిటీ గార్డులకు లక్ష రూపాయలు, ప్రోగ్రామర్కు మూడు లక్షలు, ల్యాబ్ అసిస్టెంట్కు 2 లక్షల చొప్పున పోస్టుకు ఒక్కొక్క రేటు చొప్పున అక్రమగా పాలకమండలి అనుమతి లేకుండా 65 మందిని పైగా భర్తీ చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతనెల 24న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలో ఎటువంటి నియామకాలు చేపట్టరాదని ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ తెలంగాణ విశ్వవిద్యాలయం వీసీ, రిజిష్టర్ పెడచెవిన పెట్టి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని వెల్లడించారు. నిరుద్యోగులను మోసం చేస్తున్న వారిపై ఎమ్మెల్యేగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి విశ్వవిద్యాలయం పరువును కాపాడాలని వారు కోరారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సానుకూలంగా స్పందిస్తూ యూనివర్సిటీలో జరుగుతున్న ఉద్యోగ నియామకాల గురించి పూర్తిగా అవగాహన ఉందని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూ పూర్వ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పంచరెడ్డి చరణ్, టీఆర్ఎస్వీ జిల్లా కన్వీనర్ శ్రీనివాస్గౌడ్, టీవీయూవీ రాష్ట్ర కోఆర్డినేటర్ రామావత్ లాల్సింగ్, టీజీవీపీ రాష్ట్ర కార్యదర్శి భానుచందర్, ఎన్ఎస్యూఐ ఉపాధ్యక్షుడు వరుణ్, టీవీయూవీ జిల్లా కన్వీనర్ రాంపూర్ అజయ్, టీజీవీపీ జిల్లా నాయకులు బొబ్బిలి కళ్యాణ్, బీసీ జేఏసీ నాయకులు సతీశ్, అఖిల్, జీవీఎస్ అధ్యక్షులు జైత్రాం రాథోడ్, టీఆర్ఎస్వీ నాయకులు గులాబ్సింగ్ తదితరులు పాల్గొన్నారు.