నిజామాబాద్ లీగల్ : ఉమ్మడి జిల్లా జ్యూడిషియల్ న్యాయవిచారణలో ఉన్న సివిల్, క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్ట్పోలియో జడ్జి కె.లక్ష్మణ్ అన్నారు. కరొనా మహమ్మారి విలువైన కాలాన్ని న్యాయమూర్తులకు, న్యాయవ్యవస్థకు దూరం చేసిందని దానిని పూడ్చుకోవడానికి శ్రమించాలని తెలిపారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని సమావేశపు హాల్లో న్యాయాధికారుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాత కేసులకు ప్రాధాన్యతనివ్వాలని వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. నూతనంగా నమోదైన కేసులను కక్షిదారులు, న్యాయవాదుల అభిష్టం మేరకు ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. న్యాయాధికారులకు దిశా, నిర్ధేశం చేశారు. ఉమ్మడి జిల్లా జడ్జి గోవర్ధన్రెడ్డి న్యాయస్థానాలలో మౌలిక వసతులు, వివిధ న్యాయస్థానాలలో కేసుల వివరాలు, వాటి స్థితిగతుల వివరాలు తెలిపారు.
అనంతరం నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హైకోర్టు జడ్జి లక్ష్మణ్ మాట్లాడారు. సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులకు మార్గదర్శకులుగా ముందుండి నడిపించాలని అన్నారు. నిరంతర అధ్యయనం, కష్టపడేతత్వమే న్యాయవాదుల నిత్య వృత్తి జీవనంలో పాటించాలని సూచించారు. సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టుల తీర్పులను చదివి అప్డేట్ కావాలని, భారత పార్లమెంట్, రాష్ట్రాల శాసనసభలు రూపొందించే చట్టాలను తెలుసుకోవాలని, చట్టాల సవరణలను గమనిస్తూ ఉండాలన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎర్రం విఘ్నేశ్, జిల్లా జడ్జి గోవర్ధన్రెడ్డి, అదనపు జిల్లా జడ్జిలు గౌతం ప్రసాద్, పంచాక్షరి, సీనియర్ న్యాయవాదులు జివి.కృపాకర్రెడ్డి, రాజలింగం, ప్రభుత్వ న్యాయవాది ఈగ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిర్వహించిన ‘న్యాయవాదులు – న్యాయపరమైన నైపుణ్యాలు’ అనే రెండురోజుల శిక్షణా తరగతులను హైకోర్టు జడ్జి ప్రారంభించారు. ఒకరోజు అధికారిక పర్యటన నిమిత్తం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రోడ్డు భవనాల శాఖ అతిథి గృహానికి చేరుకున్న హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మణ్ను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్, నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ, నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్ చిత్రామిశ్రా కలుసుకుని పుష్పగుచ్ఛాలు అందజేశారు.