లోక్సభ ఎన్నికల వేళ ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు ‘మోదీ కీ గ్యారెంటీ’ అంటూ ప్రచారాన్ని అందుకొన్నారు. అయితే 2014, 2019 ఎన్నికల సమయంతోపాటు అధికారం చేపట్టిన తర్వాత మోదీ ఇచ్చిన హామీలను చాలా వరకు గాలికొదిలేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం రెట్టింపు, పంటలకు కనీస మద్దతు ధర, నల్లధనం వెనక్కి తదితర హామీలు ఒట్టి మాటలుగానే మిగిలిపోయాయి. ఇప్పుడు ‘మోదీ కీ గ్యారెంటీ’ అంటున్న బీజేపీకి.. గతంలో ఇచ్చిన హామీల సంగతేంటి? అని ప్రజల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
PM Modi | న్యూఢిల్లీ, మే 6: గత రెండు లోక్సభ ఎన్నికల సమయాల్లో, అధికారం చేపట్టిన తర్వాత పలు సందర్భాల్లో కేంద్రంలోని బీజేపీ అనేక హామీలు ఇచ్చింది. ప్రధానంగా 2022 నాటికి రైతులు ఆదాయం రెట్టింపు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించింది. దేశంలోని నిరుద్యోగ యువతకు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని గొప్పగా చెప్పింది. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని దేశానికి వెనక్కి తీసుకొచ్చి, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని ప్రధాని మోదీ ప్రచార సభల్లో ఊదరగొట్టారు. వీటిల్లో ఒక్కటి కూడా అమలు చేసిన పరిస్థితి లేదు.
ఆదాయం కాదు.. ఆత్మహత్యలు రెట్టింపు
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ హయాంలో వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. 2022 నాటికి దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని 2016 ఫిబ్రవరిలో ప్రధాని హామీ ఇచ్చారు. అయితే ఆదాయం పెరుగుదల విషయం అటుంచితే, దేశంలో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగాయి. 2014 నుంచి 2023 వరకు దాదాపు లక్షా 12 వేల మంది రైతులు, వ్యవసాయ కార్మికులు ఆత్మహత్య చేసుకొన్నారని ఎన్సీఆర్బీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పైగా అన్నదాతల నడ్డివిరిచేలా వివాదాస్పద వ్యవసాయ చట్టాలను మోదీ సర్కార్ తీసుకొచ్చింది. వీటిపై దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమం చేపట్టడంతో వాటిని ఉపసంహరించుకున్నది.
20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా?
ఏడాదికి 2 కోట్ల చొప్పున ఉద్యోగాలు కల్పిస్తామని 2014 లోక్సభ ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చి పదేండ్లు గడిచినా ఆ హామీ ని నిలబెట్టుకోలేదు. దేశంలో నిరుద్యోగం తారాస్థాయికి చేరింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువకుల్లో దాదాపు సగం మంది ఉపాధి కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొన్నది.
నల్లధనం వెనక్కు తెచ్చారా?
విదేశీ బ్యాంకుల్లో భారతీయుల నల్లధనం భారీగా మూలుగుతున్నదని, దాన్ని వెనక్కు తీసుకొచ్చి దేశ ప్రజలకు పంచుతామని, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షల చొప్పున జమచేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. అయితే ఒక్కరి ఖాతాలో కూడా రూపాయైనా జమ కాలేదు. ఇది బీజేపీ చెప్పిన మరొక ఝూఠా మాట అని చెప్పొచ్చు.
బుల్లెట్ రైలు పరుగులు ఎక్కడ?
దేశంలో 2022 నాటికి బుల్లెట్ రైలును అందుబాటులోకి తీసుకొస్తామని 2018 ఫిబ్రవరిలో ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. జపాన్ సహకారంతో ముంబై-అహ్మదాబాద్ మధ్య ఈ రైలును నడుపుతామని ఆర్భాటంగా ప్రకటించారు. అయితే బుల్లెట్ రైలు ఇప్పటికీ పట్టాలెక్కలేదు. గడువును ప్రభుత్వం ఏటికేడు పొడిగించుకుంటూ పోతున్నది. 2026నాటికి బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తుందని ఇటీవల రైల్వే మంత్రి పేర్కొన్నారు.
దారుణంగా దెబ్బతిన్న ఆర్థికం!
2022 నాటికి దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని మోదీ చెప్పుకొచ్చారు. అయితే కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా తయారైందనే విమర్శలు వస్తున్నాయి. ద్రవ్యోల్బణంతో సామాన్యుడు అతలాకుతలం అవుతున్నాడు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం ఇతర వస్తువులపై పడుతున్నది. మరోవైపు అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎన్నడూ లేని విధంగా అధఃపాతాళానికి పడిపోయింది.
అందరికీ ఇండ్లు.. అందని ద్రాక్షేనా?
2022 నాటికి దేశంలో ప్రతి ఒక్కరి సొంతింటి కల సాకారం అవుతుందని 2018 జూలైలో ప్రధాని మోదీ ప్రకటించారు. అయితే పీఎం ఆవాస్ యోజన కింద ఇండ్ల నిర్మాణం నత్తనడకన సాగుతున్నది. ఈ పథకం కింద 1.2 కోట్ల ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకొన్న కేంద్ర ప్రభుత్వం.. అందులో విఫలమైంది. దీంతో గడువును మరోసారి పెంచింది.
24 గంటల విద్యుత్తు.. పగటి కలే
2022 నాటికి ప్రతి ఇంటికి నిరంతర విద్యుత్తు అందిస్తామని, దేశంలో చీకట్లు పారద్రోలుతామని ప్రధాని మోదీ గతంలో ప్రకటించారు. అయితే ఇచ్చిన హామీ పెండింగ్లోనే ఉండిపోయింది. దేశంలో ఇంకా చాలా ఇండ్లకు విద్యుత్తు కనెక్షన్లు లేవు.