Sunita Williams | వాషింగ్టన్, మే 6: భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ ముచ్చటగా మూడోసారి రోదసి యాత్రకు వెళ్లనున్నారు. బోయింగ్ సంస్థకు చెందిన ‘స్టార్లైనర్’ వ్యోమనౌకలో ఆమె మరో వ్యోమగామి బచ్ విల్మోర్తో కలసి అంతరిక్షయానం చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8 గంటల 4 నిమిషాలకు ఫ్లోరిడాలోని కేప్ కెనవరాల్ లాంచింగ్ స్టేషన్ నుంచి ఈ వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లనున్నది.
ఇందులో మిషన్ పైలట్గా వ్యవహరించనున్న సునీతా విలియమ్స్ (58).. అంర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుని అక్కడ వారం రోజులపాటు గడపనున్నారు. ఈ రోదసి యాత్రకు తాము సిద్ధంగా ఉన్నామని, మూడోసారి అంతరిక్షయాత్రలో పాల్గొనడం సంతోషంగా ఉన్నదని సునీతా విలియమ్స్ తెలిపారు. ఈ యాత్ర విజయవంతమైతే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సిబ్బందిని తీసుకెళ్లి, తీసుకొచ్చిన రెండవ ప్రైవేట్ సంస్థగా బోయింగ్ ఆవిర్భవిస్తుంది.