పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కర్షకుల ఆనందోత్సాహాల మధ్య అద్భుతమైన జలదృశ్యం ఆవిష్కృతమైంది. 300 కిలోమీటర్ల దూరంలోని కాళేశ్వర జలాలు ఎదురెక్కుతూ వరద కాలువ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చేరాయి. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం అనే మాటకు నిదర్శనంగా పునరుజ్జీవ పథకం విజయవంతమై కండ్ల ముందు సాక్షాత్కరించింది. ముప్కాల్ మండలకేంద్రంలోని పంప్హౌస్లో నాలుగు మోటర్ల ద్వారా నీటిని శుక్రవారం ఎస్సారెస్పీలోకి విడుదల చేశారు. శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి , దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సురేశ్రెడ్డి, ఎమ్యెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్రెడ్డి, రేఖానాయక్, విఠల్ రెడ్డి పాల్గొని రైతులతో కలిసి కాళేశ్వరం జలాలను ఎస్సారెస్పీలోకి విడుదల చేసే కార్యక్రమం పండుగలా సాగింది. వర్షాభావ పరిస్థితుల్లోనూ ఎస్సారెస్పీలో జలసవ్వడులను చూసి అన్నదాతలు మురిసిపోయారు. ప్రస్తుతం 20.7టీఎంసీల మేర ఎస్సారెస్పీలో నీటి నిల్వ ఉన్నందున సీఎం కేసీఆర్ ఆదేశాలతో మరో 30 టీఎంసీల వరకు కాళేశ్వరం నీటిని తరలించనున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచే నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు మిషన్ భగీరథ ద్వారా తాగు నీటిని అందించనున్నారు.
-నిజామాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
కమ్మర్పల్లి, ముప్కాల్, మెండోరా, బాల్కొండ, జూలై 7: శ్రీరామ సాగర తీరమంతా రైతులతో సందడి వాతావరణం నెలకొన్నది. మహత్తర ఘట్టం ఆవిష్కృతమవుతున్న వేళ అన్నదాతలు సంబురాలు చేసుకున్నారు. కాళేశ్వరం జ లాలు శుక్రవారం ఎస్సారెస్పీలోకి చేరుతున్న తీరును రైతులు కండ్లారా చూస్తూ సంతోషం వ్యక్తంచేశారు. కాళేశ్వరం జ లాలను శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి విడుదల చేసిన కార్యక్రమం పండువలా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలువైపుల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముప్కాల్ పంప్హౌస్ నుంచి కాళేశ్వరం జలాలు బిరబిరా పారుతూ శ్రీరాంసాగర్లోకి చేరుతున్న దృశ్యాన్ని తిలకించిన రైతులు పెద్ద ఎత్తున హర్షద్వానాలతో ఈలలు వేస్తూ సంబురంలో మునిగిపోయారు.
జై కేసీఆర్, జై వేముల ప్రశాంత్ రెడ్డి అంటూ నినాదాలతో హోరెత్తించారు. సెల్ఫీలు తీసుకుంటూ జలదృశ్యాలను సెల్ఫోన్లలో బంధించుకున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రైతులతో కలిసి కాళేశ్వరం జలాలు ఎస్సారెస్పీలో కలుస్తున్న తీరం వద్ద తిలకిస్తూ కలియతిరిగారు. పునరుజ్జీవ పథకంలో శ్రమించిన ఇంజినీర్లు, అధికారులను మంత్రులు, సభాపతి ప్రత్యేకంగా సన్మానించి ప్రశసించడం ఇంజినీర్లలో ఎంతో సంతోషాన్ని నింపింది. పునరుజ్జీవం విజయవంతమై ఎస్సారెస్పీని నింపుతున్న దృశ్యాలను చూసి ఇంజినీర్లు సైతం సంబురపడ్డారు. రైతులు జలదృశ్యాన్ని చూస్తూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ఖద్దరు ఇంజినీరు అంటూ ఆనందంగా పిలుచుకోవడం కనిపించింది.
ఒకప్పుడు గోదావరి నీళ్లు మనకొస్తయా? ఎట్లా వస్తాయి. గోదావరిమట్టం నుంచి అర కిలోమీటరు ఎత్తులో ఉన్నం. మరి ఇంతెత్తుకు నీరు పారకం సాధ్యమా? అన్న అనుమానాలు తమలో ఉండేవని.. సమైక్య పాలకులు ఇదే భయాన్ని చూపి తెలంగాణను ఎడారి చేశారని స్పీకర్ గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనుడు సీఎం కేసీఆర్ మాత్రమేనని చెప్పారు. లక్షల ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు ఇచ్చిన గొప్ప వ్యక్తి అంటూ కీర్తించారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ అసమర్థ పాలన, తెలుగుదేశం పక్షపాత పాలనలో జరిగింది ఏంటంటే.. మన మీది నుంచి గోదావరి సముద్రంలోకి పోయేది తప్ప అందులో వాటాగా మనకొచ్చే గోదావరి జలాలు మాత్రం పంట పొలాలకు చేరేది కాదన్నారు. గోదావరిలో చుక్కా నీరు లేదు.. కానీ శ్రీరాంసాగర్లోకి నీళ్లు మాత్రం ఎదురెక్కి వచ్చి కలుస్తున్నాయని వివరించారు. ఎక్కడో పుట్టి అడవుల్లో నుంచి వచ్చే ప్రాణహిత జీవనది గోదావరిలో కలిసే మేడిగడ్డ వద్ద ఆనకట్టు నిర్మాణం జరిగిందని, పైన సుందిళ్ల, ఆపైన అన్నారం ప్రాజెక్టు ఉన్నదన్నారు. ఆ పక్కన ఎల్లంపల్లి 30 టీఎంసీలతో కట్టారని, మిడ్మానేరు పూర్తి చేశారని చెప్పారు. అనంతసాగర్, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ చెప్పుకుంటూ పోతే కనీవినీ ఎరుగని ప్రాజెక్టులను కేసీఆర్ నిర్మించారని వివరించారు. గతంలో ఇదంతా ఎందుకు సాధ్యపడలేదో ప్రజలే ఆలోచన చేయాలన్నారు.
ప్రజలంతా కేసీఆర్కు మద్దతుగా నిలవాలి…
రైతును కాపాడుకోవాలనే తెలివితేటలు గతంలో ఏ ముఖ్యమంత్రికీ కనిపించలేదన్నారు. రైతును కాపాడుకోవాలనే ధ్యాస ఉండేది కాదన్నారు. కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో.. మధ్యలో రెండేండ్లు కరోనాతో పోయినప్పటికీ ఐదారు సంవత్సరాల్లోనే 60 ఏండ్లలో పాలించిన దద్దమ్మల కన్నా ఎక్కువగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారని వివరించారు. గతంలో ఒక పార్టీలో నాయకుడిని ముఖ్యమంత్రిని చేస్తే అతను ప్రజలను మరిచిపోయి కుర్చీ కాపాడుకోవడానికే సమయం సరిపోయేదన్నారు. తెలంగాణకు పదేండ్లలో ఒకరే నాయకుడు… ఒక్కరే ము ఖ్యమంత్రి… భవిష్యత్తులో కూడా తెలంగాణ సీఎం కేసీఆరే అని చెబు తాం అంటూ తెలిపారు. మిగిలిన ఆ రెండు పార్టీలు వాళ్ల సీఎం అభ్యర్థి ఎవరో చెప్పగలరా? దమ్ముందా? అంటే వారికి అంతలేదంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి చరిత్ర అందరికీ తెలుసని, బండి సంజయ్ నోటికొచ్చినట్లు ఒర్రి కింద పడిపోయిండని ఎద్దేవా చేశారు. పండ్లు ఇచ్చే చెట్టుకే నీరు పోయాలి.. ముండ్లు ఇచ్చే చెట్లను పీకి పారేయాలని హితవు పలికారు.
మంత్రి వేములపై ప్రశంసల వర్షం
పునరుజ్జీవ పథకం విజయవంతమై కాళేశ్వరం జలాలతో ఎస్సారెస్పీని నింపుకోవడం ప్రారంభించిన చారిత్రక కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిసింది. శాసన పునరుజ్జీవ పథకం విజయవంతం కావడంలో, ఈ పథకం తేవడంలో కేసీఆర్ సహకారంతో వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన కృషి ఎంతో గొప్పదని సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అభినందించారు. పునరుజ్జీవం పథకంలో ఆది నుంచి నేటి వరకు మంత్రి వేముల కర్త, కర్మ,క్రియగా పనిచేశారని సభాపతి ప్రశంసించారు. ఎంపీ సురేశ్ రెడ్డి, ఎమ్యెల్యేలు జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, విఠల్ రెడ్డి మంత్రిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ రైతాంగానికి ఎనలేని మేలు చేసే గొప్ప పనిని విజయవంతం చేసి అందించడంలో మంత్రి వేముల పడ్డ శ్రమ అంతా ఇంతా కాదని అభినందించారు. కార్యక్రమం కొనసాగుతున్నంత సేపు రైతులు ప్రశాంత్ రెడ్డిని ప్రశంసించడం విశేషం.
కేసీఆర్ ఆలోచనలకు ప్రతిరూపం : వేముల ప్రశాంత్రెడ్డి, రాష్ట్ర మంత్రి
రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆలోచించి సీఎం ఆదేశాలతో ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకాన్ని మొదలుపెట్టి కాళేశ్వరం జలాలను వెనక్కి మళ్లించే ప్రక్రియ మొదలైందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రైతులను కాపాడుకోవాలని ఎస్సారెస్పీలో 20టీఎంసీలకు అదనంగా 30 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని సీఎం ఆదేశించారని చెప్పారు. ఆరు రోజుల క్రితం 300 కిలోమీటర్లు దూరంలో ఉన్న నీటిని 8 పంపుల ద్వారా లిఫ్ట్ చేసి కాళేశ్వరం నీళ్లను వెనక్కి పంపించారని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభ దశలో గోదావరి, కృష్ణలో తెలంగాణ వాటా ఎంత అని అడిగిన సందర్భంలో అప్పటి సమైక్య పాలకులు అన్న మాటలు వికారంగా ఉండేవని తెలిపారు. అప్పుడు ఈ ప్రాంతానికి చెందిన వారంతా మన కథ, మన పరిస్థితి గింతేనేమో అంటూ కుమిలిపోయారని చెప్పారు. నీళ్లు పైకి ఎలా వస్తాయి అనుకున్న చోటనే ఒకే ఒక్క మొనగాడు కేసీఆర్ ద్వారా నీళ్లు రకరకాలుగా మలుపులు తిరిగి ఈ రోజు ఎస్సారెస్పీకి ఎదురెక్కి వచ్చాయంటూ అభివర్ణించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన అనేక చర్చోపచర్చలు, మేథోమధనాలతో కార్యరూపం దాల్చిందన్నారు. ఇందుకోసం ప్రాణహిత నది నుంచి దిగువకు పారే వృథా జలాల నీళ్లపై వందేండ్ల డాటాను కేసీఆర్ శోధించారని చెప్పా రు. ప్రాణహిత ద్వారా అతి తక్కువ అవుట్ ఫ్లో గోదావరి మీదుగా సముద్రంలో కలిసి 350 టీఎంసీలు అని చెప్పారు. ఇదీ ఎస్సారెస్పీకి నాలుగింతలని తెలిపారు. ఇంతకు పదింతల నీళ్లు కూడా ప్రాణహిత సంగమ క్షేత్రం వద్ద ఉందని గ్రహించిన సీఎం కేసీఆర్ ఆనకట్ట కట్టిండన్నారు. కేసీఆర్ అంటే ఏంటో ఎస్సారెస్పీకి చేరిన కాళేశ్వరం నీళ్లతో అంచనా వేయొచ్చంటూ మంత్రి వేముల తెలిపారు.
ఎస్సారెస్పీకి ఇక ఢోకా లేదు. శుక్రవారం అద్భుతమైన జలదృశ్యం ఆవిష్కృతమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ నుంచి ఎత్తిపోసిన జలాలు ఎల్లంపల్లి మీదుగా గాయత్రి పంప్హౌస్ నుంచి అండర్ టన్నెల్ దాటుకొని రాంపూర్, రాజరాజేశ్వరరావుపేట పంప్హౌస్ల గుండా వరద కాలువ మీదుగా ముప్కాల్ పంప్హౌస్కు చేరిన కాళేశ్వరం నీళ్లు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి చేరాయి. ఈ అద్భుతమైన ఘట్టాన్ని మూడో పంప్ హౌస్ వద్ద ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్ రెడ్డి, విఠల్ రెడ్డి, రేఖానాయక్, ఎంపీ సురేశ్ రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డిలతో కలిసి స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి స్విచ్ఛాన్ చేసి నాలుగు మోటర్ల ద్వారా కాళేశ్వరం నీళ్లను ఎస్సారెస్పీలోకి వదిలారు. అనంతరం నిర్వహించిన సభలో రైతులనుద్దేశించి సభాపతి, మంత్రులు ప్రసంగించారు.
సీఎంకు తప్పక కృతజ్ఞతలు చెప్పుకుందాం : ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర మంత్రి
చిన్నప్పుడు తాను నిర్మల్లో చదువుకునే సమయంలో ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు ప్రధాని హోదాలో నెహ్రూ వస్తే తాను కూడా వచ్చినట్లు రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. అనంతరం పీవీ హయాంలో వరద కాలువ సమయంలోనూ ఎంపీ హోదాలో హాజరైనట్లుగా చెప్పారు. ఇప్పుడేకంగా కాళేశ్వరం ప్రాజెక్టు పథకంలో భాగంగా చారిత్రాత్మకమైన సందర్భంలో పాలుపంచుకోవడం అదృష్టమన్నారు. ఎస్సారెస్పీకి ఎలాంటి ఢోకా లేకుండా ఆయకట్టు రైతులకు భరోసా కల్పించేలా కేసీఆర్ ఈ పథకానికి నాంది పలికారన్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 3లక్షల ఎకరాల ఆయకట్టుకు భరోసా లభిస్తుందన్నారు. ఎస్సారెస్పీని నింపుకొన్న తర్వాత సీఎంను తప్పక పోచంపాడ్కు తీసుకురావాలని తన అభిమతాన్ని స్పీకర్ పోచారం, మంత్రి వేముల ముందు ఐకేరెడ్డి పెట్టారు. కాళేశ్వరం జలాల రాకను చూసేందుకు రైతులను టూర్ మాదిరిగా ఇక్కడికి పంపించాలని పిలుపునిచ్చారు. పోచంపాడ్పైన బాబ్లీ గేట్లు ఎత్తినా చుక్కా నీరు రాలేదని, ఎగువ 110 టీఎంసీలు సామర్థ్యం గల మహారాష్ట్ర ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపారు. అవన్నీ నిండి వరద ఎస్సారెస్పీకి రావాలంటే కష్టంగా ఉంటుందనే.. కాళేశ్వరం జలాలను పునరుజ్జీవ పథకంలో భాగంగా మళ్లించడం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమని ఐకే రెడ్డి చెప్పారు.
అక్కడ కేసీఆర్ ఉండాల : ఇక్కడ ప్రశాంత్ రెడ్డి ఉండాల
అక్కడ కేసీఆర్ సారే ఉండాల.. ఇక్కడ మా దగ్గర ప్రశాంత్న్ననే ఉండాల. ఈ రోజు కాళేశ్వరం నీళ్లు వచ్చి పోచంపాడ్ గంగల నిండుతున్నయి. కాళేశ్వరం నీళ్లను తెచ్చి పోచంపాడ్ డ్యాంల నింపి రైతులకు రంది లేకుండ చేస్తం అని కేసీఆర్ సార్, ప్రశాంతన్న చెప్పినప్పుడు సంతోషం అనిపించింది. ఇప్పుడు వాళ్లిద్దరు చేసి సుపిచ్చిండ్రు. గందుకనే రాష్ట్రంలో కేసీఆర్ ఉండాల.. బాల్కొండలో ప్రశాంతన్న ఉండాల.
కేసీఆర్ అందించిన వరం
పునరుజ్జీవ పథకం మా రైతాంగానికి సీఎం కేసీఆర్ అందించిన వరం. ఈ పథకం నిజమవుతుందని మొదటి నుంచి నమ్ముతూ వచ్చాం. సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మా నమ్మకాన్ని నిజం చేశారు. నెల రోజులుగా వర్షాలు లేక ఆందోళన చెందుతున్న మాకు ఈరోజుతో ఆ బాధ తీరిపోయింది. రైతులకు కేసీఆర్ను మించి మేలు చేసే నాయకులు లేరనేది పునరుజ్జీవ పథకంతో రుజువైంది.
మిట్టపల్లి మహేందర్, రెంజర్ల వాన రంది బందైపోయింది..
కాళేశ్వరం నీళ్లను తెచ్చి పోచంపాడ్ డ్యాములో పోస్తున్నరంటే ఇగ వానల రంది బందైపోయినట్లే. వానలు ఎనుక ముందు పడ్డా.. పడకున్నా బేఫికర్ గా పంటలేసుకోవచ్చు. మహారాష్ట్రల వానలు పడకున్నా డ్యాంల కాళేశ్వరం నీళ్లు ఉంటయి కాబట్టి టైంమీదనే పంటలు మొదలు పెట్టుకోవచ్చు.
-బద్దం రాజారెడ్డి, కొత్తపల్లి
సిన్న బొన్న విషయం కాదు
ఇక్కడికెళ్లి మూడువందల కిలోమీటర్ల దూరంల ఉన్న నీళ్లను అద్ద కిలోమీటరు చడావ్ మీద ఉన్న మన పోచంపాడ్ డ్యాంలకు తెచ్చి నింపుడంటే సిన్న బొన్న ముచ్చట కాదు. గిసుంటి భారీ పనులు సెయ్యాలంటే కేసీఆర్ సార్తోనే సాధ్యమయితది. కాళేశ్వరం నీళ్లు గంగ పారినట్టు పెద్దపెద్ద పైపులల్ల కెళ్లి డ్యాంల దుంకుతుంటే గంటల కొద్దీ సుడబుద్దయ్యింది.
-నర్సయ్య, బస్సాపూర్