ఇందూరు అభివృద్ధిని చూసి పంజాబ్ ప్రజాప్రతినిధులు ఫిదా అయ్యారు. కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ను సందర్శించి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. పంజాబ్ ప్రతినిధుల బృందం శనివారం నిజామాబాద్కు రాగా, అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ అధ్యక్షుడు మహేశ్ గుప్తా వారిని సాదరంగా ఆహ్వానించారు. నగర అభివృద్ధిని గురించి వివరించిన అనంతరం నూతన కలెక్టరేట్కు తీసుకెళ్లారు. సమీకృత కలెక్టరేట్ను చూసి అతిథులు నోరెళ్లబెట్టారు. ఢిల్లీలో కేంద్ర మంత్రుల చాంబర్ల కన్నా, ఇక్కడి కలెక్టర్ చాంబర్ బాగున్నదని పంజాబ్ స్పీకర్ కుల్తార్సింగ్ సాంద్వాన్ అన్నారు. తెలంగాణ పథకాలు బాగున్నాయని ప్రశంసలు కురిపించారు.
– నిజామాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఇందూరు అభివృద్ధికి పంజాబ్ స్పీకర్ ఫిదా
నిజామాబాద్, డిసెంబర్ 24, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ నగరానికి శనివారం అనుకోని అతిథులు వచ్చారు. వారంతా ఉత్తర భారతదేశానికి చెందిన ప్రజా ప్రతినిధులు. అందులో ఒకరు పంజాబ్ రాష్ట్ర శాసన సభాపతి కుల్తార్ సింగ్ సాంద్వాన్ కాగా మరొకరు రాజ్యసభ సభ్యుడు పి.విక్రమ్ జిత్ సింగ్ సహాని, ఎమ్మెల్యేలు కుల్వంత్ సింగ్ పండోరి, అమర్జిత్ సింగ్ ఉన్నారు. వీరిలో స్పీకర్ సాంద్వాన్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా హైదరాబాద్లో కలిసి చదువుకున్నారు. కుల్తార్ సింగ్ సాంద్వాన్కు అర్బన్ ఎమ్మెల్యేనే సీనియర్ కావడం విశేషం. చండీఘర్ నుంచి విమానంలో హైదరాబాద్కు శనివారం ఉదయం వచ్చారు. అక్కడి నుంచి అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తాతో కలిసి రోడ్డు మార్గంలో నిజామాబాద్ నగరానికి వచ్చారు.
మార్గమధ్యంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని చూస్తూ, ఆయా విశేషాలను తెలుసుకుంటూ కుల్తార్ సింగ్ ఆశ్చర్యానికి గురయ్యారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు, వైకుంఠధామాలు, హరితహారం ఇలా ఒకటేమిటి కనిపించినా ప్రతి విశేషాన్ని గణేశ్గుప్తా స్వయంగా వివరిస్తూ వచ్చారు. నగరానికి చేరుకోగానే నూతన సమీకృత కలెక్టరేట్ను చూపించడంతో వారంతా ముక్కున వేలేసుకున్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రుల చాంబర్ కూడా ఇంత అద్భుతంగా లేదంటూ కలెక్టర్, అదనపు కలెక్టర్, మంత్రుల చాంబర్లను పరిశీలించిన అనంతరం ఆశ్చర్యం వెలిబుచ్చడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
రైతు సేవ.. దేశ సేవతో సమానం..
‘జై జవాన్.. జై కిసాన్ అనే నినాదం అందరూ ఇస్తారు. దానిని నిజం చేసింది కేవలం కేసీఆర్ ఒక్కరే. రైతులను పట్టించుకున్న వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రే..’ అని పంజాబ్ స్పీకర్ కుల్తార్ సింగ్ సాంద్వాన్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. కేసీఆర్ లాంటోళ్లు పాలిస్తే రైతులకు కనీస మద్దతు ధర అన్నది తథ్యంగా అమలవుతుందన్నారు. ఢిల్లీలో రైతులు ధర్నా చేసినప్పుడు మేమంతా అండగా నిలిచి వారితో పాటు ఆందోళన చేశామంటూ నాటి రైతుల బాధలను గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ రైతులకు కేసీఆర్ చేసిన సాయాన్ని రైతులంతా గుర్తు చేసుకుంటూ పెద్ద ఎత్తున చర్చించుకున్నారని తెలిపారు. ఎకరాకు రైతుకు రూ.10వేలు ఇవ్వడం నిజంగా ఆశ్చర్యంగానే ఉందని 70 ఏండ్లలో ఎవరూ ఇలాంటి ప్రయత్నం చేయలేదన్నారు. ‘ఇంటింటికీ తాగునీరు, పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి ఇవ్వడం చాలా పెద్ద విషయం. రైతు బాగుంటే సమాజం బాగుంటుంది. రైతు సేవ దేశ సేవతో సమానం. మనం వేసుకునే చెప్పులకు ధర ఉంది కానీ రైతు పండించే పంటకు కనీస మద్దతు ధర లేదు. అగ్లీ సర్కార్ కిసాన్ సర్కార్..’ అని పేర్కొన్నారు.
వహ్వా కలెక్టరేట్..
నిజామాబాద్ సమీకృత కలెక్టరేట్ను పరిశీలించిన సమయంలో పంజాబ్ స్పీకర్ కుల్తార్ సింగ్ సాంద్వానాతో పాటు ఇతర ఎంపీ, ఎమ్మెల్యేలంతా మంత్ర ముగ్ధులయ్యారు. తమ వద్ద ముఖ్యమంత్రి చాంబర్ కూడా ఇంతగా లేదంటూ ప్రశంసించారు. ఢిల్లీలో సెంట్రల్ మినిస్టర్ చాంబర్లు కూడా ఇంతలా లేవని వ్యాఖ్యానించారు. కలెక్టర్, అదనపు కలెక్టర్ల చాంబర్లు అద్భుతంగా ఉన్నాయన్నారు. మొదటి అంతస్తులో మంత్రి చాంబర్ను పంజాబ్ ప్రతినిధుల బృందం సందర్శించారు.
సమావేశ మందిరాన్ని చూసి కార్పొరేట్ బంగ్లాలా ఉందన్నారు. ఐటీ కంపెనీల్లోనూ ఇంత అద్భుతమైన నిర్మాణం ఉండదంటూ వారంతా గుసగుసలాడడం కనిపించింది. ఒకే చోట కార్యాలయాలన్నీ ఉండడం ద్వారా ప్రజలకు అద్భుతమైన సేవలు అందుతున్నాయని అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రా మిశ్రాతో పాటుగా ఎమ్మెల్యే గణేశ్ గుప్తా వారికి వివరించారు. పక్కనే నిర్మించిన ఐటీ హబ్ విశిష్టతలను గణేశ్గుప్తా వారికి వివరించారు. అతిథులకు ఎమ్మెల్యే తన నివాసంలో గౌరవ మర్యాదాలు చేయగా వారంతా గణేశ్ గుప్తా మాతృమూర్తి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
వారి ఆనందం మాటల్లో చెప్పలేనిది..
బిగాల గణేశ్ గుప్తా, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే
నిజామాబాద్ నగర సందర్శనకు పంజాబ్ స్పీకర్ కుల్తార్ సింగ్ సాంద్వాన్తో పాటు అక్కడి రాజ్యసభ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు రావడం సంతోషం అనిపించింది. పంజాబ్ స్పీకర్, నేను హైదరాబాద్లో కలిసి చదువుకున్నాం. ఆయనకు నేను సీనియర్ అయినప్పటికీ కాకతాళీయంగా ఇప్పుడు రాజకీయాల్లో ప్రజా ప్రతినిధులుగా ఇద్దరం కొనసాగడం ఆశ్చర్యంగా ఉంది. తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూసి వారంతా ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.
వైకుంఠాధామాలు, రోడ్లు, కలెక్టరేట్ బిల్డింగ్ ఇలా ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు. కేంద్రం నుంచి సహకారం లేకున్నా తెలంగాణలో ఇంతగా అభివృద్ధి జరగడం కేసీఆర్ గొప్పతనానికి నిదర్శనమని వారంతా అన్నారు. ముఖ్యంగా డబుల్ బెడ్ రూం ఇండ్లను చూసి అద్భుతమని ప్రశంసించారు. మీడియా సమావేశంలో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ అధ్యక్షుడు బిగాల మహేశ్ గుప్తా, మేయర్ నీతూకిరణ్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్, సిర్ప రాజు, దండు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.