నిజామాబాద్ క్రైం/ కామారెడ్డి, అక్టోబర్ 21 : నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, జితేశ్ వీ పాటిల్, నిజామాబాద్ సీపీ కల్మేశ్వర్, కామారెడ్డి ఎస్పీ సింధూశర్మ, అధికారులు అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.
పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అన్నారు. నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని పోలీస్పరేడ్ గ్రౌండ్లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పోలీసు అమరవీరులకు నివాళులర్పించి మాట్లాడారు. ఏ ప్రాంతంలోనైతే శాంతి భద్రతలు నెలకొని ఉంటాయో, ఆ ప్రాంతం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా, ఎలాంటి విపత్తు సంభవించినా ముందు స్పందించేది పోలీసులేనని అన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉందని తెలిపారు. సాంకేతికతను అందిపుచ్చుకొని అతి తక్కువ సమయంలో పోలీసులు కేసులను ఛేదిస్తున్నారని అన్నారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నదన్నారు. ఈ సంవత్సర కాలంలో దేశవ్యాప్తంగా 189 మంది పోలీస్సిబ్బంది తమ ప్రాణాలను అర్పించారని గుర్తుచేశారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో 1986వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు 19 మంది పోలీసు అధికారులు అమరవీరులయ్యారని తెలిపారు.
దేశం, రాష్ట్రం కోసం విధి నిర్వహణలో ఉన్న పోలీస్ సిబ్బంది తమ ప్రాణాలను త్యాగం చేశారని, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు కృషిచేస్తున్నారని సీపీ కల్మేశ్వర్ అన్నారు. 1959 అక్టోబర్ 21న విధి నిర్వహణలో ఉన్న పది మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారని గుర్తుచేశారు. అక్సాయ్చిన్ వద్ద చైనా ఎదురుదాడిలో అసువులు బాసిన వీర జవాన్ల జ్ఞాపకార్థం పోలీసు అమరవీరుల సంస్మరణ దినం జరుపుకొంటున్నట్లు తెలిపారు. అమరులను స్మరిస్తూ జ్యోతి ప్రజ్వలన చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం అమరవీరుల కుటుంబాలకు పట్టాలు, గిఫ్ట్ ప్యాక్లను కలెక్టర్, సీపీ అందజేశారు. కార్యక్రమంలో అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసులు జయరాం, గిరిరాజు, ట్రాఫిక్, టాస్క్ఫోర్స్, సైబర్క్రైం, సీసీఆర్బీ ఏసీపీలు కిరణ్ కుమార్, నారాయణ, రాజశేఖర్ రాజ్, వేణుగోపాల్రెడ్డి, రవీందర్రెడ్డి, ఎస్బీఐ శ్రీశైలం, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, ఆర్ఐలు, పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాకేంద్రంలోని పోలీసు కార్యాలయంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. పోలీసు అమరవీరులకు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎస్పీ సింధూశర్మ నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పర్యవేక్షణలో నిరంతరం శ్రమిస్తూ, ప్రాణాలను లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల పాత్ర మరువలేనిదని అన్నారు. కామారెడ్డి జిల్లా నుంచి ఏడుగురు పోలీసు అధికారులు విధి నిర్వహణలో అమరులయ్యారని ఎస్పీ సింధూశర్మ తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.