నిజామాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సార్వత్రిక సమరంలో భాగంగా రాష్ట్రంలోని పార్లమెంటరీ నియోజకవర్గాలకు నాలుగో విడుతగా పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ను అనుసరించి నిజామాబాద్ కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజీవ్గాంధీ హన్మంతు నోటిఫికేషన్ను విడుదల చేయనున్నారు. నేటి (గురువారం) నుంచి ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.
ఆదివారం మినహాయిస్తే నామినేషన్ల దాఖలకు 7 రోజులపాటు అవకాశం ఉన్నది. ఎన్నికల్లో పోటీచేసేందుకు ఉత్సాహం చూపుతున్న వారంతా ఈసీ నిబంధనలకు మేరకు ఇప్పటికే తమ నామినేషన్ల ఏర్పాట్లు చేసుకున్నారు. న్యాయ నిపుణుల సహాయ, సహకారాలతో తప్పులు దొర్లకుండా కసరత్తు పూర్తి చేయగా, మంచి ముహూర్తం చూసుకొని దాఖలు చేయనున్నారు. జహీరాబాద్ లోక్సభ స్థానానికి రిటర్నింగ్ అధికారిగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తున్నారు.
నేటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. వాటిని 26న పరిశీలించి తప్పులుంటే తిరస్కరిస్తారు. అభ్యర్థులు తమ నామినేషన్ను విత్డ్రా చేసుకునేందుకు ఏప్రిల్ 29 వరకు ఈసీ అవకాశం ఇచ్చింది. ఈ గడువు ముగిసిన వెంటనే బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించి ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తారు. మే 13న పోలింగ్ నిర్వహించనుండగా, నామినేషన్ల ఘట్టం అనంతరం మే 11న సాయంత్రం 5గంటల వరకు.. అభ్యర్థులకు సరిగ్గా రెండు వారాలపాటు ప్రచారానికి అవకాశం ఉంటుంది. జూన్ 4న కౌంటింగ్ అనంతరం ఫలితాలను వెల్లడిస్తారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. సిబ్బంది నియామకం, శిక్షణ కార్యక్రమాలు ఇప్పటికే కొనసాగుతున్నాయి.
నెలక్రితమే సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలకాగా, అప్పటినుంచే దేశ వ్యాప్తంగా కోడ్ అమల్లోకి వచ్చింది. సరైన పత్రాలు లేకుండా మద్యం, రూ.50 వేలకు మించి నగదును తరలిస్తే సీజ్ చేస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో అడుగడుగునా తనిఖీలు నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఉమ్మడి జిల్లాలో అంతగా తనిఖీలు కనిపించడంలేదు. కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే కొన్నిచోట్ల ఏర్పాటు చేసిన చెక్పోస్టులను సైతం ఎత్తేశారు. పోలింగ్కు ఎక్కువ రోజుల సమయం ఉండడంతో అధికారులు అంత సీరియస్గా తీసుకోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయితే నేడు నోటిఫికేషన్ జారీ కానుండడంతో ఎన్నికల కోడ్ను పకడ్బందీగా అమలు చేసేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించడంలో భాగంగా అనుమానాస్పద వ్యక్తులతోపాటు నగదు, మద్యం నిల్వలు, రవాణాపై నిఘా పెట్టనున్నారు.