జిల్లాలో శాసనసభ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. బుధవారం జిల్లా కేంద్రంతోపాటు ఆయా నియోజక వర్గాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో సిబ్బందికి పోలింగ్ సామగ్రి అందజేశారు. కేంద్రాలను కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు పర్యవేక్షించారు. పోలింగ్ గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఓటరు స్లిప్పులు లేని వారు ఎన్నికల కమిషన్ సూచించిన గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక దానిని తీసుకెళ్లి ఓటు వేయవచ్చు. ఒక రోజు ముందుగానే సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఆరు నియోజకవర్గాల్లో 13,65,811 మంది ఓటర్లు ఉండగా 1549 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బంది ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకున్నారు. పోలింగ్ పూర్తయ్యే వరకు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
బోధన్, నవంబర్ 29: బోధన్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ బుధవారం సాయంత్రానికల్లా అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నియోజకవర్గంలో పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. నియోజకవర్గంలో 246 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే అదనంగా ఏడు పోలింగ్ స్టేషన్లను ఏర్పాటుచేశారు. మొత్తం 246 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన ఎన్నికల సామగ్రి, సిబ్బంది తరలింపు, ఎన్నికల నిర్వహణకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్ కేంద్రాన్ని (డీఆర్సీ) బోధన్ పట్టణంలోని విజయమేరీ హైస్కూల్లో ఏర్పాటుచేశారు. బుధవారం ఉదయం నుంచే ఈ డీఆర్సీ కేంద్రం నుంచి ఆయా పోలింగ్ స్టేషన్లకు ఈవీఎంలు, వీవీ ప్యాట్లు తరలింపు ప్రారంభమైంది. పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామగ్రితో బుధవారం సాయంత్రానికల్లా సంబంధిత పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. నియోజకవర్గంలోని ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి, ఒక పోలింగ్ ఆఫీసర్, ఇతర సిబ్బందిని నియమించారు. అదనంగా 50 మంది ప్రిసైడింగ్ అధికారులు, మరో 50 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులను రిజర్వులో ఉంచారు. నియోజకవర్గంలో మొత్తం 24 రూట్లను ఏర్పాటుచేశారు. ఒక్కో రూట్కు ఒక సెక్టోరియల్ ఆఫీసర్ పర్యవేక్షిస్తారు. పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తును ఏర్పాటుచేశారు.
జిల్లా కేంద్రంలో భద్రపర్చిన ఈవీఎంలు బోధన్ డీఆర్సీ కేంద్రానికి రాగా, ఇక్కడ వాటిని ర్యాండమైజేషన్ (తారుమారు) చేసి పోలింగ్ స్టేషన్లకు కేటాయించారు. ఈవీఎంలకు చెందిన కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్లను అందించారు. ఒక్కో పోలింగ్ స్టేషన్లో ఒక్కో ఈవీఎంను ఉంచుతారు. ఏదైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే, అదనంగా కేటాయించిన ఈవీఎంలను ఉపయోగిస్తారు.
ఈనెల 11న ఎన్నికల కమిషన్ ప్రచురించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం బోధన్ నియోజకవర్గంలో మొత్తం 2,20,068 మందికి ఓటుహక్కు ఉంది. వీరిలో పురుషులు 1,05,573, మహిళలు 1,14,490 మంది ఉన్నారు. ఇతరులు ఐదుగురు ఉన్నారు. వీరంతా గురువారం తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
దివ్యాంగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈసారి ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ బాధ్యతను ఐసీడీఎస్ శాఖకు అప్పగించారు. నియోజకవర్గంలోని దివ్యాంగుల కోసం 141 లొకేషన్లలో 141వీల్ చైర్లు ఏర్పాటుచేశారు. పోలింగ్ స్టేషన్లు ఏర్పాటుచేసిన భవనాలకు మెట్లే కాకుండా ర్యాంప్లు ఉన్నట్లయితే, వీటిలో దివ్యాంగులను కూర్చోబెట్టి ఈవీఎం వద్దకు తీసుకెళ్తారు. దివ్యాంగులకు సహాయపడేందుకు ప్రతి పోలింగ్ స్టేషన్లో వలంటీర్లను నియమించారు.
రెంజల్, నవంబర్ 29: మండలంలోని నీలా గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల వ్యయ పరిశీలకురాలు తానియా సింగ్ బుధవారం తనిఖీ చేశారు. గురువారం నిర్వహించనున్న పోలింగ్ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఓటర్లకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆమె అన్నారు. ఆమె వెంట బీఎల్వో రాజ్యలక్ష్మి, సిబ్బంది ఉన్నారు.
బోధన్ రూరల్/ఎడపల్లి, నవంబర్ 29: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం పోలింగ్ విధుల్లో పాల్గొనే ఎన్నికల సిబ్బంది బుధవారం సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. బోధన్ నుంచి ఆయా అన్ని పోలింగ్ కేంద్రాలకు ప్రొసీడింగ్, అసిస్టెంట్ ప్రొసీడింగ్ ఆఫిసర్తో పాటు పలువురు సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.