కంఠేశ్వర్, మార్చి 4 : కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 131 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, ట్రైనీ కలెక్టర్ కిరణ్మయి, డీఆర్డీవో సాయాగౌడ్కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. అర్జీలను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు గైర్హాజరు కావడం పరిపాటిగా మారింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజలు.. తమ సమస్యలను అధికారులకు విన్నవించుకుంటారు. ప్రజావాణి కార్యక్రమానికి పలుశాఖల అధికారులు హాజరుకావడం లేదు. దీంతో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పలుమార్లు తిరగాల్సిన పరిస్థితి నెలకొంటున్నదని ప్రజలు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండేలా చూడాలని కోరుతున్నారు.