నిజామాబాద్ స్పోర్ట్స్, జనవరి 10 : జిల్లావ్యాప్తంగా ఎక్కడా తాగునీటి ఇబ్బందులు రానివ్వొద్దని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు ఆదేశించారు. సమస్యలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను సూచించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం తాగునీటి సరఫరాపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రానున్న వేసవి నేపథ్యంలో తాగునీటి సరఫరా వ్యవస్థను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి, వారం రోజుల్లో నివేదికలను అందజేయాలని ఆదేశించారు.
ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ, సమస్యలుఉన్నచోట యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి, లోపాలను సరిచేయాలన్నారు. ప్రజాపాలన సభల సందర్భంగా పలుచోట్ల తాగునీటి సరఫరాపై ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. వేసవి కాలం ఆరంభానికి ముందే నివాసాల వారీగా వ్యవస్థను చక్కదిద్దాలని ఆదే శించారు. సర్పంచులు, కార్యదర్శులను సంప్రదించి వాటర్ ట్యాంకులను శుభ్రం చేయించాలని, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, హాస్టళ్లకు సమృద్ధిగా శుద్ధజలాలు అందేలా చూడాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రాజేంద్రకుమార్, ఈఈలు రాకేశ్, నరేశ్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.