నిజామాబాద్ స్పోర్ట్స్/ఆర్మూర్టౌన్/ నందిపేట్, జనవరి 2: ప్రజాపాలన సభల్లో ప్రజలు అందించే అన్నిరకాల దరఖాస్తులను స్వీకరించాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులకు సూచించారు. ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని ఖుద్వాన్పూర్, వన్నెల్(కే), మచ్చర్ల, ఆర్మూర్ పట్టణంలోని 14వ వార్డులో కొనసాగుతున్న ప్రజాపాలన సభలను మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కౌంటర్ల ఏర్పా టు, అందుబాటులో ఉన్న దరఖాస్తు ఫా రాలు, వలంటీర్లు, సిబ్బందితోపాటు ప్రజలకు కల్పించిన మౌలిక వసతులను పరిశీలించారు. ఇప్పటివరకు స్వీకరించిన దరఖాస్తులు, ప్రజలు ఏ పథకం కోసం అధికంగా దరఖాస్తు చేసుకున్నారనే వివరాలపై అధికారులను అడిగి తెలసుకున్నారు. దరఖాస్తులో పొందుపర్చిన పథకాలతోపాటు ఇతర అంశాలపై కూడా ప్రజలు సమర్పించే అర్జీలను తప్పనిసరిగా స్వీకరించాలని ఆదేశించారు.
రేషన్కార్డులు, రెవెన్యూ సంబంధిత అంశాలు, సీసీ రోడ్ల నిర్మాణాలు తదితర ఏ విషయంలోనైనా అధికారులకు వినతిపత్రాలను అందించవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు. అయితే, ఐదు గ్యారెంటీలు కాకుండా ఇతర అంశాలపై వచ్చే దరఖాస్తుల వివరాలను ప్రత్యేక రిజిస్ట్రర్లో నమోదు చేయాలని సూచించారు. ప్రజలు సమర్పించే ప్రతి దరఖాస్తుకూ తప్పనిసరిగా రసీదు అందించాలన్నారు. దరఖాస్తులు అందించేందుకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలన్నారు. ప్రజలు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కలెక్టర్ వెంట ఆర్డీవో వినోద్కుమార్, నోడల్ అధికారి జగన్నాథాచారి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రామారెడ్డి, మాచారెడ్డి మండలంలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించారు. మాచారెడ్డి మండలం బండ రామేశ్వర్పల్లి, అక్కాపూర్లో గ్రామసభలను పరిశీలించి అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.