విద్యానగర్, జనవరి 6 : వర్షపు నీటిని ఒడిసి పట్టాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర జల శక్తి బోర్డు ఆధ్వర్యంలో భూగర్భ జలాల సంరక్షణ వినియోగం, యాజమాన్య పద్ధతులపై శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సుకు కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కురిసిన వర్షపు నీటిని ఇంకుడు గుంతలు నిర్మించుకొ ని వాటిలోకి పంపి సంరక్షణ చేయాలని సూ చించారు. గ్రామాల్లోని బోర్ల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. అటవీ ప్రాంతాల్లో ఊట చెరువులు, కందకాలు, చెక్ డ్యామ్లు నిర్మించి భూగర్భ జలాలను పెం పొందించేలా చూడాలని పేర్కొన్నారు. ఉపాధి హామీ ద్వారా ఫామ్ పాండ్స్, ఫిష్ పాండ్స్ను ప్రజలు నిర్మించుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. సౌత్ ఇండి యా కేంద్ర జల శక్తి బోర్డు రీజినల్ డైరెక్టర్ డాక్టర్ సిద్దార్ధ కుమా ర్ మాట్లాడుతూ.. నీటి సంరక్షణలో యాజమాన్య పద్ధతులను వివరించారు. కార్యక్రమంలో కేంద్ర జల శక్తి బోర్డు శాస్త్రవేత్తలు డాక్టర్ సుదీర్ కుమార్, డాక్టర్ రాణి, అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, జిల్లా కోఆర్డినేటర్ సతీశ్ యాదవ్, జిల్లా వ్యవసాయ అధికారిణి భాగ్యలక్ష్మి, వ్యవసాయ, అటవీ, ఉపాధి హామీ, నీటిపారుదల, మిషన్ భగీరథ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో పదోతరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆవరణలోని చింతల బాలరాజ్ గౌడ్ స్మారక సమావేశంలో శుక్రవారం ప్రధానోపాధ్యాయులతో పదోతరగతి సిలబస్పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రత్యేక తరగతుల ద్వారా బోధన చేపట్టి సత్ఫలితాలు వచ్చేలా చూడాలన్నారు. ఇప్పటికే జిల్లాలో పదోతరగతి సిలబస్ 85 శాతం పూర్తయినట్లు చెప్పారు. జనవరి 31లోగా 100 శాతం సిలబస్ పూర్తి చేయాలని పేర్కొన్నారు. జిల్లా విద్యాధికారి రాజు మాట్లాడుతూ.. ప్రణాళిక బద్ధంగా పాఠ్యాంశాల బోధన చేపట్టాలన్నారు. విద్యార్థులకు స్టడీమెటిరియల్ అందజేస్తామని చెప్పారు. సమావేశంలో జిల్లా పరీక్షల విభాగం ఇన్చార్జ్ నీలం లింగం, సమన్వయకర్తలు శ్రీపతి, బలరాం, శ్రీకాంత్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.