కామారెడ్డి, మార్చి 6 : దవాఖానతోపాటు పరిసరాలను శానిటేషన్ సిబ్బంది పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానలోని వివిధ వార్డులను పరిశీలించారు. రోగులు వ్యర్థ పదార్థాలు చెత్త డబ్బాలోనే వేయాలని చెప్పారు. శానిటేషన్ ఏజెన్సీ పనులను ప్రతిరోజూ పర్యవేక్షించాలన్నారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆర్వో ప్లాంట్ నుంచి వచ్చే వృథా నీటిని ఇతర పనులను వినియోగించాలని చెప్పారు.
కొత్త గదుల నిర్మాణం వద్ద ఉన్న ఇసుక, కంకరను తొలగించి రోడ్డును లెవెల్ చేయాలన్నారు. పనికిరాని వస్తువులను తీసివేయాలని సూచించారు. మార్చురీ గదిని శుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. రాజీవ్ నగర్లోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలో ఉన్న మందుల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. కార్యక్రమంలో దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాం సింగ్, వైద్యులు విజయలక్ష్మి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మహిళా ఉద్యోగులు పురుష ఉద్యోగులతో సమానంగా సేవలందిస్తున్నారని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని బుధవారం టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో ఉత్తమ సేవలందించిన మహిళా ఉద్యోగులను సన్మానం చేశారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. మహిళలు ఇంటిని చక్కదిద్దినట్లే సమాజ మార్పునకు దోహదపడాలని సూచించారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి, కార్యదర్శి సాయిలు, కేంద్ర సంఘం కార్యదర్శి నాగరాజు, జిల్లా సహాధ్యక్షుడు చక్రధర్, కోశాధికారి దేవరాజు, ఉపాధ్యక్షుడు పోచయ్య, లక్ష్మణ్, సుజాత తదితరులు పాల్గొన్నారు.