కామారెడ్డి, జనవరి 26 : జిల్లా అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించాలనే తపనతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు. ఇందులో భాగంగా 6 గ్యారెంటీల అమలుకు హామీ ఇచ్చి, రెండు గ్యారంటీలను నెరవేర్చిందని అన్నారు. మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో 27 లక్షల 75 వేల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమం కింద ఆరు గ్యారెంటీల కోసం 2,94,799 దరఖాస్తులతో పాటు ఇతర సమస్యలపై 13,367 దరఖాస్తులు స్వీకరించి కంప్యూటరీకరణ చేశామని వివరించారు.
రైతన్నలకు వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్తోపాటు పంట పెట్టుబడి సాయం అందిస్తున్నదని తెలిపారు. పంట రుణాల మాఫీకి ప్రభుత్వం బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నదని అన్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఎంపీ బీబీ పాటిల్,జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎస్పీ సింధూశర్మ ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు మనూచౌదరి, చంద్రమోహన్, ట్రైనీ ఎస్పీ కాజల్ సింగ్, ఆర్డీవోలు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.