సదాశివనగర్/బాన్సువాడ రూరల్ /బిచ్కుంద, ఏప్రిల్ 8: ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. సదాశివనగర్ మండలం తిమ్మోజివాడి, బాన్సువాడ మండలం కొయ్యగుట్ట పరిధిలోని కెవులానాయక్ తండా, బిచ్కుంద మండలం వాజిద్నగర్, ఫత్లాపూర్లోని ప్రభుత్వ పాఠశాలలను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేశామన్నారు.
విద్యార్థులకు తాగునీరు, మరుగుదొడ్లు, పాఠశాల గదుల మరమ్మతులు, విద్యుత్ సౌకర్యం తదితర అభివృద్ధి పనులు చేయాలని పంచాయతీరాజ్ ఇంజినీర్లకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి యోసెఫ్, పంచాయతీరాజ్ ఈఈ సదాశివరెడ్డి, డీఈలు వీరానంద్, బాలలింగం, ఏఈ మారుతి, రాకేశ్, ఎంపీడీవోలు సంతోష్ కుమార్, బషీరుద్దీన్ తదితర అధికారులు పాల్గొన్నారు.