భీమ్గల్, ఏప్రిల్ 28: కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తమ తీరు మార్చుకోకుంటే కమీషన్ నిలిపివేస్తామని, వచ్చే సీజన్ నుంచి సెంటర్ కేటాయించబోమని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. మంగళవారం ఆమె మండలంలోని పల్లికొండలో ఐకేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి వివరాలను సక్రమంగా నమోదు చేయకపోవడం, రిజిస్టర్ అందుబాటులో లేకపోవడం వంటి లోపాలను గుర్తించిన కలెక్టర్ కేంద్రం నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంలేదని ఏపీఎంకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల ప్రయోజనాలతో ముడివడిన అంశాల్లో విధుల్లో నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో ధాన్యం సేకరణ జరిగేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని ఆదేశించారు.
కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులతో కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మాయిశ్చర్ యంత్రం ద్వారా కలెక్టర్ స్వయంగా తేమ శాతాన్ని పరిశీలించారు. తరుగు, కోత వంటివి లేకుండా రైతులు ఏ దశలోనూ నష్టపోకుండా పక్కాగా పర్యవేక్షించాలని నిర్వాహకులకు సూచించారు. వాతావరణ పరిస్థితుల గురించి ముందస్తుగానే రైతులకు వివరాలు తెయజేస్తూ వారిని అప్రమత్తం చేయాలన్నారు. ట్రక్ షీట్లను వెంటదివెంట తెప్పించుకుంటూ ట్యాబ్ ఎంట్రీలను వేగంగా జరిపించాలన్నారు. తహసీల్దార్, వ్యవసాయాధికారులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో కేంద్రాలను సందర్శించి నిర్వహణ తీరు తెన్నులు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. కలెక్టర్ వెంట డీఎస్వో శ్రీకాంత్రెడ్డి, సివిల్ సప్లయ్ డీఎం ప్రవీణ్, డీసీవో శ్రీనివాస్, ఎంపీడీవో గంగుల సంతోష్కుమార్, తహసీల్దార్ కిరణ్కుమార్ అధికారులు ఉన్నారు.