నిజామాబాద్ క్రైం, ఫిబ్రవరి 9 : రుణాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని బాధితులు దేహశుద్ధి చేసిన సంఘటన గురువారం చోటు చేసుకున్నది. బాధితులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని ఇంద్రాపూర్ కాలనీకి చెందిన నవీన్ కొన్ని రోజుల క్రితం పీఎంజేవై లోన్లు ఇప్పిస్తానంటూ 40 నుంచి 50 మంది వద్ద రూ.500 నుంచి రూ.1,000 వరకు వసూలు చేశాడు. డబ్బులు వసూలు చేసిన నవీన్ ఎలాంటి లోన్లు ఇప్పించకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. బాధితులు ఫోన్ చేసినా స్పందించకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు.
ఈ క్రమంలో నవీన్ గురువారం బాధితులకు చిక్కడంతో దేహశుద్ధి చేశారు. త్వరలోనే వారి డబ్బులు తిరిగి చెల్లిస్తానని చెప్పడంతో బాధితులు వదిలేశారు. అయితే ఈ విషయం సంబంధిత ఐదో టౌన్ ఎస్సై డి.సాయినాథ్ ను వివరణ కోరగా తమకు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, విచారణ చేస్తున్నామని తెలిపారు. బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామన్నారు.