కామారెడ్డి (నమస్తే తెలంగాణ)/బీర్కూర్, జూన్ 20: స్వరాష్ట్రంలో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దినట్లు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రా ధాన్యం ఇస్తున్నదని పేర్కొన్నారు. 2023-24 బడ్జెల్లో 20వేల కోట్లు విద్యాశాఖకు కేటాయించారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సావాల్లో భాగంగా బీర్కూర్ జడ్పీహెచ్ఎస్లో మంగళవారం విద్యాదినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్తో కలిసి సభాపతి పాల్గొన్నారు.
అంగన్వాడీ భవనాలు, అదనపు తరగతి గదులతోపాటు డిజిటల్ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ.. చదువుతో మనిషికి జ్ఞానం కలుగుతుందని, మంచి చెడులు తెలుస్తాయన్నారు. విద్యావంతుల సమాజం తయారు కావాలని ఆకాంక్షించారు. పట్టణాల్లోని ధనవంతుల పిల్లలకు అందుతున్న నాణ్యమైన విద్య, మారుమూల ప్రాంతాల్లోని పేదల పిల్లలకు కూడా అందాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు.
విద్యావంతుడు, ఆలోచనాపరుడైన సీఎం అధికారంలో ఉంటే విద్యా వ్యవస్థ మెరుగుపర్చడానికి ప్ర ణాళికలు తయారు చేసి అమలు చేస్తారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి అలాంటి ఆలోచనలు కలిగిన వ్యక్తి అని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు దేవాలయాలతో సమానమని పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తోందన్నారు.
విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించాలి
విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులు, అధ్యాపకులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులను తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన అధ్యాపకులు ఉన్నారని తెలిపారు. ప్రజాప్రతినిధులు విద్యాలయాలను నిత్యం సందర్శించాలని సూచించారు. ఐటీ రంగంలో హైదరాబాద్ నేడు దేశంలో నంబర్వన్ స్థానంలో ఉన్నదని తెలిపారు.
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమర్థతతో రాష్ర్టానికి భారీగా పరిశ్రమలు తరలివస్తున్నాయని చెప్పారు. తాను 1994లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బాన్సువాడ నియోజకవర్గంలో కేవలం ఒకే జూనియర్ కళాశాల ఉండేదని, నేడు 30 కళాశాలలు ఉన్నాయన్నారు. దేశ వ్యాప్తంగా 12 ఫుడ్ అండ్ టెక్నాలజీ కళాశాలలు ఉండగా, 13వ కళాశాలను రుద్రూర్లో ఏర్పాటు చేశామని తెలిపారు. పదవిలో ఉన్న వ్యక్తులు ప్రజలకు న్యాయం చేయని పక్షంలో ఆ పదవి నుంచి తప్పుకోవాలన్నారు. తనకు హైదరాబాద్లో ఎన్ని పనులున్నా తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. మన ఊరు -మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపు రేఖలు మారాయని పోచారం తెలిపారు.
వానా కాలం పంటల సాగుకు ఢోకా లేదు
నిజాంసాగర్ ఆయకట్టు కింద రైతులకు వానకాలం పంటల సాగుకు ఢోకా లేదని స్పీకర్ పోచారం అన్నారు. బుధవారం ఉదయం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. అవసరమైతే కొండ పోచమ్మ సాగర్ నుంచి 5 టీఎంసీల గోదావరి నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టుకు వదలాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, మాజీ జడ్పీటీసీ సతీశ్, ఎంపీపీ రఘు, జడ్పీటీసీ స్వరూప, ఎంఈవో నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న విద్యార్థిని ‘సోది’
విద్యాదినోత్సవం సందర్భంగా ఓ విద్యార్థిని సోది చెప్పడం సభాపతి పోచారం, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్తోపాటు ప్రముఖలందరినీ ఆకట్టుకున్నది.తాను సోది చెబుతానని స్పీకర్ చేయి పట్టుకొని.. బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం పోచారం చేసిన పనులన్నింటినీ వివరించింది. ప్రజల కోసం ఎంతో కష్టపడుతావని, ఆరోగ్యం జాగ్రత్త అని పేర్కొంది. రానున్న ఎన్నికల్లో లక్ష మెజారిటీతో గెలుస్తావని, మంత్రిగా పదవీ బాధ్యతలను చేపడతావని ఆ బాలిక సోదిలో పేర్కొనడంతో అందరూ చప్పట్లు కొట్టారు. స్పీకర్ ఆ బాలిక సోదికి ఆకర్షితుడై వేయి రూపాయల నగదును బహుమతిగా అందజేసి సన్మానించారు.