నిజామాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): హైదరాబాద్లోని ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ శుక్రవారం భేటీ అయ్యారు. కామారెడ్డి నియోజకవర్గానికి రూ.195 కోట్లు నిధులు మంజూరు చేస్తూ సీఎం నిర్ణయం తీసుకోవడంపై ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వేసిన పైప్లైన్ స్థానంలో కొత్తగా ఐరన్ పైప్ను శాశ్వత ప్రాతిపదికన వేసేందుకు నిర్ణయించారు. ఇందుకోసం ప్రభుత్వ విప్ ప్రతిపాదనలకు అంగీకారం తెలుపుతూ పరిపాలనా అనుమతులు మంజూరు చేయగా.. గంప గోవర్ధన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దాదాపు 1.11లక్షల కుటుంబాలకు మేలు చేసేలా ఎస్సారెస్పీ నీటి తరలింపునకు ఎంఎస్ పైపులైన్ పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఎస్సారెస్పీ సెగ్మెంట్ పరిధిలో గోదావరి జలాలను వివిధ దశల్లో శుద్ధి చేసి తాగునీరుగా మార్చి ప్రజలకు అందిస్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాలతోపాటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి, తాడ్వాయి, సదాశివనగర్ మండలాలకు ఈ నిర్ణయంతో మేలు చేకూరనున్నది.
ఇందులో భాగంగా ఎస్సారెస్పీ ఇన్టెక్ వెల్ జలాల్పూర్ నుంచి నీళ్లను పైపులైన్ ద్వారా తరలిస్తారు. ప్రస్తుతం ఉన్న పైప్లైన్లు నీటి సామర్థ్యానికి సరిపోవడం లేదు. పైగా మరమ్మతుల మూలంగా నీటి సరఫరాకు అంతరాయం కలుగుతున్నది. ఈ స్థితిని పూర్తిగా మార్చి వేసేందుకు సీఎం కేసీఆర్ కీలకమైన నిర్ణయాన్ని తీసుకుని అమలు చేయాలని నిర్ణయించారు.ఈ విషయాన్ని గతంలోనే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రత్యేకంగా సీఎం కేసీఆర్కు వివరించారు. పైప్లైన్ దెబ్బతిన్న స్థితిపై నివేదికను సమర్పించారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఎంఎస్(ఇనుము) పైప్లను వేయడం ద్వారా శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఈ అంశంపై క్షేత్ర స్థాయి నివేదికను తెప్పించుకుని గంప గోవర్ధన్ కోరిక మేరకు రూ.195 కోట్లతో దాదాపుగా 47 కిలో మీటర్ల మేర పైప్లైన్లను మార్చేందుకు నిర్ణయించడం విశేషం. నిజామాబాద్ జిల్లా జలాల్పూర్ నుంచి అర్గుల్, అర్గుల్ నుంచి ఇందల్వాయి, ఇందల్వాయి నుంచి కామారెడ్డి జిల్లా మల్లన్నగుట్ట వరకు మూడు దశల్లో పైపులను మార్చనున్నారు.
కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయమిది…
మిషన్ భగీరథ ద్వారా గడప గడపకూ మంచి నీళ్లు అందుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన అద్భుత పథకాల్లో ఇదీ ఒకటి. కామారెడ్డి నియోజకవర్గానికి శాశ్వతంగా తాగు నీటి తరలింపునకు ఇక్కట్లను దూరం చేసేందుకు సీఎం కేసీఆర్ కీలకమైన నిర్ణయం తీసుకోవడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం. ఎక్కడో ఎస్సారెస్పీ నుంచి గోదావరి జలాలను తీసుకు వచ్చి శుద్ధి చేసిన నీళ్లను ప్రజల ఇంటికే నేరుగా నల్లాల ద్వారా అందించడం చాలా గొప్ప విషయం. అయితే ఎస్సారెస్పీ సెగ్మెంట్లో మల్లన్నగుట్టకు వచ్చే పైప్లైన్లో అక్కడక్కడా సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్కు వివరించగానే సమ్మతించి ఏకంగా రూ.195 కోట్లు మంజూరు చేసి తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. కామారెడ్డి ప్రజల తరపున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు .
– గంప గోవర్ధన్, ప్రభుత్వ విప్