Telangana Decade Celebrations | నిజామాబాద్, జూన్ 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి):స్వరాష్ట్రంలో ఆత్మగౌరవంతో పాలన సాగాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ అనేక సంస్కరణలు చేపట్టారు. ప్రజలకు పాలనను చేరువ చేయడంతోనే ఇది సాధ్యమని ఆ దిశగా అడుగులు వేశారు. చిన్న జిల్లాల ఏర్పాటు, అధికార వికేంద్రీకరణ వంటి పాలనా సంస్కరణలు చేపట్టి సత్ఫలితాలను సాధించారు. పరిపాలన వికేంద్రీకరణను కేవలం భౌగోళిక మార్పులతోనే సరిపెట్టలేదు. విభజనకు అనుగుణంగా సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీస్ భవనాలను నిర్మించి యావత్ దేశానికి ఆదర్శంగా నిలిపారు. ప్రభుత్వ శాఖల కార్యాలయాలను ఒకే గొడుగు కిందకు తీసుకు వచ్చి ప్రజలకు సుపరిపాలనను దరి చేర్చారు.
కొట్లాడి సాధించుకున్న రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. స్వరాష్ట్రంలో ప్రజలకు పాలన చేరువ చేయడమే లక్ష్యంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తొమ్మిదేండ్లలో చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. చిన్న జిల్లాలు, కొత్త మండలాలు, పంచాయతీల ఏర్పాటుతో ప్రగతి పరుగులు పెడుతున్నది. తక్కువ విస్తీర్ణం… తక్కువ జనాభాతో కూడిన జిల్లాల ఏర్పాటుతో ప్రభుత్వ పరిపాలనలో మెరుగుదల కనిపిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా 30 లక్షల జనాభా ఉండేది. ఈ ప్రాంతం రెండు జిల్లాలుగా విడిపోవడంతో పర్యవేక్షణ సులువైంది.
పెరిగిన జనాభాకు అనుగుణంగా జిల్లాలను పునర్విభజన చేసుకోవడం ద్వారా ఎనలేని పురోగతి ఇప్పుడు కనిపిస్తోంది. 2016, అక్టోబర్ 11న పురుడు పోసుకున్న కొత్త జిల్లాల స్వరూపం నేడు అద్వితీయమైన ప్రగతితో దూసుకుపోతున్నది. ఒకప్పుడు సువిశాల విస్తీర్ణంతో కూడిన నిజామాబాద్ భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఏ మూలకు వెళ్లి రావాలన్నా 24 గంటలు పట్టేది. రోజంతా ఒక ప్రాంతానికే సరిపోయేది. నిరంతర పర్యవేక్షణలో లోపా లు, తద్వార పారదర్శకతలో లోటుపాట్లు. కచ్చితత్వం లో నష్టాలు వంటివి కనిపించేది. మరిప్పుడు నూతన జిల్లాలో పరిపాలన నూతన పంథాలో సాగుతున్నది. ప్రతి ఊరు, మండలం, నియోజకవర్గంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ పెరిగింది. సుపరిపాలనకు అధికార వికేంద్రీకరణ రాచబాటను పర్చినట్లుగా మారింది.
సుపరిపాలన వెలుగులు…
ఒకప్పుడు అత్యవసర సమయాల్లోనే కలెక్టర్ క్షేత్ర స్థాయికి వెళ్లేవారు. కానిప్పుడు… ఏ సమస్య ఎదురైనా ప్రజల ముందు నిలబడి వారి అవసరాలను ఆలకిస్తున్నారు. తక్షణమే వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు. జిల్లా అధికారులంతా సంక్షేమ ఫలాల తీరుపై సునిశిత పరిశీలన జరుపుతున్నారు. లబ్ధిదారుల వివరాలను ఒకప్పుడు కాగితాలపైనే పరిశీలించి వదిలేసే వారు. ఇప్పుడూ ఆ పరిస్థితే కనుమరుగైంది. భౌతికంగానే లబ్ధిదారులను ఉన్నతాధికారులే పరిశీలన చేస్తున్నారు. దీంతో కచ్చితత్వమన్నదీ రెట్టింపు స్థాయిలో పెరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన సంక్షేమ ఫలాలు అర్హులైన వారందరికీ చేరుతున్నాయి. కొత్త జిల్లాగా ఏర్పడిన కామారెడ్డి జిల్లాకు అనేక సర్దుబాట్లు వచ్చి చేరుతున్నాయి. సామాజిక, ఆర్థిక, సాంస్కృతికంగా విభిన్నమైన పద్ధతుల్లో అభివృద్ధి చెందేలా జిల్లాకు ప్రాధాన్యత సైతం పెరిగింది. కేసీఆర్ సర్కార్ కొలువుదీరి తొమ్మిదేండ్లు దాటుకుని దశాబ్దంలోకి అడుగు పెట్టిన సందర్భంలో కనీవిని ఎరుగని రీతిలో పరిపాలనలో మార్పులు కనిపిస్తున్నాయి. నూతన జిల్లాతో పాత జిల్లాకు, కొత్త జిల్లాకు సమాన స్థాయిలో ఫలితాలు ద క్కుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జిల్లాల ఏర్పాటుతోనే కాకుండా మండలాలు, గ్రామాలను సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ విభజించడంతో ఎక్కడికక్కడ పరిపాలనలో మార్పులు వెలుగు చూస్తున్నాయి.
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు…
ప్రజలకు మంచి జరుగుతుందంటే సీఎం కేసీఆర్ ఎంతటి సాహసానికైనా వెనుకడుగు వేయరు. అందుకు నూతన జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీల ఏర్పాటే ముఖ్యమైనది. శాస్త్రీయమైన పద్ధతుల్లో ప్రజా అభిప్రాయాలకు అనుగుణంగా గడిచిన తొమ్మిదేండ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక భౌగోళిక మార్పులు, చేర్పులు జరిగాయి. మొదట జిల్లాలు, మండలాలు కూర్పు చేయగా ఆ తర్వాత గ్రామ పంచాయతీలను విడగొట్టి ప్రజలకు స్థానిక సంస్థల పరిపాలన దరి చేర్చారు. వీటితో పాటే కొత్త రెవెన్యూ డివిజన్లను, రెవెన్యూ గ్రామాలను పునర్వ్యవస్థీకరించారు. పోలీస్ శాఖ పరంగానూ శాంతి, భద్రతలకు అనువైన విధంగా కొత్త డివిజన్లు, సర్కిళ్లను ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాకు పోలీస్ కమిషనరేట్ హోదాను కల్పించారు. ఉమ్మడి జిల్లాలో విడిపోవడానికి ముందు కొన్ని దశాబ్దాలుగా 36 మండలాలతోనే కొనసాగింది. తెలంగాణ సిద్ధించిన తర్వాత కేసీఆర్ పరిపాలనలో ఇప్పుడీ మండలాల సంఖ్య 57కు చేరింది. నిజామాబాద్ జిల్లాలో 33 మండలాలు, కామారెడ్డి జిల్లాలో 24 మండలాలు ఏర్పాటయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 323 గ్రామ పంచాయతీలుండగా 214 కొత్త జీపీలతో మొత్తం వీటి సంఖ్య 526కు చేరింది. నిజామాబాద్ జిల్లాలో 530 గ్రామ పంచాయతీలు నెలకొన్నాయి.
ప్రణాళికాబద్ధంగా…
తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ప్రణాళికబద్ధంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతున్నది. జిల్లా కేంద్రాలను కూడా ఐటీ కేంద్రాలుగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది. ఇందులో భాగంగా నిజామాబాద్లో ఐటీ హబ్ను నెలకొల్పారు. ప్రజల ముంగిటనే పాలన అందించేందుకు 33 జిల్లాలను ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్.. సకల సౌకర్యాలతో పాలనా యంత్రాంగం అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. తొమ్మిదేండ్ల కాలంలో తెలంగాణ భిన్న రంగాల్లో అభివృద్ధి సాధించింది. మౌలిక వనరుల కల్పనకు విశేష ప్రాధాన్యం ఇవ్వడంతో తెలంగాణ స్వరూపమే మారిపోయింది. పరిపాలన వికేంద్రీకరణను కేవలం భౌగోళిక మార్పులతోనే సరిపెట్టలేదు. విభజనకు అనుగుణంగా సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీస్ భవనాలను అత్యద్భుతంగా నిర్మించి యావత్ దేశానికి ఆదర్శంగా నిలిపారు. ప్రభుత్వ శాఖల కార్యాలయాలను ఒకే గొడుగు కిందకు తీసుకు వచ్చి ప్రజలకు మెరుగైన పరిపాలనను దరి చేర్చారు.