కామారెడ్డి, నవంబర్ 10: కామారెడ్డి గడ్డపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి బీసీ డిక్లరేషన్ చేయడం సిగ్గుచేటని, డిక్లరేషన్ మాట మీద ఎప్పుడైనా ఉన్నారా అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 75ఏండ్లలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని 65ఏండ్లు పాలించగా, ఎన్ని డిక్లరేషన్లు పాస్ చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. డిక్లరేషన్ మాట మీద ఎప్పుడైనా ఉన్నారా అని ప్రశ్నించారు. కామారెడ్డి గడ్డ మీద వచ్చి మాట్లాడడం సిగ్గు చేటని అన్నారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నదని తెలిపారు. ఏ ముఖం పెట్టుకొని బీసీ డిక్లరేషన్ చేశావ్ రేటెంతరెడ్డి అని అన్నారు. జిల్లాలో ఒక్క బీసీకి సీటు ఇవ్వలేదని అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఐదుగురు బీసీ ఎమ్మెల్యేలు ఉండేవారని అన్నారు. ప్రస్తుతం ఒక్క బీసీకి కూడా ఎమ్మెల్యే సీటు ఇవ్వకుండా బీసీ డిక్లరేషన్ ఇవ్వడం సిగ్గుచేటన్నారు.
బీసీ టికెట్లను అమ్ముకున్నారని, 35మంది బీసీలకు టికెట్లు ఇస్తానని, 22 మందికే ఇచ్చి ఇప్పుడు బీసీ డిక్లరేషన్ గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. మీలాంటి వ్యక్తిని అనాలంటేనే ఆత్మాభిమానం అడ్డొస్తున్నదని అన్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతావా అని అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎక్కడైనా పోటీచేస్తాడని, తెలంగాణ ప్రజలను చైతన్యపరిచిన ఘనత కేసీఆర్దేనని వివరించారు. సీఎం కేసీఆర్ ఎల్లారెడ్డిలో 30 గ్రామాలు తిరిగారని, నీవు ఎప్పుడైనా తిరిగావా? ఇప్పుడొచ్చి కామారెడ్డి గురించి, కేసీఆర్ గురించి మాట్లాడుతున్నావని అన్నారు. నీకు డిక్లరేషన్ గురించి ఏమైనా అవగాహన ఉన్నాదా అని ప్రశ్నించారు. 50ఏండ్లు కాంగ్రెస్లో ఉన్న పొన్నాల లక్ష్మయ్యను ఇటీవల మెడబట్టి గెంటేయ్యలేదా అని అన్నారు. బీసీ డిక్లరేషన్లో సభలో బీసీ నేతల ఫొటో ఉన్నదా అన్నారు. కామారెడ్డిలో స్థానికేతరులకు టికెట్లు అమ్ముకున్నావని అన్నారు. 2018లో షబ్బీర్ అలీ ఇంటికి రూ.5కోట్లలో రాలేదా.. వచ్చిందనడానికి తానే సాక్షినని స్పష్టంచేశారు.
ఇలాంటి వ్యక్తి కామారెడ్డి నుంచి డిక్లరేషన్ చేస్తే చూస్తూ ఊరుకుంటామా, ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. బీసీల సంక్షేమానికి కృషి చేసింది, వెనుకబడిన కులాలను చైతన్యపరిచింది సీఎం కేసీఆరేనని చెప్పారు. మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్ కల్పించిన దేశంలోనే ఏకైక నాయకుడు కేసీఆర్ అని అన్నారు. ఎంతసేపూ రేటెంత అనడమే తప్పా.. చేసిందేమీ లేదని అన్నారు. కాసుల బాల్రాజ్కు సీటు ఇవ్వకుండా ఆత్మహత్య చేసుకునేలా చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ నాయకుడని, కాంగ్రెస్కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని వివరించారు. కామారెడ్డిలో రేటు కుదరకపోవడంతో షబ్బీర్ అలీని నిజామాబాద్కు పంపించారని ఆరోపించారు. బీసీలకు, బీసీ మహిళలకు బీఆర్ఎస్ ప్రభుత్వం 50శాతం రిజర్వేషన్ తెచ్చిందని తెలిపారు. ప్రజలు బీఆర్ఎస్కు ఓటు వేయాలని నిర్ణయం తీసుకున్నారని, ఉమ్మడి జిల్లాలో నీ మాటలెవ్వరూ నమ్మరని జాజాల అన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ కామారెడ్డి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు పున్న రాజేశ్వర్, నల్లవెల్లి అశోక్, మామిళ్ల అంజయ్య, నాయకులు భూమేశ్యాదవ్, మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.