నిజామాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా బ్రహ్మాస్ర్తాన్ని సంధించాలంటూ భారత రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మంచోళ్లు ఎవరో, చెడ్డోళ్లు ఎవరో గుర్తించి ఆలోచించి ఓటెయ్యాలని కోరారు. కారు చీకట్లను, సాగు నీటి ఇబ్బందులను, తాగు నీటి ఇక్కట్లను, వలసలతో కూడుకున్న తెలంగాణను పదేండ్ల కాలంలో బాగు చేసుకున్నామని కేసీఆర్ గుర్తు చేశారు. రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల నుంచి తలెత్తుకుని నిలబడేలా చేశామని చెప్పారు. ప్రజా ఆశీర్వాద సభల్లో భాగంగా జుక్కల్, బాన్సువాడలో సోమవారం నిర్వహించిన కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్లో వచ్చిన ఆయన మొదట జుక్కల్ చౌరస్తాలో జరిగిన సభకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే హన్మంత్ షిండేతో కలిసి హాజరై ప్రసంగించారు. అనంతరం హెలీకాప్టర్లోనే బాన్సువాడకు చేరుకొని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, మంత్రి ప్రశాంత్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. సభలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఆవశ్యకతను కేసీఆర్ వివరించారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అసత్య ప్రచారాలపై బలమైన వాగ్భాణా లను సంధించారు. ఎంపీ కొత్తా ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిని కేసీఆర్పై దాడిగానే భావిస్తున్నట్లుగా ప్రకటించడంతో పాటుగా హింసాత్మక చర్యను తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాలకు ఎన్నికల్లో గెలిచే అవకాశాలు లేకపోవడంతోనే ఇలాంటి దుష్ట సంప్రదాయానికి తెరలేపాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి చేతకాదా? చేతులు లేవా? మేము తిరబడితే దుమ్ము రేగాలే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాన్సువాడ నియోజకవర్గం నుంచి పోచారం శ్రీనివాస రెడ్డికి ఈ ఎన్నికల్లో లక్ష మెజార్టీ తథ్యమని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా స్పీకర్ను మంచి మెజార్టీతో గెలిపిస్తే వచ్చే ప్రభుత్వంలో పెద్ద పదవిలోనే పోచారం శ్రీనివాస రెడ్డి కొనసాగుతారని హామీ ఇచ్చారు. వ్యవసాయ మంత్రిగా రైతుల కోసం చేపట్టిన అనేక కార్యక్రమాల్లో పోచారం పాత్ర ఉన్నదని, అందువల్లే అవ న్నీ విజయవంతం అయ్యాయని కేసీఆర్ పేర్కొన్నారు. అందుకే లక్ష్మీపుత్రుడని పేరు పెట్టినట్లుగా మరోసారి కేసీఆర్ గుర్తు చేశారు. బాన్సువాడను బంగారువాడగా పోచారం మార్చారని కేసీఆర్ చెప్పారు.
ఉద్యమ సమయంలో మద్నూర్, నిజాంసాగర్ ప్రాజెక్టు వచ్చి మీటింగ్లు పెట్టుకున్న సందర్భాలు తనకు గుర్తుకు ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. జుక్కల్ వెనుకబడ్డ ప్రాంతమని తెలంగాణలో అద్భుతంగా ప్రగతి సాధ్యమైందన్నారు. ప్రజల పన్నులతో వచ్చే ఆదాయాన్ని రైతుబంధు రూపం లో కేసీఆర్ దుబారా చేస్తున్నారంటూ మాజీ పీసీసీ చీఫ్, ప్రస్తుత పీసీసీ చీఫ్ చేస్తున్న ప్రచారాన్ని ప్రజల ముందుకు కేసీఆర్ తీసుకువచ్చారు. రైతుబంధు ఉండల్నా? వద్దా? అంటూ అడిగారు. ప్రజలంతా ఉండాలి… అంటూ గట్టిగా జవాబిచ్చారు. రైతుబంధు దుబారా అంటూ వ్యాఖ్యానించిన కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు. దేశంలో రైతుబంధు పదాన్ని పుట్టించిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని కేసీఆర్ అన్నారు. ఎన్నికల అనంతరం స్వయంగా జుక్కల్కు వచ్చి లెండి కాలువలు పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. బాన్సువాడ సభలో ఎంపీ బీబీపాటిల్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్ రెడ్డి, డా.పోచారం రవీందర్ రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, స్పీకర్ సతీమణి పుష్పమ్మ, కుటుంబ సభ్యు లు సోనిరెడ్డి, అరుణారెడ్డి, వెంకట్రాంరెడ్డి తదిత రులు హాజరయ్యారు. జుక్కల్ సభలో మంత్రి, ఎంపీతో పాటుగా జడ్పీ చైర్పర్సన్ దఫేదార్ శోభ, రాష్ట్ర నాయకుడు దఫేదార్ రాజు పాల్గొన్నారు.
బాన్సువాడ, జుక్కల్ ప్రజా ఆశీర్వాద సభల్లో పోచారం శ్రీనివాస రెడ్డి, హన్మంత్ షిండేలను సీఎం కేసీఆర్ ప్రశంసించారు. తన నియోజకవర్గంలో కూడా కట్టని విధంగా బాన్సువాడలో 11వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించిన ఘనత పోచారంకే దక్కుతుందన్నారు. ఎన్ని పదవులు అనుభవించినా, ఏ హోదాలో ఉన్నా పోచారం మాత్రం రుబాబు చేసే వ్యక్తి కాదని కేసీఆర్ అన్నారు. సౌమ్యుడిగా పేరొందిన షిండేకు భారీ మెజార్టీతో ప్రజలంతా మరోసారి పట్టం కట్టాలని కోరారు.