ఓటు వజ్రాయుధం.. ఆలోచించి దాన్ని సద్వినియోగం చేసుకోవాలె. ఎన్నికల్లో రాయీ, రత్నం గుర్తెరిగి ఓట్లెయ్యాలె. ఆషామాషీగా ఓటేస్తే అది మనల్ని కాటేస్తుందని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ప్రజలంతా తడాఖా చూపాలి.. బీఆర్ఎస్కు ఓటేసి రాజకీయ చైతన్యం ప్రదర్శించాలని పిలుపునిచ్చారు. బుధవారం ఉమ్మడి జిల్లాలో ముఖ్యమంత్రి సుడిగాలి పర్యటన చేశారు. బోధన్, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డిల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని కండ్లకు కట్టినట్లు కేసీఆర్ వివరించారు. కాంగ్రెస్ను నమ్మితే మళ్లీ గోస తప్పదన్నారు. కైలాసం ఆటలో పెద్ద పాము మింగినట్లు కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను దుర్మార్గుల చేతికి అప్పగించొద్దని కోరారు. బీజేపోడికి ఓట్లు అడిగే అర్హత లేదని,
ఎవరైనా వస్తే నిలదీయాలని సూచించారు. నిజామాబాద్, బోధన్లో ఊహించని అభివృద్ధి జరిగిందన్నారు. సాగునీటిరంగంలో వెనుకబడ్డ కామారెడ్డి, ఎల్లారెడ్డి అభివృద్ధి బాధ్యత తనదని, జంట నియోజకవర్గాలను అద్భుతంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఎమ్మెల్యేలు షకీల్, బిగాల గణేశ్ గుప్తా, జాజాల సురేందర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
నిజామాబాద్, నవంబర్ 15, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/బోధన్, ఖలీల్వాడి : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలంతా తడాఖా చూపించాలని, బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి చైతన్యం ప్రదర్శించాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో రాయి ఏదో, రత్నం ఏదో గుర్తెరిగి ఓట్లెయ్యాలని సూచించారు.. ఆషామాషీగా ఓటెస్తే అది మనల్ని కాటేస్తుందన్నారు. 3 గంటల కరెంట్ ఇస్తామంటున్న కాంగ్రెస్ పార్టీని నమ్మితే మన కంటిని మన వేలుతో పొడుచుకున్నట్లే అవుతుందని చెప్పా రు. మాజీ పీసీసీ చీఫ్, పీసీసీ చీఫ్లు స్పష్టంగా 3 గంటల కరెంట్ ఇస్తామంటూ చెబుతున్నారని ప్రజలంతా గమనించాలని కేసీఆర్ కోరారు. ప్రజాఆశీర్వాద సభల్లో భాగంగా బోధన్, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డిలో కేసీఆర్ హాజరయ్యారు. కాం గ్రెస్, బీజేపీ పార్టీల తీరును తనదైన శైలిలో తిప్పికొట్టారు. సాగునీటి రంగంలో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలు వెనుకబడ్డాయని అందుకే కామారెడ్డి నుంచి పోటీకి తాను వస్తున్నట్లు కేసీఆర్ తెలిపా రు. కామారెడ్డి, ఎల్లారెడ్డిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపిస్తానం టూ హామీ ఇచ్చారు. ఈ నియోజకవర్గాల్లో రెండేం డ్ల కాలంలో ఎకరం మిగలకుండా నీళ్లు పారించే బాధ్యత తనదేనంటూ చెప్పారు. బోధన్, నిజామాబాద్ అర్బన్లో ఊహించని అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ అధినేత స్పష్టం చేశారు. కైలాసం ఆటలో పెద్ద పాము మింగినట్లు కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ను దుర్మార్గుల చేతికి అప్పగించొద్దని హితవు పలికారు.
బాబ్రీ మసీదు విధ్వంస కుట్రకు కారణం కాంగ్రెస్ పార్టీ అని కేసీఆర్ ఆరోపించారు. మైనార్టీలను నిలువునా ముంచిన పార్టీ కూడా కాంగ్రెస్ అని కేసీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసమని, ఆ తర్వతా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం ఏ విధంగా కృషి చేస్తున్నామో మీ కండ్ల ముందు ఉన్నదంటూ ప్రజలకు వివరించారు. ఆరు నూరైన సరే కచ్చితంగా వ్యవసాయాన్ని స్థిరీకరణ చేయాలని, గ్రామాలు ఆర్థికంగా పటిష్టవంతం కావాలని నిర్ణయించుకుని పని చేశామన్నారు. మహారాష్ట్రలో నీటి తీరువా అమలవుతున్నదని, తెలంగాణలో నీటి తీరువాతో పాటు పాత బకాయిలు కూడా రద్దు చేశామని కేసీఆర్ వెల్లడించారు.
గులాబీ జెండా పుట్టిన్నాడు… మూగబోయిన కోటి తంబులా… అంటూ ఎల్లారెడ్డి ప్రాంతానికి చెందిన విఠల్ రెడ్డి అనే ఉద్యమకారుడు పాడిన పాట తెలంగాణ అంతటా మారుమోగిందంటూ నాటి ఉద్య మ కాలం నాటి విషయాలను కేసీఆర్ పంచుకున్నా రు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే మిషన్ కాకతీ య పథకాన్ని ప్రారంభించి మట్టి తట్టను ఎత్తి పోసినట్లుగా గుర్తు చేశారు. రాష్ట్రం బాగుపడ్డదా? చెడిపోయిందా? పైకి పోయిందా? కిందికి పోయిందా? చూసేందుకు గీటురాయి ఉంటుందన్నారు. తలసరి ఆదాయం పెరిగిందా? తగ్గిందా? చూస్తారని వివరించారు. 2014లో తలసరి ఆదాయంలో తెలంగాణ ర్యాంకు 19వ ర్యాంకు ఉంటే ఇప్పుడు నంబ ర్ వన్ ర్యాంకుగా ఉందన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలోనూ తెలంగాణ ముందున్నదన్నారు. బ్రహ్మాండంగా ఆర్థిక ప్రగతి వచ్చిందని చెప్పారు. పెట్టుబడులు పెరిగి, ఐటీ విస్తరించి, ఉద్యోగ కల్పన పెరిగి ఆర్థిక ప్రగతి సాధ్యమైందన్నారు. కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నానంటే ఎల్లారెడ్డి వేరు చేసినట్లు కాదన్నారు. సురేందర్ తన తమ్ముడి లాంటోడు, ఉద్యమంలో తనతో పాటు కలిసి పని చేసిన వ్యక్తి, తన కుటుంబంలో సభ్యుడు అంటూ కితాబునిచ్చారు.
కామారెడ్డి, ఎల్లారెడ్డి ఏం చేస్తానో చూపి స్తా… మాట్లలో చెప్పను… జంట నియోజకవర్గాల ను అద్భుతంగా ఆవిష్కరిస్తానంటూ కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇక్కడ ఎమెల్యేగా సురేంద్ర ఉన్నప్పటికీ తానే బాధ్యత వహిస్తానంటూ తెలిపారు. అవన్నీ కండ్లారా మీరే చూస్తారంటూ ప్రజలకు వివరించా రు. ఈ ప్రాంతం నంబర్ వన్ అయ్యిందని మీరం తా గర్వ పడేలా చేస్తానంటూ ప్రజలకు స్పష్టం చేశారు. ఎల్లారెడ్డిలో సురేందర్ను గెలిపిస్తున్నానని కాకుండా కేసీఆర్ను గెలిపిస్తున్నట్లుగా ప్రజలంతా భావించాలని బీఆర్ఎస్ అధినేత చెప్పారు. కాయితీ లంబాడీలంతా బీఆర్ఎస్కు ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు. బీసీల్లో ఉన్న వారికి ఎస్టీ రిజర్వేషన్ కోసం కొట్లాడతానంటూ చెప్పారు. వినయం, విధేయత ఉన్న వ్యక్తి సురేందర్ అంటూ మెచ్చుకున్నారు. సభల్లో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, మధుసూదనా చారి, ఎంపీలు కేఆర్ సురేశ్ రెడ్డి, బీబీపాటిల్, ఎమ్మెల్యేలు షకీల్ అహ్మద్, బిగాల గణేశ్ గుప్తా, జాజాల సురేందర్, జీవన్ రెడ్డి, జడ్పీ చైర్మన్లు దాదన్నగారి విఠల్ రావు, దఫేదార్ శోభ, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, కార్పొరేషన్ల చైర్మన్లు మార గంగారెడ్డి, రాజేశ్వర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాంకిషన్ రా వు, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ కో-ఆర్డినేటర్ బిగాల మహేశ్, దఫేదార్ రాజు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే కారు చీకట్లు, పాము కాట్లు, కరెంట్ షాకులు తప్పవని సీఎం కేసీఆర్ అన్నారు. 11సార్లు ఈ దేశాన్ని పరిపాలించేందుకు కాంగ్రెస్కు అవకాశమిస్తే 55 ఏండ్ల పాటు ప్రజలను పీల్చుకుని తిన్నారని మండిపడ్డారు. ఆలోచన చేసి ప్రజలకు మేలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకే ఓటెయ్యాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఏకబిగిన 55 ఏం డ్లు దేశాన్ని, రాష్ర్టాన్ని పాలించిందన్నారు. ఇప్పుడొచ్చి ఒక్కఛాన్స్ ఇవ్వమంటే నమ్మొద్దన్నారు. కాంగ్రెస్ రాజ్యంలో సగం రాత్రి కరెంట్, సగం పొద్దున కరెంట్ ఉండేదని గుర్తు చేశారు. మునుపు ధాన్యం కొంటే తిరిగి డబ్బులు రైతుకు రావాలంటే వారాలు గడిచినా ఇచ్చేది కాదన్నారు. ఇప్పుడు ధాన్యం కొంటే రైతు ఖాతాల్లోకే పది రోజుల్లోనే డబ్బులు జమ అవుతున్నాయన్నారు. రైతుబంధు డబ్బులు కూడా టింగ్ టింగ్ మంటూ అకౌంట్లో పడుతున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ధరణితో భూ సమస్యలకు చెక్ పడిందన్నారు. భూముల మీద పెత్తనాన్ని తీసేసినట్లు చెప్పారు. నిమిషాల్లో పట్టా, మ్యు టేషన్ అయిపోతుందని, ధరణి పెట్టినందుకే ఖాతాలన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నందునే ఈ సౌలత్లు వస్తున్నాయని వివరించారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటున్న కాంగ్రెస్ పార్టీని ఓటుతో బంగాళాఖాతంలో కలపాలని చెప్పారు. రైతుబంధు ద్వారా ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారని, పీసీసీ అధ్యక్షుడు 24 గంటల కరెంట్ వేస్ట్ అంటున్నారని కాంగ్రెస్ తీరు ను ఎండగట్టారు. 10హెచ్పీ మోటర్ పెడితే సాధ్యమైతుంద ని చెబుతున్నారని కేసీఆర్ వివరించారు. రైతులు త్రీ హెచ్పీ లేదా 5 హెచ్పీ మోటర్లు వాడతారని, రా ష్ట్రంలో 30 లక్షల పంపు సెట్లు ఉన్నాయని వాటి స్థానంలో 10హెచ్పీ మోటర్లు కొనాలంటే 30వేల కోట్లు కావాలన్నారు. 10 హెచ్పీ మోటర్లు పెడితే బోర్లలో నీళ్ల సుక్క ఉండదన్నారు. కాంగ్రెస్ తీరుపై ఆలోచన చేయాల్సింది రైతులేనని కేసీఆర్ విన్నవించారు. బోధన్ నియోజకవర్గంలో షకీల్ అహ్మద్ ఆధ్వర్యంలో అభివృద్ధి భారీగా జరిగిందన్నారు.
నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో జరిగిన సభల్లో స్థానిక నేతలు మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, బిగాల గణేశ్ గుప్తా, జీవన్ రెడ్డి కోరిక మేరకు వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త బీడీ పింఛన్లు అందిస్తామన్నారు. కట్ ఆఫ్ డేట్ 2014ను తీసేసి అర్హులైన వారందరికీ మంజూరు చేస్తామని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచిందని, ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సిన పరిణతి ఇంకా రాలేదన్నారు. ప్రజాస్వా మ్య చైతన్యమంటే ఎన్నికల్లో గెలుపోటములే కాకుండా నిలబడిన అభ్యర్థి గుణమూ, గణమూ ఆలోచన చేయాలన్నారు. అభ్యర్థి వెనుకాల పార్టీల ను గుర్తెరగాలన్నారు. ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా మంచి వ్యక్తి అన్నారు. వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారన్నారు. నిజామాబాద్లో రైల్వే కమాన్ కష్టాలను తీర్చిన వ్యక్తి అంటూ కితాబునిచ్చారు. భారీ మెజార్టీతో మంచి మనిషి గణేశ్ గుప్తాను గెలిపించుకోవాలని సూచించారు. బీజేపోడు ఓట్లు అడిగేందుకు వస్తే నిలదీయాలన్నారు. పదేండ్లలో తెలంగాణకు కేం ద్రం సహకరించలేదన్నారు. విభజన చట్టాన్ని ఉల్లంఘించిందని చెప్పారు. ఐటీ హబ్, కొత్త కలెక్టరేట్లు షాన్దార్గా కట్టుకున్నామంటూ ప్రగతిని కండ్లముందు ఆవిష్కరించారు.
బోధన్, నవంబర్ 15: బోధన్ పట్టణంలో గురువారం బీఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ నిజామాబాద్లో సభకు హెలికాప్టర్లో బయలుదేరారు. సభలో పాల్గొన్న శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత సైతం సీఎం హెలికాప్టర్లోనే నిజామాబాద్కు బయల్దేరి వెళ్లారు. కవితతో పాటు మాజీ స్పీకర్ మధుసూదనాచారి, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మాజీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు. కాగా హైదరాబాద్ నుంచి మాజీ స్పీకర్ మధుసూదనాచారి సీఎం కేసీఆర్ హెలికాప్టర్లోనే వచ్చారు. బోధన్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల భర్త, బీఆర్ఎస్ నాయకుడు అనిల్రావు కూడా వచ్చారు.