నిజామాబాద్, ఆగస్టు 28, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/రామారెడ్డి : సీఎం కేసీఆర్ వెంటే మేమంతా.. మా పూర్తి మద్దతు గులాబీ అధినేతకే అంటూ కామారెడ్డి నియోజకవర్గంలో గ్రామగ్రామాన స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. తాజాగా రామారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలంతా మూకుమ్మడి తీర్మానాలతో కేసీఆర్కు మద్దతును తెలియజేశారు. అంతేకాకుండా ఏకంగా ఆసరా పింఛన్ డబ్బులను జమ చేసి కేసీఆర్ ఎన్నికల ఖర్చు కోసం అభిమానంతో పలువురు వృద్ధులు అందించారు. చందా రూపంలో కేసీఆర్ నామినేషన్ ఖర్చుల నిమిత్తం డబ్బులు జమ చేసిన వారిలో డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులు సైతం ఉండడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. కామారెడ్డి నియోజకవర్గంలో ఇప్పటి వరకు కామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ మండలాల్లో మద్దతు తీర్మానాలు జరిగాయి. సోమవారం రామారెడ్డిలోనూ పెద్ద ఎత్తున మద్దతు కార్యక్రమం జరిగింది. ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జై కేసీఆర్ అంటూ మద్దతును తెలియజేస్తుండడంతో ప్రతిపక్ష పార్టీల్లో గుబులురేపుతున్నది.
నాలుగు రోజుల క్రితం కామారెడ్డి మండలం గర్గుల్లో మొదలైన కుల సంఘాల మద్దతు పరంపర నియోజకవర్గం వ్యాప్తంగా కొనసాగుతున్నది. మాచారెడ్డి మండలంలో ఏకంగా 9 గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేసి కేసీఆర్కు మద్దతు తెలియజేశాయి. పాల్వంచలో దేవునిపల్లి గ్రామంలోనూ ప్రజలంతా కేసీఆర్కే జై కొట్టారు. రామారెడ్డి మండలంలోని కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన జగదాంబ తండా, బట్టుతండా, స్కూల్ తండా, గొడుగు మర్రి తండా గ్రామ పంచాయతీలన్ని తీర్మానాలు చేశాయి. ఎంత మంది పోటీ చేసినప్పటికీ కామారెడ్డి నియోజకవర్గం నుంచి కేసీఆర్కే ఓటేసి గెలిపించుకుంటామంటూ గిరిజనులంతా మూకుమ్మడిగా ముందుకు వస్తున్నారు. గిరిజనులు ఆరాధ్యదైవంగా కొలిచే సేవాలాల్ మహరాజ్ ఆలయంలో భోగ్భండార్ నిర్వహించి ఏకగ్రీవ తీర్మానాల ప్రతులను ఎంపీపీ దశరథ్ రెడ్డికి అందించారు. తొమ్మిదేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ ఆసరాగా నిలిచి వృద్ధులను ఆదుకున్నారు. వారందరూ తమ గురుతర బాధ్యతగా కేసీఆర్ను అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించుకునేందు అదే ఆసరా పింఛన్ డబ్బులను ప్రేమతో కేసీఆర్ కోసం సమర్పించుకున్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన విరాళాల డబ్బాలో ఎంపీపీ దశరథ్ రెడ్డి సమక్షంలో వృద్ధులు అందులో జమ చేశారు. రామారెడ్డి మండలానికి చెందిన మరో మహిళ తనకు డబుల్ బెడ్ రూం ఇల్లు అందించినందుకు గాను కృతజ్ఞతగా కేసీఆర్కు చందాను అందించారు. కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేయబోతున్న కేసీఆర్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామంటూ వారంతా శపథం చేశారు.
పేద ప్రజలకు ఆదుకుంటున్నది కేసీఆరే. గూడు లేని వారికి ఇండ్లు ఇచ్చి అండగా నిలుస్తున్నారు. కేసీఆర్ సార్ మాకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నడని తెలిసి ఆనందం వేసింది. నాకు డబుల్ బెడ్ రూం ఇల్లు ఇచ్చిండ్రు. మమ్ములను ఆదుకున్న పెద్ద సార్ను ఎన్నటికీ మరువం. ఆయన్ను వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకుంటం.
– బుర్ర భాగ్యలక్ష్మీ, రెడ్డిపేట, రామారెడ్డి
పింఛన్కు అర్హత ఉన్నప్పటికీ గతంలో పేదోళ్లను ఏ ఒక్కరూ ఆదుకోలేదు. కానీ కేసీఆర్ సార్ అచ్చినంక పేదోళ్లను ఆదుకుంటుండు. వృద్ధులకు పెద్ద కొడుకైండు. కేసీఆర్ వల్లే సాఫీగా జీవిస్తున్నం. నెలకు వచ్చే పింఛన్ డబ్బులు రూ.2016 విరాళం ఇస్తున్నా. నేనే కేసీఆర్పై అభిమానంతో ఎన్నికల ఖర్చుకోసం అందిస్తున్నాను.
– సలావత్ మారు, రెడ్డిపేట తండా, రామారెడ్డి
కామారెడ్డి నియోజకవర్గం నుంచి కేసీఆర్ సార్ పోటీ చేస్తుండడం మాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నది. కామారెడ్డి అభివృద్ధిలో రాకెట్ వేగంతో దూసుకుపోవడం ఖాయం. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని కేసీఆర్ చాలా అభివృద్ధి చేసిండు. కేసీఆర్ రాకతో ప్రజలంతా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా మద్దతును తెలియజేస్తున్నారు. కొద్ది రోజులుగా ఏకగ్రీవాల తీర్మానాలతో ప్రతిపక్ష పార్టీల్లో గుబులు పుడుతున్నది.
– దశరథ్ రెడ్డి, రామారెడ్డి ఎంపీపీ