పదేండ్లలో నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని.. ఎక్కడా లేని విధంగా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. ఎల్లారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇక్కడ పోటీచేస్తున్న నాన్ లోకల్ అభ్యర్థులు ప్రతిపక్ష పార్టీలకు జెండా, ఎజెండా లేవన్నారు. 15న సీఎం కేసీఆర్ ఎల్లారెడ్డికి వస్తున్నారని.. సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఎల్లారెడ్డి, నవంబర్ 13: నియోజకవర్గంలో బీఆర్ఎస్కు ఎదురు లేదని, ఇక్కడ పోటీచేస్తున్న నాన్ లోకల్ అభ్యర్థులు ప్రతిపక్ష పార్టీలకు జెండా, ఎజెండాలు లేవని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే జనార్దన్గౌడ్తో కలిసి ఎల్లారెడ్డిలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. 15న సీఎం కేసీఆర్ ఎల్లారెడ్డికి వస్తున్నారని, 50వేల మందిని సభకు తరలిస్తున్నట్లు తెలిపారు. పదేండ్లలో ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. ఎల్లారెడ్డిలో వంద పడకల వైద్యశాల పనులు వేగంగా జరుగతున్నాయని, గాంధారిలో రూ.పది కోట్లతో రోడ్డు పనులు పూర్తిచేశామని చెప్పారు.
గాంధారి మండలంలోని బుగ్గగండి రోడ్డు పనులు రూ.14కోట్లతో చేపడుతున్నామని అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోనే రూ.50కోట్లతో పనులు జరుగుతున్నాయని, రూ.ఐదున్నర కోట్లతో బస్టాండ్ నిర్మాణం త్వరలో పూర్తవుతుందని తెలిపారు. ప్రతిపక్షాల వారు ఏం చేస్తారో చెప్పకుండా తమను తిట్టుకుంటూ ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. 2018 ఎన్నికల్లో తనకు నోటు ఇచ్చి మరీ ఓటు వేశారని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటున్నదని తెలిపారు. సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కాశీ నారాయణ, జడ్పీటీసీ సభ్యులు జలంధర్రెడ్డి, ఊషాగౌడ్, బల్దియా చైర్మన్ కుడుముల సత్యం తదితరులు పాల్గొన్నారు.