సీఎం కేసీఆర్ చేసేది చెప్తారు.. చెప్పింది చేస్తారు. కాంగ్రెస్లెక్క బక్వాస్ మాటలు చెప్పరని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఎన్నికలు వస్తున్నాయి.. కాంగ్రెస్ పార్టీ బోగస్ హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు చూస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో కర్ఫ్యూలు, కరెంట్ కోతలు తప్ప ఏముండేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ మాయమాటలను నమ్మితే మళ్లీ గోసపడుడేనని హెచ్చరించారు. కేసీఆర్తోనే తెలంగాణకు శ్రీరామరక్ష , ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. వేల్పూర్ మండలం పడగల్లో డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి వేముల బుధవారం పంపిణీ చేశారు. లబ్ధిదారులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి గృహప్రవేశాలు చేశారు.
– వేల్పూర్, సెప్టెంబర్20
వేల్పూర్, సెప్టెంబర్ 20 : ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి ప్రశాంత్రెడ్డి అన్నారు. ఆయన చేసేదే చెప్తారని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా చెప్పింది తప్పకుండా చేస్తారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ లెక్క బక్వాస్, బోగస్, హర్రాస్ హామీలివ్వరని, వారు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఏమీ ఇవ్వరు కానీ, తెలంగాణలో అలవికాని హామీలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. మండలంలోని పడగల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని బుధవారం అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలిసి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి పాలు పొంగించారు.
ఇండ్ల పత్రాలను లబ్ధిదారులకు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. 96 ఇండ్ల సముదాయానికి కేసీఆర్ కాలనీగా నామకరణం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. రూ.6.29 కోట్లతో ఇండ్లు నిర్మించి పైరవీలకు తావు లేకుండా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. ఇదే ప్రాంగణంలో మరో 32 ఇండ్లు నిర్మించి రెండో విడుతగా అర్హులకు అందిస్తామని ప్రకటించారు. సొంత జాగా ఉన్న మరో 62 మందికి గృహలక్ష్మి పథకం కింద రూ. 3లక్షల చొప్పున ఆర్థికసాయం మంజూరు చేస్తామన్నారు. కేసీఆర్ పాలనలో పేదవారికే ప్రాధాన్యత తప్ప, పైరవీలకు ఏమాత్రం అవకాశం ఉండదని మంత్రి స్పష్టం చేశారు. మలివిడుత ఉద్యమం సందర్భంగా ఎంతో బలవంతులైన తెలంగాణ వ్యతిరేక శక్తులను ఎదుర్కొని కేసీఆర్ ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని గుర్తుచేశారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్న ధ్యేయంతో ప్రతి కుటుంబానికీ సంక్షేమ పథకాలను అందజేస్తున్నారని తెలిపారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెరవకుండా సీఎం కేసీఆర్ అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు, ఎస్సారెస్పీ రివర్స్ పంపింగ్ ఇందుకు నిదర్శనమని అన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, పింఛన్లు, కల్యాణలక్ష్మి తదితర పథకాలు సంక్షేమ పాలనకు అద్దం పడుతున్నాయన్నారు. రైతుబంధు పథకం కింద రూ.73 వేల కోట్లు, రుణమాఫీ కింద రూ.36 వేల కోట్ల నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఒక్క పడగల్ గ్రామంలోనే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం రూ. 71కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు.
గ్రామంలోని 1090 మంది లబ్ధిదారులకు ఆసరా పథకం కింద రూ. 16.19 కోట్ల మేర పింఛన్లు, కల్యాణలక్ష్మి పథకం ద్వారా 187 మందికి రూ. కోటీ 76 లక్షలు, సీఎంఆర్ఎఫ్ ద్వారా 152 మందికి రూ. 74.85 లక్షలు, రైతుబంధు కింద రూ. 10.46 కోట్లు అందించినట్లు వివరించారు. ఇంకా అర్హులుంటే పార్టీలకతీతంగా లబ్ధి చేకూరుస్తామన్నారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు, షాపింగ్ కాంప్లెక్స్, ఓపెన్ జిమ్, కమ్యూనిటీ హాళ్లు నిర్మించామని గుర్తుచేశారు. ఎంపీ అర్వింద్ గతంలో బాండ్పేపర్ రాసిచ్చి, అబద్ధపు హామీతో ఓట్లు దండుకున్నాడని, అలాంటి మాయ మాటలకు ఆగం కావొద్దని సూచించారు. ఎప్పటికైనా తెలంగాణకు కేసీఆరే శ్రీరామ రక్ష అని అన్నారు. ప్రజలు వాస్తవాలను గుర్తించి అభివృద్ధి సంక్షేమానికి పాటుపడుతున్న కేసీఆర్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలువాలని కోరారు. డీసీవో సింహాచలం, డీసీసీబీ వైస్చైర్మన్ రమేశ్రెడ్డి, ఆర్మూర్ ఆర్డీవో వినోద్కుమార్, ఆర్అండ్బీ ఎస్ఈ రాజేశ్వర్రెడ్డి, సర్పంచ్ వర్షిణీ రాజ్కుమార్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.