చిరుద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటున్నది. క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బందికి కేసీఆర్ సర్కారు పెద్దపీట వేస్తున్నది. గతంలో ఏ ప్రభుత్వం చేయని రీతిలో.. వేతనాల పెంపుతోపాటు బీమాసౌకర్యం సైతం కల్పిస్తున్నది. తాజాగా వీవోఏల గౌరవ వేతనాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గత పాలకులు చిరుద్యోగులను అసలు పట్టించుకోనే లేదు. మహిళా సంఘాల సహాయకుల సంక్షేమం గురించి ఆలోచించనే లేదు. కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చాక వారి కష్టాలను తొలగిస్తూ తొలిసారిగా వీవోఏలకు వేతనాలు అమలుచేశారు. తాజాగా వారికి మరింత వేతనం పెంచారు. దీంతో వీవోఏలకు 8 వేల వేతనం అందనున్నది. సర్కారు నిర్ణయంతో నిజామాబాద్ జిల్లాలో 804 మందికి లబ్ధి చేకూరనున్నది. ఖజానాపై భారం పడుతున్నా సిబ్బంది ప్రయోజనాల కోసం ప్రభుత్వం ముందుకురావడంతో వీవోఏలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
– కమ్మర్పల్లి, సెప్టెంబర్ 1
కమ్మర్పల్లి, సెప్టెంబర్ 1 : స్వయం సహాయక సంఘాలకు క్షేత్రస్థాయిలో కీలక సహాయక విధులు నిర్వహిస్తున్న వీవోఏలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రక్షా బంధన్ కానుకగా వారి వేతనాలను పెంచారు. డ్వాక్రా సంఘాలకు సహాయకులుగా ఉమ్మడి రాష్ట్ర కాలం నుంచే వారు పని చేస్తున్నారు. సంఘాలకు తాము విధిగా సహాయక బాధ్యతలు నిర్వహిస్తున్నామని..తమకు తగిన గౌరవ వేతనాన్ని ఇవ్వాలని ఉమ్మడి పాలకుల హయాంలో విన్నవించుకున్నా పట్టించుకోలేదు. దీంతో వారి వేతన ఆశలు నెరవేరలేదు. వారి ఇతర డిమాండ్లూ పరిష్కారానికి నోచుకోలేదు.
సర్కారుపై భారం పడుతున్నా..
స్వరాష్ట్రం వచ్చాక ఎన్నో వర్గాల డిమాండ్లను కేసీఆర్ సర్కారు నెరవేర్చింది. అడిగితే ఇస్తారు అనే నమ్మకం నెలకొనడంతో వీవోఏలు సైతం తమ డిమాండ్లను వినిపించారు. వారి డిమాండ్లను తెలంగాణ సర్కారు విన్నది…వేతన పెంపు ద్వారా ఏటా రూ.106 కోట్ల భారం పడనున్నా వెనుకడుగు వేయక గురువారం వారి వేతనాలను రూ.8 వేలకు పెంచుతూ జీవో 442 విడుదల చేసింది. దీంతో స్వయం సహాయక సంఘాల సహాయకులకు ఈ నెల నుంచి రూ. 8 వేల వేతనం అందనుండడమే కాకుండా వారి ఇతర కోరికలు నెరవేరనున్నాయి.
వీవోఏల కృషికి గుర్తింపు..
మహిళా పొదుపు సంఘాలకు వీవోఏలు కీలక సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. సంఘాలకు సంబంధించిన ఆర్థికపరమైన ఆంశాలు చూడడం, సదరు సమాచారాన్ని నోట్ బుక్కుల్లో నమోదు చేయడం ఉమ్మడి కాలంలో స్వచ్ఛందంగా చేసే వారు. కానీ వీరి కృషిని నాటి పాలకులు పట్టించుకోలేదు. వారు ఏ సంఘానికైతే పని చేస్తారో ఆ సంఘం నుంచి కేవలం రూ.2 వేలు మాత్రమే గౌరవ వేతనంగా అందుకునే వారు. మహిళా పొదుపు సంఘాల్లో సభ్యులను సమన్వయం, సంఘటితం చేస్తూ.. ఎప్పటికప్పుడు వారిని చైతన్యవంతులను చేస్తూ వస్తున్నారు. అవసరమైన సమావేశాలు నిర్వహిస్తూ సహాయక విధులను స్వచ్ఛందంగా చేస్తున్న వీవోఏలకు వేతన పెంపు యోచన గత పాలకులు చేయలేదు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగ, ఇతర వర్గాల డిమాండ్లను కేసీఆర్ ప్రభుత్వం మానవీయ కోణంలో ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నది. దీంతో వీవోఏల్లో సైతం అడిగితే వేతనం ఇస్తారనే భరోసా కలిగింది.
వేతనంతో పాటు అన్ని సౌకర్యాలూ..
మొదటి సారి అడిగినప్పుడు రూ.2016 నుంచి వీరికి ప్రభుత్వం రూ.3000 వేతనాన్ని ప్రారంభించింది. వీరికి పెంచిన పీఆర్సీని అమలు చేయడంతో రూ.3 వేలకు రూ.900 కలిశాయి. ఈ రూ.3,900, స్వయం సహాయక సంఘం నుంచి అందే రూ.2 వేలు కలుపుకొని మొత్తం రూ.5,900 అందేవి. వారి వేతనం ఈ మేరకు పెంపు కోసం నాడు జిల్లా నుంచి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అప్పుడు ఎంపీగా కల్వకుంట్ల కవిత వీవోఏలకు ఎంతో సహకారం అందించారు. అందుకే మొదటి సారి వేతన నిర్ణయం జరిగాక జిల్లాలో మంత్రి వేముల, కల్వకుంట్ల కవితకు అప్పట్లో వీవోఏలు అభినందన సభ నిర్వహించారు. తాజాగా మరో సారి వీవోఏలు చేసిన డిమాండ్ను సానుకూలంగా అర్థం చేసుకున్న సీఎం కేసీఆర్ వారికి రూ.8 వేల వేతనం అందేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు వారికి బీమా, యూనిఫామ్ సౌకర్యం కూడా అందనున్నది. వారి రెన్యువల్ పరిమితి రెండేండ్లకు పెరిగింది. దీంతో వీవోఏల్లో ఆనందం నెలకొన్నది.
కేసీఆర్ మానవీయతకు నిదర్శనం
ఉమ్మడి పాలకుల హయాంలో వీవోఏలకు లభించని మానవీయ నిర్ణయం స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందించారు. తమ సహాయక విధులను కర్తవ్యంగా నిర్వహిస్తూ మహిళలను సాధికారత దిశగా నడిపించే మహిళా పొదుపు సంఘాలకు వారి సేవలు ఎంతో ఉపయోగ పడుతున్నాయి. వేతనాల పెంపుతో వారి సేవలను గౌరవించినట్లయ్యింది. జిల్లా నుంచి వీవోఏలకు మొదటి నుంచి అన్నలా, అక్కలా అండగా ఉంటున్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ప్రత్యేక ధన్యవాదాలు.
-కుంట గంగాధర్ రెడ్డి, టీ-సెర్ప్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం
మా విన్నపాన్ని సీఎం కేసిఆర్ మానవీయ కోణంలో అర్థం చేసుకున్నారు. వేతనం పెంపుతో ఆయనకు రుణపడి ఉం టాం. నిజామాబాద్ జిల్లా నుంచి మాకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్న, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క అమూల్యమైన సహకారం అందించారు. వారికి ధన్యవాదాలు.
-అనూష, వీవోఏ, ఉప్లూర్, కమ్మర్పల్లి మండలం
కేసీఆర్తోనే సాధ్యమైంది
సీఎం కేసీఆర్తోనే మా వేతనాల పెంపు సాధ్యమైంది. మా వేతనం రూ.8 వేలకు పెంచడంతో మాలో మరింత ఉత్సా హం నెలకొన్నది. వేతనం పెరుగుదలతో పాటు యూనిఫామ్, జీవిత బీమా సౌకర్యం కూడా అందనుండడం సంతోషాన్ని నింపింది. గతంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత అందించిన సహకారాన్ని, మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి అండగా నిలవడాన్ని మరిచిపోలేం.
-సుభాష్, వీవోఏ, నాగాపూర్, కమ్మర్పల్లి మండలం