రాష్ట్రంలోని అన్ని సామాజికవర్గాల అభ్యున్నతికి కృషిచేస్తున్న సీఎం కేసీఆర్ మైనారిటీల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా మరో పథకానికి శ్రీకారం చుట్టారు. ఆర్థికంగా వెనుకబడిన మైనారిటీ వర్గాలకు రూ. లక్ష సహాయం అందించాలని నిర్ణయించారు. ముస్లిములు, క్రిస్టియన్ల నుంచి రూ.లక్ష సహాయం కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు.
– కామారెడ్డి, జూలై 24(నమస్తే తెలంగాణ)
కామారెడ్డి, జూలై 24 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభ్యున్నతికి పెద్ద పీట వేస్తున్నారు. ఏ సామాజిక వర్గం పట్ల వివక్ష లేకుండా ప్రగతి ఫలాలను అందజేస్తున్నారు. మైనారిటీల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా మరో పథకానికి శ్రీకారం చుట్టారు. బీసీ కులవృత్తిదారులకు రూ. లక్ష ఆర్థిక సహాయం చేస్తున్న విధంగానే మైనారిటీల్లోని పేదరికాన్ని, వెనుకబాటుతనాన్ని తొలగించడమే లక్ష్యంగా రూ.లక్ష సాయాన్ని అందించనున్నారు. గత నెలలో బీసీల్లోని కులవృత్తిదారులకు రూ.లక్ష సాయం అందించేందుకు దరఖాస్తులను స్వీకరించగా, తాజాగా ముస్లిములు, క్రిస్టియన్ల నుంచి రూ.లక్ష సహాయం కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆదివారం రాత్రి ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మైనారిటీ బాలబాలికలకు విలువలతో కూడిన విద్యను పొందే అవకాశం ఉండేది కాదు. కానీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలో 9 గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ పాఠశాలల్లో 7,996 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇప్పటి వరకు వీరిపై రూ.219 కోట్లు ఖర్చు చేశారు. మైనారిటీ కార్పొరేషన్ ద్వారా షాదీఖానాలు, మసీదులు, కబరస్తాన్ల అభివృద్ధికి, చర్చీల నిర్మాణానికి రూ.9.02 కోట్లతో పనులు పూర్తి చేశారు. షాదీముబారక్ పథకం కింద ఇప్పటి వరకు 5551మందికి రూ.53 కోట్ల 17లక్షలను అందజేసింది. మైనారిటీల్లో అనేక మంది చేతివృత్తులు, చిరు వ్యాపారాలు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. మైనారిటీలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభు త్వం అనేక పథకాలు అమలు చేస్తున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఎకనామిక్ సపోర్ట్ పథకం కింద అర్హులైన వారికి సబ్సిడీ రుణాలు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.లక్ష సబ్సిడీతో రుణాలను మంజూరు చేయాలని, మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణంగా అందజేయాలని మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. జనవరిలోనే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ చేపట్టగా జిల్లాలో సుమారు 4 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. అయితే కొన్ని కారణాలతో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా అర్హులైన నిరుపేద మైనారిటీలందరికీ రూ.లక్ష సాయం అందజేయాలని నిర్ణయించింది. ఈ మొత్తాన్ని బ్యాంకులతో సంబంధం లేకుండా అర్హులైన వారందరికీ ఏకమొత్తం గ్రాంట్గా అందజేయాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఇప్పటికే అందిన దరఖాస్తులకు ఇది వర్తింపజేయడంతో పాటు క్రిస్టియన్ మైనారిటీల నుంచి కొత్త దరఖాస్తులను స్వీకరించనున్నారు.
ముస్లిములకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి, ఇతర మైనారిటీలకు క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ నుంచి ఆర్థిక సహాయం అందజేస్తారు. బీసీలకు అందజేసిన విధంగానే పనిముట్లు, ముడిసరుకు కొనుగోలు, ఆధునీకరణ పనులకు మాత్రమే ఆర్థిక సహాయం అందజేస్తారు. ఈ పథకానికి 21 నుంచి 55 ఏండ్లలోపు వారు అర్హులు. వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలకు మించకూడదు. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే పథకం వర్తిస్తుంది. http://tsobmmsbc.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా మానిటరింగ్, స్క్రీనింగ్ కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. ఆ జాబితాకు కలెక్టర్, సంబంధిత జిల్లా మంత్రి ద్వారా ఆమోదం పొందాల్సి ఉంటుంది. అయితే గతంలో ఎకనామిక్ సపోర్ట్ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారిని ఎంపిక చేయగా, వారితో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిని ఎంపిక చేయనున్నారు. జిల్లాలో సుమారు 700 మంది మైనారిటీలకు లబ్ధి చేకూరనున్నది.
మైనారిటీల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం
మైనారిటీల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా దేశానికే ఆదర్శవంతమైన పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బీసీ కులవృత్తిదారులు, చేతివృత్తిదారుల అభ్యున్నతి కోసం రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేస్తున్న విధంగానే రాష్ట్రంలోని మైనారిటీలందరికీ రూ.లక్ష సహాయం అందజేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించి ఉత్తర్వులను జారీ చేశారు. మైనారిటీల్లో చాలా మంది చిన్న చిన్న వ్యాపారాలు, మెకానిక్ పనులు, మోటర్ రీవైండింగ్ పనులు, మిర్చీ బండీలు ఇలా అనేక పనులు చేస్తుంటారు. వారిని ఆర్థికంగా ఆదుకోవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఎంతో ప్రశంసనీయం.
-ఎంకే ముజీబుద్దీన్, ఉర్దూ అకాడమీ చైర్మన్
బహుత్ అచ్చా కియా
కేసీఆర్ సాబ్నే హర్ ఏక్ మజ్హబ్ వాలో కే సాథ్ ఇన్సాఫ్ కియా… మైనారిటీస్కు ఏక్ లాఖ్ దేకర్ బహుత్ అచ్ఛా కియా… గరీబ్ లోగోన్కు బహుత్ ఫాయిదా హోతా… కారోబార్ కర్లేతే సబ్ లోగ్… బాన్సువాడమే స్పీకర్ పోచారం సాబ్ హర్ ఏక్ కో సాత్ దేకర్ స్కీమ్స్ దిలాతే…. సబీకా షుక్రియా
-అబ్దుల్ వాహబ్, షాదీఖానా చైర్మన్, బాన్సువాడ
మాకు ఎంతో లాభం జరుగుతది
ప్రభుత్వం మైనారిటీలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించడంతో చిరు వ్యాపారులు, మెకానిక్లు అందరికీ ఎంతో లాభం జరుగుతది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. లక్ష రూపాయలతో వ్యాపారం చేసుకోవచ్చు. జీవితంలో స్థిరపడవచ్చు.
-షేక్ హాజీ అలీ, కామారెడ్డి
ప్రభుత్వానికి ధన్యవాదాలు
ప్రభుత్వం ప్రవేశపెట్టిన మైనారిటీలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం పథకం ద్వారా చిరువ్యాపారులు, వివిధ వృత్తి పనులు చేసుకునే వారికి ఎంతో లాభం చేకూరుతుంది. మేం ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం.
-సాజిద్, చిరువ్యాపారి, ఎల్లారెడ్డి
మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. ఇప్పటికే నిరుపేద విద్యార్థులకు గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. షాదీ ముబారక్తో ఎంతో లాభం జరుగుతున్నది. తాజాగా ప్రారంభించిన రూ.లక్ష ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంది.
-ముక్తార్, చిరు వ్యాపారి, బాన్సువాడ
చాలా మంచి పథకం
సీఎం కేసీఆర్ మైనారిటీల కోసం ఎంతో ఆలోచిస్తున్నారు. అందుకే అనేక పథకాల ద్వారా మైనారిటీలను ఆదుకుంటున్నారు. ఈ పథకంతో జిల్లాలోని నిరుపేద మైనారిటీలకు ఎంతో లాభం జరుగుతుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు.
-బాషుమియా, రైతు, నాగిరెడ్డిపేట