వేల్పూర్, అక్టోబర్ 1: దేశంలోనే నంబర్వన్ సెక్యులర్ లీడర్ సీఎం కేసీఆర్ అని, రాష్ట్రం లో కేసీఆర్ పాలన గంగా జమునా తెహజీబ్ను తలపిస్తున్నదని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ముస్లిముల అభ్యున్నతికి గతం లో ఏ నాయకుడూ కేసీఆర్లాగా ఆలోచన చేయలేదన్నారు. వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలోని ఏఎన్జీ ఫంక్షన్ హాల్లో బాల్కొండ నియోజకవర్గంలోని ముస్లిం మైనార్టీ మసీదుల అభివృద్ధికి మంజూరైన రూ.3కోట్లకు సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో కలిసి ఆదివారం అందజేశారు.
అనంతరం హోం మంత్రి మాట్లాడుతూ ముస్లిం బిడ్డకు రాష్ట్ర తొలి డిప్యూటీ సీఎం, రెండోసారి హోంశాఖ మంత్రి పదవులు ఇచ్చి యావత్ తెలంగాణ ముస్లిం మైనార్టీ ప్రజలను సీఎం కేసీఆర్ గౌరవించారన్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాత ముస్లిములు ఎంతో అభివృద్ధి చెందుతున్నారన్నారు. హింసకు తావు లేకుండా, గాంధేయ మార్గంలో రాష్ర్టాన్ని సాధించి, అనతి కాలంలోనే రాష్ర్టాన్ని అభివృద్ధిలో నంబర్ వన్ చేసిన వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి చూస్తుంటే సంతోషం కలుగుతున్నదన్నారు. కేసీఆర్కు అతి దగ్గరగా, ఆయన మదిలో ఉండే వ్యక్తి ప్రశాంత్రెడ్డి అని, ప్రశాంత్రెడ్డి లాంటి మంచి మనుసున్న నాయకుడు ఉండడం బాల్కొండ నియోజకవర్గ ప్రజల అదృష్టమన్నారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తండ్రి వేముల సురేందర్రెడ్డితో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ గుర్తుచేసుకున్నారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా మంత్రి ప్రశాంత్రెడ్డి పని చేస్తున్నారని ప్రశంసించారు. అభివృద్ధి చేసే ప్రశాంత్రెడ్డికి మైనార్టీలు మద్దతుగా నిలవాలని, రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
మైనార్టీలకు పెద్దపీట రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి
కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీలకు పెద్దపీట వేస్తున్నదని రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నిరంతరం మైనార్టీల బాగు కోసం కృషి చేస్తున్నారని, ముస్లిములకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారు ఆర్థికంగా బలోపేతమయ్యేలా శ్రమిస్తున్నారని అన్నారు. అనంతరం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మంజూరైన 300 కుట్టు మిషన్లను లబ్ధిదారులకు మంత్రులు మహమూద్ అలీ, వేముల ప్రశాంత్రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కోటపాటి నర్సింహ నాయుడు, డీసీసీబీ వైస్చైర్మన్ రమేశ్రెడ్డి, ఆర్మూర్ ఆర్డీవో వినోద్, ఏసీపీ జగదీశ్ చందర్, నియోజకవర్గంలోని మైనార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
మైనార్టీల అభ్యున్నతికి కేసీఆర్ కృషి మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
ముస్లిం పిల్లలు విద్యలో ప్రపంచంతో పోటీ పడాలనేది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని, ముస్లిం పిల్లలు కూ డా డాక్టర్లు, ఇంజినీర్లు, పైలట్లు, సైంటిస్టులు,మేధావులు ఎందుకు కాకూడదనే ఆలోచనతో సీఎం కేసీఆర్ మైనార్టీల అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్నారని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని బాల్కొండ, భీమ్గల్లో మైనార్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు. షాదీముబారక్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2లక్షల మంది లబ్ధిదారులకు రూ.240 కోట్లు ఇవ్వగా, బాల్కొండ నియోజకవర్గంలోనే రూ.200కోట్లు పింఛన్ల కింద లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. గతంలో మైనార్టీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారని, ఏనాడూ వారి అభివృద్ధి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాత మైనార్టీల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు. మైనార్టీలను గుండెలో పెట్టుకొని కాపాడుకునే కేసీఆర్కు ఎల్లప్పుడూ మద్దతుగా నిలవాలని కోరారు.