నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని స్పైసెస్ పార్క్ వద్ద గురువారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు బాల్కొండ ప్రజా బలగమంతా కదం తొక్కింది. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి తండోపతండాలుగా వచ్చిన జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సీఎం కేసీఆర్ కటౌట్లు, గులాబీ జెండాలు, కారు గుర్తులతో కూడిన ప్లకార్డులతో గులాబీమయమైంది. కార్లు, బస్సులు, ద్విచక్ర వాహనాలతో దారులన్నీ నిండిపోయాయి.
సువిశాలమైన స్థలం భారీగా తరలివచ్చిన ప్రజలతో జనసంద్రమైంది. సీఎం కేసీఆర్ ప్రసంగం, రాష్ట్ర మంత్రి వేముల చెప్పిన అభివృద్ధి మాటలను చక్కగా విన్నారు. ప్రతిస్పందనగా పెద్దఎత్తున చప్పట్లతో మద్దతు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బాల్కొండ నియోజకవర్గంలోని మోతె గ్రామ గొప్పతనాన్ని, ఈ గ్రామస్తులు చూపిన స్ఫూర్తిని గులాబీ దళపతి ఉటంకించడంతో ప్రజలంతా పులకించిపోయారు.
ప్రజా ఆశీర్వాద సభ ఆవరణలో కళాకారులు పాడిన గులాబీల జెండలే.. రామక్క.. అనే పాటకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, బీఆర్ఎస్ నేత రాజారాం యాదవ్ తదితరులు డ్యాన్స్ చేశారు. ప్రజాప్రతినిధులు డ్యాన్స్ చేయడంతో ప్రజలంతా వారిని అనుకరిస్తూ జై కొడుతూ డ్యాన్స్ చేయడంతో సభా ప్రాంగణం మొత్తం దద్దరిల్లింది.