రేకుల షెడ్డు… గాలి, వెలుతురు సోకని ఇరుకు గదులు.. సవాలక్ష సమస్యలతో సతమతమైన బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల.. ఇప్పుడు హైటెక్ సొబగులు దిద్దుకున్నది. ఆహ్లాదరకమైన వాతావరణం, సకల సౌకర్యాలు, ఆధునిక హంగులతో అలరారుతున్నది. రెండు దశాబ్దాల క్రితం ఇక్కడ విద్యాభ్యాసం చేసినవారు ఇప్పుడు కళాశాలను చూస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే! ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక పుష్కలంగా నిధులు విడుదల చేయడంతో ఊహించని విధంగా అభివృద్ధి చెందింది. ఈ ప్రభుత్వ కళాశాల ఇప్పుడు హైటెక్ కళాశాలగా మారింది.
– బోధన్, అక్టోబర్ 11
తెలంగాణ ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నది. సీఎం కేసీఆర్ ఎన్నో సంస్కరణలు తెచ్చి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యను చేరువ చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఉన్నత విద్యలో వచ్చిన విప్లవాత్మక మార్పునకు బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అద్దం పడుతున్నది. సమకాలీన ప్రపంచంలో పోటీపడేవిధంగా విద్యార్థులను తీర్చిదిద్దే లక్ష్యంతో ఆహ్లాదకరమైన వాతావరణమే కాదు.. హైటెక్ హంగులు, డిజిటల్ తరగతులతో విద్యాభ్యాసం కొనసాగుతున్నది. కళాశాలలో ప్రస్తుతం సుమారు 900 మంది విద్యార్థులు ఉండగా, బీఏ, బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సీ ఎంపీసీఎస్, బీజెడ్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బీఏ, బీకామ్ కోర్సులకు ఉర్దూమీడియం కూడా ఉన్నది. విద్యార్థులకు ఎన్సీసీ, జాతీయ సేవా పథకానికి సంబంధించి రెండు యూనిట్లను నిర్వహిస్తున్నారు.
విద్యార్థినులు చదువుతోపాటు వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు కళాశాలలో ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ను ఏర్పాటుచేశారు. ఇక్కడ కుట్టు, బ్యుటీషియన్, మెహందీ తదితర ఉపాధి కోర్సులు నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థినులు శిక్షణ పొందవచ్చు. సెల్ఫ్ డిఫెన్స్ కోసం ప్రత్యేకంగా కరాటే నేర్పిస్తున్నారు.
ఇక్కడ ఎక్కువగా గర్ల్స్ చదువుతున్నారు. వాతావరణం బాగుంటున్నది. మా కోసం స్పెషల్గా కేరింగ్ సెంటర్, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. లెక్చరర్లు ప్రత్యేక శ్రద్ధతో బోధిస్తారు. కుట్టుశిక్షణ, బ్యుటీషియన్ కోర్సుల్లో కూడా శిక్షణ ఇస్తున్నారు. ఇలాంటి సౌకర్యాలు ఉన్న కళాశాలలో చదువుకోవడం ఆనందంగా ఉన్నది.
– ఎ.సుల్తానా, బీకామ్ ఫైనలియర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బోధన్
బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుకోవడం మా అదృష్టం. ప్రైవేటు కాలేజీల్లో కూడా లేని అధునాతన సౌకర్యాలు ఉన్నాయి. కళాశాలలో చదువుకునేందుకు వీలుగా ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నది. ల్యాబ్లు, డిజిటల్ క్లాసులతోపాటు ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్పై శిక్షణ ఇస్తున్నారు.
-పి.స్వప్న, బీఎస్సీ బీజెడ్సీ సెకండియర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బోధన్
కళాశాలలో విశాలమైన తరగతి గదులతోపాటు మూ డు డిజిటల్ క్లాస్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ డిజిటల్ పద్ధతిలో బోధన జరుగుతున్నది. వీటితోపాటు ఒక వర్చువల్ క్లాస్రూమ్ను నిర్వహిస్తున్నారు. ఇందులో బోధనకు అవసరమైన రికార్డర్, ఆడియో, వీడియో, ప్రొజెక్టర్, స్మార్ట్ పెన్ ఏర్పాట్లు చేశారు. కళాశాలలో ఫిజి క్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ల్యాబ్స్తోపాటు ఇంగ్లి ష్ లాంగ్వేజ్ ల్యాబ్ కూడా ఉన్నది. వివిధ విభాగాలకు చెందిన విద్యార్థుల కోసం మొత్తం వంద కంప్యూటర్లు ఉన్నాయి.
మహిళలకు ప్రత్యేకంగా హెల్త్క్లబ్..
కళాశాలలో విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా హెల్త్క్లబ్ను ఏర్పాటుచేశారు. ఓ అధ్యాపకురాలి ఆధ్వర్యంలో దీనిని నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు అస్వస్థత కలిగినప్పుడు ఫస్ట్ ఎయిడ్ బాక్స్, వీల్చైర్తోపాటు విశ్రాంతి తీసుకునేందుకు బెడ్ సౌకర్యం కల్పించారు. విద్యార్థినులకు సమస్యలు ఎదురైనప్పుడు మానసిక ైస్థెర్యం నింపేలా కౌన్సెలింగ్ ఇస్తారు. కళాశాలలో క్రీడలకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు వ్యాయామం చేసుకునేందుకు వీలుగా జిమ్ సౌకర్యం కూడా కల్పించారు.
జిల్లాలోనే ఎక్కడాలేని విధంగా బోధన్ డిగ్రీ కళాశాలలో అతిపెద్ద లైబ్రరీ ఉన్నది. ఇందులో అకడమిక్ బుక్స్, జనరల్, కాంపీటేటివ్ మెటీరియల్తోపాటు దినపత్రికలను అందుబాటులో ఉంచారు. ఒకేసారి 50మంది విద్యార్థులు చదువుకునే సౌకర్యం ఉన్న ఈ లైబ్రరీలో 14,426 బుక్స్ ఉన్నాయి. దీంతోపాటు కంప్యూటర్లతో కూడిన డిజిటల్ లైబ్రరీని కూడా ఏర్పాటు చేశారు.
కళాశాలకు గతంలో రెండు బ్లాక్లు ఉండేవి. కొత్తగా అధునాతన హంగులతో ప్రభుత్వం రూ. 2.5కోట్లు ఖర్చుచేసి మరో బ్లాక్ నిర్మించింది. 2021లో ప్రారంభించిన కొత్త భవన సముదాయంతో కళాశాల రూపురేఖలు మారాయి. మొత్తం మూడు బ్లాక్ల మధ్య విశాలమైన ఆవరణలో అందమైన మొక్కలు, చెట్లు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. కలుషితం లేని గాలి, వెలుతురులో విద్యార్థులు ప్రశాంతంగా చదువుకోవడానికి అనువైన వాతావరణం ఉండడం కళాశాల ప్రత్యేకం.
పోటీ పరీక్షలను ఎదుర్కొనేలా తెలంగాణ స్టేట్ నాలెడ్జి సెంటర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తరచూ వివిధ అంశాలపై సెమినార్లు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ కంపెనీల ఆధ్వర్యంలో క్యాంపస్ ప్లేస్మెంట్లు కల్పిస్తున్నారు.
విద్యార్థులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందకు మా డిగ్రీ కళాశాలలో అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. కళాశాల గ్రామీణ విద్యార్థులకు ఒక వరంలాంటిది. డిజిటల్, వర్చువల్ పద్ధతిలో బోధన, అతిపెద్ద లైబ్రరీ, విద్యార్థినులకు హెల్త్క్లబ్, ఎంపవర్మెంట్ సెల్, నాలెడ్జ్ సెంటర్ మా కళాశాల ప్రత్యేకతలు. అన్నింటికీ మించి ఎంతో అనుభవం ఉన్న స్టాఫ్.. విద్యార్థులను ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నారు.
-ఎస్.రంగరత్నం, ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బోధన్