తెలంగాణ రాష్ట్రం.. దశాబ్దాలుగా మిగిలి పోయిన స్వప్నం.. ఏండ్లు గడుస్తున్నా గమ్యం చేరని స్వరాష్ట్ర పోరాటం.. ఎంతో మంది ఉద్దండులు ఉద్యమించినా నెరవేరని లక్ష్యం.. తెలంగాణపై ఆశలు సన్నగిల్లుతున్న వేళ ఒక ఉద్యమ కెరటం ఎగిసింది. సబ్బండ వర్గాలను సమ్మిళితం చేసి స్వరాష్ట్ర కాంక్షను రగిలించింది. ఆంధ్ర పాలకుల కుట్రలకు ఎదురొడ్డి, కేంద్రం మెడలు వంచి, తెలంగాణను సాధించిన ఆ ఉద్యమ సూరీడే సీఎం కేసీఆర్.. ప్రాణాలకు తెగించి స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన చంద్రశేఖరుడికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉన్నది. తెలంగాణ సాధన కోసం ఒంటరిగా బయల్దేరిన ఆయనను ఇందూరు గడ్డ అక్కున చేర్చుకున్నది. టీఆర్ఎస్ స్థాపనతో ఉద్యమ ప్రస్థానం ప్రారంభించిన కేసీఆర్కు మొదట జేజేలు పలికింది వేల్పూర్ మండలంలోని మోతె గ్రామమే. 2001 మే 5న ఇక్కడి మట్టితో ముడుపు కట్టిన కేసీఆర్ తెలంగాణ తెస్తానని శపథం చేశారు. 13 ఏండ్ల సుదీర్ఘ పోరాటంలో ఎన్నోసార్లు ఉమ్మడి జిల్లాకు వచ్చిన ఆయన ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. బోధన్లో నిరాహార దీక్షలకు స్ఫూర్తినిచ్చి, ఆర్మూర్లో ఎర్రజొన్న రైతుల తరఫున పోరాడి, కామారెడ్డిలో ‘ధూం ధాం’ నిర్వహించి స్వరాష్ట్ర కాంక్షను సజీవంగా నిలిపారు.ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా ప్రజలు కేసీఆర్ వెన్నంటి నడిచారు. అలా ఆనాటి నుంచి మొదలైన ఉద్యమ అనుబంధం తెలంగాణ సిద్ధించాక కూడా కొనసాగుతున్నది. ఇందూరు గడ్డపై సీఎం కేసీఆర్కు ఎంతో ఆప్యాయత ఉంది. అందుకే మిషన్ కాకతీయ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఆయన ఉమ్మడి జిల్లాలోనే శ్రీకారం చుట్టారు. నేడు సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఆయన ఉద్యమ ప్రయాణం, అభివృద్ధి ప్రస్థానంపై ప్రత్యేక కథనాలు..
నీళ్లు, నిధులు నియామకాలతోపాటు స్వపరిపాలన సాధన కోసం నిర్వహించిన తెలంగాణ మలి దశ ఉద్యమానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్ఫూర్తిగా నిలిచింది. ఉద్యమ దళపతి, గులాబీపార్టీ అధినేత, ప్రస్తుత సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఇక్కడి నుంచే పోరు మొదలైంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పురుడు పోసుకున్న టీఆర్ఎస్ పార్టీకి వెన్నంటే నిలిచింది. 2001 నుంచి ఇప్పటి వరకు గులాబీ బాస్ అన్నా.. పార్టీ అన్నా.. ఇక్కడి ప్రజలకు అమితమైన విశ్వాసం. టీఆర్ఎస్ ఆవిర్భావ తొలినాళ్లలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో అఖండ విజయాలను అందించారు ఇక్కడి ప్రజలు. జాతీయ పార్టీలను సైతం కాదని టీఆర్ఎస్ను అక్కున చేర్చుకున్నారు. ఆంధ్రా పెత్తందారుల వివక్షకు వ్యతిరేకంగా సాగిన టీఆర్ఎస్ పోరాటానికి ఊరూరా మద్దతు పలికారు. ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను వివరిస్తూ కేసీఆర్ నాడు చేసిన పర్యటనలు చరిత్రలో నిలిచిపోయాయి. నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ మండలం మోతెలో మట్టి ముడుపు, బోధన్లో నిర్వహించిన నిరాహార దీక్షలు, ఆర్మూర్లో చేపట్టిన టీఆర్ఎస్ ఆవిర్భావ మహాసభలు, కామారెడ్డి జిల్లాలో పార్టీ కోసం నిర్వహించిన కూలీ కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొని ప్రజల్లో స్ఫూర్తిని రగిలించారు. నేడు సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్తో ఉన్న అనుబంధంపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం…
కమ్మర్పల్లి, ఫిబ్రవరి 16: మలిదశ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటిన గడ్డ మోతె.. మలిదశ తెలంగాణ ఉద్యమంలో, స్వరాష్ర్టాన్ని సాకారం చేసిన ఉద్యమ నేత సీఎం కేసీఆర్కు మోతె గ్రామానికి ఉద్యమ ఆత్మీయ అనుబంధమున్నది. తెలంగాణ సాధనే ఏకైక ఎజెండాగా పని చేస్తున్న కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్కు మాత్రమే అండగా ఉంటామని ఏకగ్రీవంగా తీర్మానం చేసిన తొలి గ్రామం మోతె అయితే మోతె చాటిన ఈ స్ఫూర్తిని ఉద్యమ వ్యాప్తం చేసిన నాయకుడు కేసీఆర్. మోతె ఉద్యమ స్ఫూర్తిని నలుదిక్కులా చాటేందుకు అప్పట్లో కేసీఆర్ మోతె గడ్డ మట్టిని ముడుపు కట్టి తన వెంట తీసుకెళ్లారు. సకల జనులతో సుదీర్ఘ ఉద్యమం సాగించి..చావు నోట్లో తలపెట్టి స్వరాష్ర్టాన్ని సాధించుకున్నాక కేసీఆర్ మట్టి ముడుపును మళ్లీ మోతెకు తీసుకొచ్చి ఇక్కడే విప్పారు. ఇలా కేసీఆర్కు, మోతెకు మధ్య ఉద్యమ మట్టి ముడుపు సంబంధమున్నది.
రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా సాగుతున్న టీఆర్ఎస్కు, కేసీఆర్కే తాము మద్దతునిస్తామని అప్పటి స్థానిక సంస్థల సందర్భంలో 2001 మే 5న మోతె గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మోతె ప్రదర్శించిన ఈ ఉద్యమ స్పూర్తి అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలంగాణ గ్రామాల్లో ఉద్యమ ఆకాంక్షలకు నిదర్శనంగా నిలిచించి. తెలంగాణ కోసం ఏకగ్రీవంగా నడుం కట్టిన తొలి గ్రామంగా రికార్డులో నిలిచింది. దీంతో కేసీఆర్, దివంగత నేత వేముల సురేందర్రెడ్డి తదితర నాయకులతో కలిసి మోతెకు వెళ్లి గ్రామస్తుల ఉద్యమ పటిమను అభినందించారు. రాష్ట్రం ఆవిర్భవించాక 2014 మార్చి 28న వేముల సురేందర్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తదితర నేతలతో కలిసి మోతెకు వచ్చి ముడుపు విప్పారు.
బోధన్, ఫిబ్రవరి 16: తెలంగాణ మలిదశ ఉద్యమంలో రాష్ట్ర సాధనే ధ్యేయంగా బోధన్ పట్టణంలో సుదీర్ఘకాలంపాటు కొనసాగిన నిరాహారదీక్షలకు నాటి ఉద్యమనేత, నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్ఫూర్తిప్రదాతగా నిలిచారు. బోధన్లో ఏకంగా 1519రోజులపాటు తెలంగాణవాదులు నిరాహారదీక్షలు చేశారు. 2009 డిసెంబర్ 28న ప్రారంభమైన ఈ నిరాహారదీక్షలు 1519 రోజులపాటు.. అనగా 4 సంవత్సరాల 17 రోజులపాటు కొనసాగి 2014 ఫిబ్రవరి 23న ముగిశాయి. నిరాహారదీక్షలకు ఏడాది పూర్తయిన సందర్భంగా 2010 డిసెంబర్ 27న కేసీఆర్ బోధన్కు వచ్చారు. ఆ తర్వాత రెండో సంవత్సరం పూర్తయిన సందర్భంగా కూడా 2011 డిసెంబర్ 28న కేసీఆర్ వచ్చారు. ఆ రోజున శిబిరంలో 731రోజులకు గుర్తుగా 731 మంది మహిళలు దీక్షలో కూర్చున్నారు. ఈ రెండు సందర్భాల్లోనూ బోధన్ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగసభల్లో ఆయన మాట్లాడారు. ‘బోధన్లో తెలంగాణ కోసం నిరవధికంగా నిరాహారదీక్షలు చేస్తున్న తెలంగాణ బిడ్డలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా..’, ‘బోధన్ తెలంగాణ బిడ్డలకు నా సెల్యూట్’ అంటూ నాటి సభల్లో కేసీఆర్ వ్యాఖ్యానించారు.
ఇందల్వాయి, ఫిబ్రవరి 16: తెలంగాణ ఉద్యమ సమయంలో ఇప్పటి సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని కొరట్పల్లి గ్రామంలో తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని 2004ఏప్రిల్ 13న ఆవిష్కరించారు. అదే రోజు టీఆర్ఎస్ ఆవిర్భావ జెండాను కూడా ఎగరవేసి ఉద్యమ ఘనతను చాటి చెప్పారు. డిచ్పల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. రాష్ట్ర సాధన కోసం సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కామారెడ్డి, ఫిబ్రవరి 16: ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన ప్రాంతంగా.. ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీకి గ్రామాల్లో తిరుగులేని ఆదరణ, మద్దతు లభించింది. ఉద్యమంలో వివిధ రకాల కార్యక్రమాలతో నిత్యం ప్రజలతో కలిసి కేసీఆర్ ఉద్యమం సాగించారు. పార్టీని నడిపేందుకు అయ్యే ఖర్చులు, బహిరంగ సభల కోసం పార్టీ శ్రేణులు కూలీ పని చేయాలని నిర్ణయించి కూలీ ద్వారా నిధి సేకరణ చేపట్టారు. కామారెడ్డి పట్టణంలోని దేశాయి బీడీ ఫ్యాక్టరీ గోడౌన్లో తెలంగాణ కూలీ కార్యక్రమానికి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీడీ బెండళ్లను స్వయంగా మోశారు. కామారెడ్డి గాంధీ గంజ్లో బెల్లం ముద్దలను మోశారు. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కామారెడ్డి పట్టణంలో ఇరవైసార్లు పర్యటించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అవిర్భావం నుంచి కామారెడ్డి ప్రాంతం అండగా నిలుస్తూ వస్తున్నది.
సీఎం కేసీఆర్కు కామారెడ్డి ప్రాంతంతో ప్రత్యేక అనుబంధం ఉంది. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం కోనాపూర్ గ్రామంలో కేసీఆర్ తల్లి వెంకటమ్మ జన్మించారు. మానేరు ముంపు గ్రామం కాకపోతే కోనాపూర్లోనే కేసీఆర్ నివాసం ఉండి పెరిగే వారు. కేసీఆర్ తండ్రి రాఘవరావుది కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట. రాఘవరావు ఇల్లరికపు అల్లుడిగా పోసానిపల్లి గ్రామానికి వచ్చి వెంకటమ్మను వివాహం చేసుకున్నారు. ఎగువ మానేరు నిర్మాణ సమయంలో భూములు ముంపునకు గురికావడంతో కేసీఆర్ తల్లిదండ్రులు సిద్దిపేట జిల్లా చింతమడకకు వలస వెళ్లారు. అయితే కేసీఆర్ చింతమడకలోనే జన్మించారు. కేసీఆర్ తల్లిదండ్రులకు సంబంధించిన కోనాపూర్లోని ఇల్లు శిథిలావస్థకు చేరగా, దాన్ని గతంలోనే అమ్మివేశారు. ఉద్యమ సమయంలో కామారెడ్డిలోని కేసీఆర్ మేనమామ అడ్వకేట్ రామారావు, మేనల్లుడు కాంతారావుల ఇంట్లోనే ఎక్కువగా ఉండేవారు.
ఆర్మూర్, ఫిబ్రవరి16: తెలంగాణ ఉద్యమ కార్యాచరణకు, గులాబీ పార్టీ రాజకీయ శక్తిగా మారేందుకు దశాదిశను చూపింది ఆర్మూర్. ప్రత్యేక రాష్ట్ర సాధనలో తనదైన ముద్ర వేసుకున్నది. అలాగే పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు ఈ ప్రాంతంతో విడదీయని సంబం ధం ఉన్నది. 2013 ఏప్రిల్ 27న ఆర్మూర్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతినిధుల మహాసభ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏడోసారి టీఆర్ఎస్ అధినేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఇక నుంచి ఏ పార్టీతో పొత్తు ఉండదని, ఒంటరిగానే పోరాటం చేస్తామని ఎన్నికల సైరన్ మోగించడం ప్రత్యేకతను సంతరించుకున్నది. సుమారు ఐదు గంటలపాటు 40ఎకరాల్లో 35వేలకుపైగా మందితో నిర్వహించిన సభలో చేసిన తీర్మాణాలు.. నేడు అమలై కనిపిస్తుండడం విశేషం. 13 మే 2014 అక్షయతృతీయ రోజు ఆర్మూర్కు వచ్చిన కేసీఆర్ మొదటి ఎమ్మెల్యే టికెట్కు ఆశన్నగారి జీవన్రెడ్డి పేరును ప్రకటించారు.
1986లోనే కేసీఆర్ స్వయంగా కారు నడుపుకొంటూ అంకాపూర్ వచ్చి ఇక్కడి దేశీ చికెన్ తిన్నానని పలు సందర్భాల్లో చెబుతుంటారు. తొలిసారిగా సిద్దిపేట ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అంకాపూర్ను రహస్యంగా సందర్శించి, రైతులకు పత్రికా విలేకరిగా పరిచయం చేసుకొని పొలాలను సందర్శించినట్లు కేసీఆర్ చెప్పడం విశేషం. ఇప్పటికీ మహిళా సాధికారత విషయంలో… వ్యవసాయం విషయంలో ఎక్కడ ఎలాంటి సభ నిర్వహించినా ఆర్మూర్, అంకాపూర్ను గుర్తు చేస్తుంటారు కేసీఆర్.
తెలంగాణ ఉద్యమ సమయం.. 2001లో కేసీఆర్ కామారెడ్డికి వచ్చినప్పుడు బార్ అసోసియేషన్ అధ్యక్షుడి హోదాలో ముందుగా న్యాయవాదుల తరఫున అండగా నిలిచాం.అనేకమార్లు ఉద్యమంలో ఆయన వెంటే ఉన్నాం.అప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ వెంటే ఉన్నాం. మాలాంటి ఉద్యమకారులను గుర్తించిన కేసీఆర్.. తనకు 2017లో తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్గా బాధ్యతలను అప్పగించారు.
-కొమ్ముల తిర్మల్ రెడ్డి,
2001 నుంచి గ్రామ గ్రామాన పర్యటించారు. కామారెడ్డి ప్రాంతంలో పర్యటించినప్పుడు ఏ సమావేశాలు నిర్వహించినా కేసీఆర్ వెంటే ఉండేవాళ్లం. అప్పుడు కొద్దిమందితో మొదలైన ఉద్యమ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్గా ఆవిర్భావం నాటికి ఎంతో అభివృద్ధి చెందింది. ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి ఎంతో ఆదరణ లభిస్తుంది.
-జూకంటి ప్రభాకర్ రెడ్డి, కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు, బీఆర్ఎస్
ఉద్యమ సమయంలో మా గ్రామానికి వచ్చి చెప్పిన మాటలు నేటికీ గ్రామస్తులం మర్చిపోలేము. తెలంగాణలోనే మొట్టమొదటిగా అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేసిన జ్ఞాపకాలు మర్చిపోలేనివి. అదే స్ఫూర్తితో మా గ్రామం కేసీఆర్ వెంటే ఉంటుంది. ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన సేవలు మర్చిపోలేనివి.
– చెమ్మటి లక్ష్మీనారాయణ,మాజీ ఎంపీటీసీ, కొరట్పల్లి
ఉద్యమం సమయంలో డిచ్పల్లి మండలానికి వచ్చి పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపిన ఘనత సీఎం కేసీఆర్దే. నేటికీ ఆయన అడుగుజాడల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నాం. రాష్ట్రంతోపాటు దేశం బాగుండాలని కోరుతూ బీఆర్ఎస్గా అవతరించిన పార్టీకి సేవలందిస్తాం.
– శక్కరికొండ కృష్ణ, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు, డిచ్పల్లి
తెలంగాణ కోసం బోధన్లో 1519 రోజులపాటు నిరాహారదీక్షలు చేశాం.. ఈ దీక్షలకు మొదటి, రెండో సంవత్సరం పూర్తయిన సందర్భంగా కేసీఆర్ ఇక్కడికి వచ్చారు. తన ప్రసంగాలతో తెలంగాణవాదుల్లో ఉత్తేజాన్ని నింపారు. బోధన్ దీక్షల గూర్చి రాష్ట్రంలోని పలుచోట్ల కేసీఆర్ ప్రస్తావించేవారు. ఇది బోధన్ తెలంగాణవాదులకు ఎంతో గర్వకారణం. బోధన్ జేఏసీ కన్వీనర్గా తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్తో ఎప్పటికప్పుడు మాట్లాడేవాడిని.
– పి.గోపాల్రెడ్డి, బోధన్ జేఏసీ కన్వీనర్
మలిదశ తెలంగాణ ఉద్యమంలో నేటి సీఎం కేసీఆర్ రెండుసార్లు బోధన్కు వచ్చారు. నిరాహారదీక్షా శిబిరాలను సందర్శించి తెలంగాణవాదుల్లో జోష్ తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగసభల్లో కేసీఆర్ ప్రసంగాలు ఈ ప్రాంతంలో ఉద్యమం ఉవ్వెత్తున లేవడానికి దోహదం చేశాయి. నాడు ఇక్కడ జరిగిన ఉద్యమంలో టీఆర్ఎస్ కీలకపాత్ర పోషించింది. అప్పట్లో కేసీఆర్ను ఒక్క టీఆర్ఎస్ వాళ్లే కాకుండా అన్ని పార్టీల్లోని సామాన్య కార్యకర్తలు అభిమానించేవారు. బోధన్కు వచ్చిన రెండు సందర్భాల్లోనూ ‘బోధన్ తెలంగాణ బిడ్డలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా..’ అన్న ఆయన మాటలు ఎప్పటికీ గుర్తుంటాయి.
– ఎం.ఎ.రజాక్, తెలంగాణ ఉద్యమకారుడు, బోధన్
బోధన్లో తెలంగాణ నిరాహారదీక్షలకు రెండేండ్లు పూర్తయిన సందర్భంగా ఉద్యమ నాయకుడు కేసీఆర్ వచ్చారు. అప్పుడు మా సాలూరా నుంచి ప్రజలంతా బోధన్కు ర్యాలీగా వెళ్లాం. మహిళలు పాదయాత్ర చేశారు. కేసీఆర్ సాయంత్రం వస్తారని తెలియగా ఉదయం 10 గంటల నుంచి మా గ్రామానికి చెందిన 731 మంది మహిళలు 738వ రోజు దీక్షలకు సంకేతంగా నిరాహారదీక్ష చేశారు. ఈ మహిళలకు కేసీఆర్ పండ్లరసం ఇచ్చి ఆ రోజు సాయంత్రం దీక్షలను విరమింపజేశారు. ఈ ఘట్టాన్ని మేము ఎన్నటికీ మర్చిపోలేం.
– ఇల్లెపు గంగారాం, తెలంగాణ ఉద్యమకారుడు, సాలూరా
సీఎం కేసీఆర్ మోతె మట్టి ముడుపు కట్టినప్పటి ఉద్యమ జోష్ను మేము ఇప్పటికీ గుర్తు చేసుకుంటాము. తెలంగాణ రావాలి..కేసీఆర్ మా గ్రామ మట్టి ముడుపును మళ్లీ వచ్చి విప్పే రోజు రావాలి అని ఎదురుచూసే వాళ్లం. చివరకు కేసీఆర్ తెలంగాణను తెచ్చి.. మా ఊరికి మట్టి ముడుపు విప్పడం మరువలేం.
-నర్సయ్య, మోతె
కేసీఆర్కు మోతెతో ఉన్న ఉద్యమ అనుబంధం గర్వకారణంగా ఉంటుంది. కేసీఆర్కు మోతెపై గల ప్రత్యేక అభిమానాన్ని ఇతర గ్రామాల వారు గుర్తు చేస్తున్నప్పుడు సంతోషంగా ఉంటుంది.
-రాకేశ్, మోతె