ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ సిరిసంపదలతో రాజ్యం సుభిక్షంగా ఉంటుందని నమ్మిన సీఎం కేసీఆర్.. రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారు. తండ్రిలా, అన్నలా, మేనమామలా ఆడబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుకుంటూనే మహిళా స్వావలంబన, ఆర్థిక సాధికారత సాధించేలా వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ప్రపంచమే విస్తుపోయే పథకాలను రూపొందించి అందజేస్తున్నారు. మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై ప్రత్యేక కథనం..
స్వరాష్ట్రంలో మహిళా సంక్షేమానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా వినూత్న పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా సాధికారత సాధించేలా కృషి చేస్తున్నారు. ఆడ బిడ్డ పుట్టిన నాటి నుంచి పండు ముదుసలి వరకు ఏదో ఒక రూపంలో ప్రభుత్వ సంక్షేమ పథకం అందిస్తున్నారు. ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, వృద్ధులకు ఆసరా పింఛన్లు.. అండగా నిలుస్తున్నాయి. అమ్మకు కడుపు కోతలు ఉండొద్దనే లక్ష్యంతో ప్రభుత్వ దవాఖానల్లో నార్మల్ డెలివరీలను విస్తృతంగా ప్రోత్సహిస్తున్నది. షీ టీమ్స్ ఏర్పాటుతో ఆడబిడ్డల్లో ఆత్మైస్థెర్యం పెరిగింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం పేదింటి ఆడబిడ్డల ఇండ్లల్లో కల్యాణకాంతులను నింపింది. బాలికా విద్యకు విశేష కృషి చేస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో అతివలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు.
నిజాంసాగర్, జూన్12 : ఒకప్పుడు అడుగడుగునా వివక్ష ఎదుర్కొన్న స్త్రీమూర్తులు స్వరాష్ట్రంలో గౌరవంగా జీవిస్తున్నారు. సమాజంలో సగభాగం ఉన్న మహిళల కోసం రాష్ట్ర ప్రభు త్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, ఆసరా వంటి పథకాలు మహిళలపై సీఎం కేసీఆర్కు ఉన్న సానుకూల ధోరణికి ప్రత్యక్ష ఉదాహరణలు. వృద్ధులకు ఆసరా పింఛన్లు అందజేసి ఇంటికి పెద్దకొడుకు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఒంటరి మహిళలకు పెద్దన్నలా ఆర్థిక చేయూతను అందిస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేదింటి ఆడబిడ్డలకు మేనమామలా అండగా నిలబడుతున్నారు. చంటిబిడ్డ మొదలు కొని పండు ముసలి వరకు ఎన్నో పథకాలను అమలుచేయడం మహిళా సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం.
స్వపరిపాలనలో ప్రభుత్వ ప్రోత్సాహంతో మహిళాభ్యుదయానికి ముందడుగులు పడుతున్నాయి. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించడంతో ఆర్థిక సాధికారతను సాధిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా స్థానిక సంస్థలతోపాటు మార్కెట్ కమిటీల్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించింది. చట్ట సభల్లోనూ 33 శాతం రిజర్వేషన్ కావాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాటం కూడా చేస్తున్నది.
వివిధ కారణాలతో భర్త నుంచి విడిగా ఉంటూ కుటుంబభారంతో నానా అవస్థలు పడుతున్న మహిళలు ఎందరో ఉన్నారు. అలాంటి ఒంటరి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఆసరా పథకం కింద ప్రతినెలా రూ.రెండువేల పింఛన్ అందజేస్తున్నది. దీంతో ఒంటరి మహిళలు ఆర్థిక ఇబ్బందులు లేకుండా కుటుంబాలను ముందుకు తీసుకెళ్తున్నారు. 30 సంవత్సరాలు పైబడిన వారికి ఒంటరి మహిళా పింఛన్ అందిస్తున్నారు.
భర్తను కోల్పోయిన మహిళల బాధలు వర్ణనాతీతం. ఇంటి పెద్దదిక్కు కోల్పోయి పిల్లలు, కుటుంబ పోషణ భారంగా మారి ఇబ్బందులు ఎదుర్కొనేవారికి 2016 రూపాయల పింఛన్ అందజేస్తున్నారు. వితంతువులకు పింఛన్ పథకాన్ని 2014లో సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ప్రభుత్వం అందించే వితంతు పింఛన్తో వారి కుటుంబాలను భారం లేకుండా ముందుకు సాగిస్తున్నారు.
చిన్నారులు, పాలిచ్చే తల్లులు, గర్భిణుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ఆరోగ్య లక్ష్మి అనే పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తూ పిల్లలు, వారి తల్లులు, గర్భిణులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తున్నది. రాష్ట్రంలోని 149 ఐసీడీఎస్ ప్రాజెక్టులు, 35700 అంగన్వాడీ కేంద్రాల ద్వారా పథకాన్ని అమలు చేస్తున్నారు. ఏడు నెలల నుంచి మూడేండ్లలోపు వయస్సు ఉన్న పిల్లలకు గతంలో నెలకు 8 కోడిగుడ్లు అందించేవారు. ప్రస్తుతం 16 గుడ్లు ఇస్తున్నారు. గోధుమలు, పాలపొడి, శనగపప్పు, చక్కెర, నూనెలతో పాటు రెండు కిలోల ప్యాకెట్ను ప్రతినెలా మొదటి తేదీనే అందిస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు నెలకు మూడు కిలోల బియ్యం, కిలో కందిపప్పు, అరకిలో నూనె ఇంటికే అందించేవారు. కానీ ప్రస్తుతం రోజుకోపూట పోషకాలతో కూడిన సంపూర్ణ భోజనాన్ని అంగన్వాడీ కేంద్రాల్లోనే వండి పెడుతున్నారు. ప్రతిరోజూ పాలు, కోడిగుడ్లు కూడా ఇస్తున్నారు.
నవజాత శిశువుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వ దవాఖానల్లో పుట్టిన బిడ్డలకు 16 రకాల వస్తువులతో కూడిన కిట్ను అందిస్తున్నది. ఇదే స్కీంలో మగ శిశువు పుడితే రూ.12వేలు, ఆడపిల్ల పుడితే రూ.13వేలు అందిస్తున్నది. గర్భిణులను దవాఖానకు తీసుకెళ్లడం, ప్రసవానంతరం తల్లీబిడ్డలను క్షేమంగా ఇంటికి చేర్చేందుకు అమ్మఒడి పథకం కింద ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేశారు. దీంతో సర్కారు దవాఖానల్లో ప్రభుత్వ లక్ష్యం మేరకు ప్రసవాల సంఖ్య పెరుగుతున్నది.
ప్రమాదవశాత్తు ఇంటి యజమాని చనిపోతే ఆ కుటుంబం పడే కష్టాలు అన్నిఇన్నీ కావు. అలాంటి కుటుంబాలను ఆదుకుకోవాలనే ఉద్దేశంతో అపద్బందు పథకాన్ని ప్రవేశపెట్టారు.
ఆడబిడ్డకు పెండ్లి చేయాలంటే పేద కుటుంబాలకు తలకు మించిన భారమే. తల్లిదండ్రులు తమ బిడ్డలకు పెండ్లి చేసి అప్పుల పాలవుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు శ్రీకారం చుట్టారు. ఆడబిడ్డ పెండ్లి చేసిన కుటుంబానికి లక్షా 116 రూపాయలు అందజేస్తున్నారు. దీంతో పేద కుటుంబాల తల్లిదండ్రులు అప్పులు లేకుండా ఘనంగా పెండ్లి చేసి తమ బిడ్డలను ఆనందంగా అత్తారింటికి పంపిస్తున్నారు.
గర్భిణుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని రూపొందించింది. ప్రసవాల సమయంలో తల్లీబిడ్డల మరణాలను తగ్గించే లక్ష్యంతో గర్భిణులకు ఐదు, తొమ్మిదో నెల రెండు వేల విలువ చేసే న్యూట్రిషన్ కిట్లను అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా గర్భిణులకు ఆరోగ్య రక్షణ కల్పిస్తున్నారు.
పేద విద్యార్థులకు సకల సౌకర్యాలతో ఉచితంగా విద్యను అందించడంతోపాటు వారి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తున్నది. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో ఏడు నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థినుల కోసం బాలికా ఆరోగ్య రక్ష పథకాన్ని అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా హైజీన్ కిట్లను అందజేస్తున్నది. ప్రతి మూడు నెలలకోసారి ఏడాదిలో నాలుగుసార్లు ఈ కిట్లను అందజేస్తున్నారు. ఆరోగ్య రక్ష కిట్లకోసం ప్రతి బాలికపై ఏడాదికి రూ.1600 చొప్పున ప్రభుత్వ ఖర్చు చేస్తున్నది.
ఆడబిడ్డలను రాష్ట్ర ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటున్నది. ఇంటి నుంచి బయట అడుగు పెట్టాలంటే భయపడే రోజులు పోయాయి. బహిరంగ ప్రదేశాలతోపాటు విద్యాసంస్థల్లో మహిళలు, బాలికలను వేధించేవారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నది. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ను నిరోధించేందకు ప్రత్యేకంగా షీ టీములను ఏర్పాటు చేసింది. మహిళలు వేధింపులు ఎదుర్కొన్న వెంటనే షీ టీములకు సమాచారం అందజేస్తే క్షణాల్లో పోలీసు బృందం అక్కడికి చేరుకొని ఆకతాయిల భరతం పడుతున్నది.
మాతా శిశు సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా గర్భిణులకు ప్రసవాలు చేసేందుకు ప్రత్యేక సదుపాయలతో దవాఖానలను ఏర్పాటు చేసింది. దీంతో మాతృమరణాల రేటు 92 నుంచి 56కు, నవజాత శిశు మరణాల రేటు 25 నుంచి 19కి తగ్గడం గమనార్హం.
తెలంగాణలో ఆడబిడ్డలు జరుపుకొనే అతిపెద్ద పండుగ బతుకమ్మ. పేద, ధనిక వర్గాలు అనే తేడా లేకుండా అందరూ సంబురంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నది. రాష్ట్రంలోని మహిళలందరికీ ప్రతి సంవత్సరం దాదాపు కోటి బతుకమ్మ చీరలను అందజేస్తున్నారు.
మహిళలు తమ కాళ్లపై తాము నిలబడి పురుషులతో సమానంగా ఆర్థిక స్వావలంబన సాధించేందుకు రాష్ట్ర సర్కారు అనేక ప్రోత్సాహకాలను అమలు చేస్తున్నది. మహిళా స్వశక్తి సంఘాల ఆర్థికాభ్యున్నతి కోసం వడ్డీలేని రుణాలను ప్రవేశపెట్టింది. ఉపాధి నిమిత్తం ఆ సంఘాలు, సభ్యులకు స్త్రీనిధి రుణాలను అందిస్తున్నది. రుణ పరిమితిని రూ. 5లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సెర్ప్ ద్వారా బ్యాంకులు గ్రామీణ మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున రుణాలు ఇస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఈ రుణాలు దాదాపు మూడింతలు పెరిగాయి. మహిళా సంఘాలకు ఆర్థికంగా చేయూతనిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ.. దేశంలోనే మొదటి స్థానంలో ఉండడం గమనార్హం.
ఉమ్మడి రాష్ట్రంలో అరకొర జీతాలతో దీనావస్థలో గడిపిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సీఎం కేసీఆర్ వారి పనికి తగిన వేతనాలు అందిస్తున్నారు. కార్యకర్తలకు టీచర్ల హోదాను కల్పించడంతోపాటు వారి గౌరవ వేతనాన్ని రూ.4200 నుంచి ఒక్కసారిగా రూ.13,650కు పెంచారు.
ఏన్ఎంలతోపాటు గ్రామాల్లో ప్రతినిత్యం ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్న ఆశ కార్యకర్తలకు ఆంధ్రా పాలకుల హయాంలో సరైన గుర్తింపు దక్కలేదు. వెయ్యి రూపాయల వేతనం మాత్రమే అందించేవారు. ఆశ కార్యకర్తలు ప్రతిరోజూ పల్లెల్లో ఇంటింటికీ వెళ్లి గర్భిణులు, బాలింతల యోగక్షేమాలు తెలుసుకుంటారు. హెల్త్ సబ్సెంటర్లలో ఏఎన్ఎంలతో సమానంగా వీరుకూడా సేవలు అందిస్తుంటారు. ప్రత్యేక రాష్ట్రంలో వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక వారి పనిని గుర్తించారు. గౌరవ వేతనాన్ని రూ.9650కు పెంచారు. దీంతో ఆశ కార్యకర్తలు మరింత ఉత్సాహం, సంతోషంగా విధులు నిర్వహిస్తున్నారు.
ఈ విద్యా సంవత్సరం నుండి డిగ్రీ కోర్సుల్లో కొత్తగా 4 సంవత్సరాల బి.యస్.సి (ఆనర్స్ మరియు కంప్యూటర్ సైన్స్) కోర్సును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ కోర్సు బి.టెక్ (సి.ఇ.సి) కంప్యూటర్ సైన్స్ కోర్సుకు సమానం. బి.యస్.సి (ఆనర్స్ మరియు కంప్యూటర్ సైన్స్)ను మన నిశిత డిగ్రీ కళాశాలలో ప్రారంభిస్తున్నాము. ఇంటర్ పూర్తయి బి.టెక్ (సి.ఇ.సి)లో చేరని విద్యార్థులు Dost ద్వారా ఈ కోర్సులో అడ్మిషన్ పొందవచ్చు. Dost ఆన్లైన్లో మన కళాశాల ప్రైవేట్ కాలేజ్ “అటనామస్” లిస్ట్లో ఉంటుంది. మా కళాశాల “అటనామస్” కావున ప్లేస్మెంట్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మీరు ఈ కోర్సు ద్వారా డిగ్రీ పొంది విదేశాలలో యం.యస్. చేయడానికి కూడా అర్హులే. అలాగే మరొక మా విద్యాసంస్థ అయిన నిశిత కామర్స్ మరియు సైన్స్ కళాశాలలో ఈ సంవత్సరం బిసిఎ అనే కొత్త సబ్జెక్ట్ను ప్రారంభించడం జరిగింది. తెలంగాణ ప్రైవేట్ అన్ఎయిడెడ్ కళాశాలలో నిశిత కామర్స్ మరియు సైన్స్ కళాశాల వుంటుందని తెలియజేస్తున్నాము.