ప్రజాపాలన కార్యక్రమంలో అభయహస్తం ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించిన ప్రతి దరఖాస్తును నేటి నుంచి డాటా ఎంట్రీ చేయబోతున్నట్లుగా కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తున్నదన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో కౌంటర్ల వద్దకు వచ్చి ఆయా పథకాలకు దరఖాస్తు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సిబ్బందికి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు చేయడం ద్వారా మొదట్లో ఎదురైన ఇక్కట్లు ప్రస్తుతం వెలుగు చూడడం లేదని చెప్పారు. కామారెడ్డి జిల్లాలో 2.5లక్షల కుటుంబాలుంటే అంతకన్నా ఎక్కువ దరఖాస్తులను ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ప్రజాపాలన దరఖాస్తుల ప్రక్రియ ముగింపునకు చేరుతుండడంతో ఈ ప్రక్రియ జరుగుతున్న తీరుపై కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ను ‘నమస్తే తెలంగాణ’ పలుకరించింది. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..
ప్రజాపాలన అభయహస్తం పథకాలకు దరఖాస్తుల స్వీకరణ రేపటితో(జనవరి 6) ముగుస్తుంది. ఎవరైనా దరఖాస్తు చేయని నేపథ్యంలో వారంతా స్థానికంగా మండల కేంద్రాల్లోని ఎంపీడీవో, తహసీల్ కార్యాలయాల్లోనూ ఫారాలను అందివ్వొచ్చు. ప్రభుత్వం సైతం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ ప్రక్రియను చేపడుతున్నట్లుగా ప్రకటన చేసిన నేపథ్యంలో ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక్కో కుటుంబానికి ఒక్కో దరఖాస్తును అందిస్తున్నాం. పైగా కుటుంబంలో ఒకటికిపైగా దరఖాస్తులు నింపాల్సిన అవసరం లేదని ప్రజలకు వివరిస్తున్నాం. మండలాల్లో తహసీల్దార్, ఎంపీడీవోలను టీమ్ లీడర్లుగా నియమించాం. వారి పరిధిలోని కౌంటర్లలో దరఖాస్తుల ప్రక్రియను పర్యవేక్షిస్తారు. ప్రజలకు ఏమైనా అనుమానాలు ఉంటే టీమ్లీడర్లను సంప్రదించాలి.
పథకాల దరఖాస్తుకు గడువు సమీపించడంతో చివరి రోజు ప్రజలు ఎక్కువగా వచ్చే వీలుంటుంది. మరింత జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ప్రక్రియను విజయవంతంగా ముగిసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఫారాలను ఉచితంగానే అందిస్తున్నాం. ఎవ్వరికీ నయా పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి దరఖాస్తులను విక్రయించినట్లుగా మా దృష్టికి వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
దరఖాస్తు చేసే వారంతా కొత్తగా పథకాల్లో లబ్ధి పొందే వారే ఉండాలి. ఇప్పటికే పింఛన్లు స్వీకరిస్తున్న వారంతా మరోసారి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఎవ్వరూ గాబరా పడొద్దు. దరఖాస్తుదారుల డాటాను ఇప్పటికే మా వద్ద ఉన్న సమాచారంతో సరిచూడడం జరుగుతుంది. అభయహస్తం దరఖాస్తుతో ఆధార్ కార్డు, రేషన్ కార్డు నకలును జతచేయాల్సి ఉంటుంది. నిరక్షరాస్యులకు ఇబ్బంది లేకుండా కౌంటర్ల వద్ద అంగన్వాడీ, మహిళా సంఘాల ప్రతినిధులను సహాయకారిగా నియమించాం. ఇకపోతే ఎల్పీజీ ఏజెన్సీల వద్ద ప్రజలంతా భారీగా క్యూలైన్ కడుతున్నారు. ఈ-కేవైసీ కోసం బారులు తీరుతున్నారు. ఎవ్వరూ ఆందోళన చెందొద్దు. ప్రభుత్వమే అన్ని వివరాలను వెల్లడిస్తుంది. జిల్లాలో రోజుకు 70జీపీల్లో గ్రామసభలను నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు 416 జీపీల్లో సభలు పూర్తయ్యాయి. మూడు మున్సిపాలిటీల్లోని 80 వార్డుల్లోనూ వేగంగా ప్రక్రియ జరుగుతున్నది. నిరంతరం సమీక్ష, పర్యవేక్షణ చేస్తుండడంతో స్వయంగా తనిఖీలు సైతం చేపడుతున్నాం.
ప్రజాపాలన అభయహస్తం గ్యారెంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రశాంతంగా జరుగుతున్నది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రజలకు అనువైన ప్రాంతాల్లో కౌంటర్లను ఏర్పాటు చేసి దానికి సంబంధించిన సమాచారాన్ని గ్రామాలు, మున్సిపాలిటీ ఏరియాల్లో వార్డుల్లోనూ ప్రచా రం చేశాం. దరఖాస్తు ఫారాల కొరత మొదట్లో ఉన్నప్పటికీ ప్రస్తుతం అలాంటిదేమీ లేదు. ఇప్పటి వరకు స్వీకరించిన దరఖాస్తులను క్రమపద్ధతిలో ఆన్లైన్లో డాటాఎంట్రీ చేయబోతున్నాం. ఈ ప్రక్రియను శుక్రవా రం నుంచే మొదలు పెడుతున్నాం. ఇందుకు సంబంధించిన శిక్షణ కో సం జిల్లా నుంచి సంబంధిత వ్యక్తులను హైదరాబాద్కు పంపించాం. నేటి నుంచి డాటా ఎంట్రీని నిర్వహిస్తాం. స్వీకరించిన దరఖాస్తుల వరుసను అనుసరించి వాటిని కంప్యూటర్లో భద్రపరుస్తాం. భవిష్యత్తులోనూ రిఫరెన్స్గా ఉపయోగపడేలా ఈ డాటాను నిక్షిప్తం చేయ డం జరుగుతుంది. దరఖాస్తుదారులకు రశీదును అందిస్తున్నాం. ప్రజలంతా ఫారాలను పూర్తి సమాచారం తో నింపిన తర్వాత రశీదు విధిగా తీసుకోవాలి. అందులో పేర్కొన్న దరఖాస్తు నంబర్ ద్వారానే రాబో యే రోజుల్లో వివరాలను సరిచూడడం వంటివి జరుగుతుంది. డాటా ఎంట్రీని మండల కేంద్రాల్లోని తహసీల్, ఎంపీడీవో కా ర్యాలయాల్లో చేపట్టబోతున్నాం.