డిచ్పల్లి: డిచ్పల్లి మండలం సుద్దలం గ్రామశివారు పరిధిలోని అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నదని సర్పంచ్ చెవిటి వెంకటేశ్ తెలిపారు. 15 రోజుల క్రితం మేకల మందపై దాడిచేసిన చిరుత ఏడు జీవాలను గాయపరిచింది. అదే చిరుత శనివారం సాయంత్రం అటవీ ప్రాంతంలో నుంచి రోడ్డుపైకి వచ్చిందని గ్రామస్తులు సర్పంచ్కు సమాచారం అందజేశారు.
అయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వినోద్కుమార్కు చిరుత సంచరిస్తున్నదన్న సమాచారం సర్పంచ్ తెలియజేశారు. దీంతో అటవీ సిబ్బంది అక్కడికి చేరుకుని చిరుతపులి సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు. కాగా బోన్ ఏర్పాటు చేసి చిరుతను పట్టుకుంటామని వెల్లడించారు. గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.