ప్రతి నీటి చుక్కనూ సద్వినియోగం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. జల ప్రవాహాలకు అడ్డుకట్ట వేసి, సాగుకు మళ్లిస్తున్నది. రైతుల క‘న్నీటి’ కష్టాలకు ‘చెక్’ పెడుతూ, పొలాలకు జల సిరులు తరలించే మహా యజ్ఞాన్ని తలపెట్టింది. నదులు, వాగులపై చెక్డ్యాములు నిర్మిస్తూ వ్యవసాయాన్ని పండుగలా మార్చింది. ఎండాకాలంలోనూ వాగులు నిండుగా కనిపించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ చెక్డ్యామ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీటి నిర్మాణానికి విరివిగా నిధులు మంజూరు చేశారు. కామారెడ్డి జిల్లాలో 41 చెక్డ్యాముల నిర్మాణాలకు సర్కారు రూ.171.88 కోట్లను మంజూరు చేసింది. నిజామాబాద్ జిల్లాలోనూ విరివిగా నిర్మించేందుకు నిధులు విడుదల చేసింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో మంజీరతో పాటు కప్పలవాగు, పెద్దవాగులపై కట్టిన ఆనకట్టలతో భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగాయి. మిగిలినవి కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తున్నది.
బాన్సువాడ , ఆగస్టు 17: వాగుల్లో వృథాగా పోతున్న నీటిని పొలాలకు మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చెక్డ్యాములను నిర్మిస్తున్నది. వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తున్న రైతాంగానికి సాగునీటి ఇబ్బందులను తీర్చేందుకు కృషి చేస్తున్నది. వాగులు, వంకలపై చెక్డ్యాములను నిర్మిస్తూ నీటిని ఒడిసి పట్టేలా ప్రభుత్వం సంకల్పించింది. కామారెడ్డి జిల్లాలో 41 చెక్డ్యాములకు ప్రభుత్వం రూ.171.88 కోట్లను మంజూరు చేసింది.
బాన్సువాడ మండలంలోని చింతల్ నాగారం శివారులో గతేడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన చెక్డ్యామ్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. బీర్కూర్ శివారులో మంజీరలో మంజూరైన చెక్డ్యామ్ నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడింది. నిర్మాణ స్థలంలో ఇసుక మేటలు అధికంగా ఉండడంతో మంజీరలో వేసిన సీసీ బెడ్ కూలింది. దీంతో సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్కు నివేదిక పంపించగా నూతన షీట్ ఫైల్స్ పద్ధతిలో నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నారు. జుక్కల్ నియోజకవర్గంలో 12 చెక్డ్యాములు మంజూరయ్యాయి. బిచ్కుంద మండలం గుండెనెమ్లి గ్రామ శివారులో సుమారు రూ.17 కోట్లతో మంజీరపై నిర్మిస్తున్న చెక్డ్యాం పనులు 50శాతం పూర్తయ్యాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పనులు నిలిచాయి. పుల్కల్ శివారులో పనులు ప్రారంభానికి నోచుకోలేదు. కౌలాస్ వాగుపై దగిడె గ్రామంలో, మిషన్ కల్లాలి పెద్ద వాగుపై నిర్మిస్తున్న చెక్ డ్యాం నిర్మాణ పనులు 80 శాతం వరకు పూర్తయినట్లు నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.
నిజాంసాగర్ మండలంలోని నల్లవాగుపై మాగి గ్రామ శివారు, కళ్యాణి వాగు గునుకుల్ గ్రామంలో నిర్మించే చెక్డ్యాం నిర్మాణ పనులు సాంకేతిక కారణాలతో ప్రారంభం కాలేవని, మద్నూర్ మండలంలోని పన్నం వాగు, పెద్దవాగుపై నిర్మించే చెక్ డ్యాములను రైతులు వద్దని రాతపూర్వకరంగా విన్నవించడంతో పనులు నిలిచినట్లు అధికారులు చెబుతున్నారు. బిచ్కుంద మండలం హస్గుల్ గ్రామంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో పనులు ప్రారంభం కాలేదు. ప్రవాహం తగ్గిన వెంటే పనులు ప్రారంభం కానున్నట్లు తెలుస్తున్నది. జుక్కల్ నియోజకవర్గంలో 7 చెక్డ్యాముల పనులు నిలిచిపోగా, ఐదింటి పనులు సుమారు 80 శాతం మేర పూర్తయినట్లు నీటిపారుదలశాఖ జేఈ చందు తెలిపారు.
కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండలానికి ఐదు చెక్డ్యాములు మంజూయ్యాయని నీటి పారుదల శాఖ ఈఈ పోచమల్లు పేర్కొన్నారు. మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్, పాల్వంచ, వాడిలో ఒక్కో చెక్డ్యాం, భవానీపేట్కు రెండు చెక్డ్యాములు మంజూరు కాగా పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఇప్పటికే 90శాతం పనులు పూర్తిచేశామని, రివిట్మెంట్ పనులు మిగిలినట్లు అధికారులు తెలిపారు. ఎల్లారెడ్డి నియోజక వర్గానికి 22 చెక్డ్యాములు మంజూరు కాగా, 18 చెక్డ్యాముల నిర్మాణ పనులు 90శాతం పూర్తయ్యాయి. నీరు ఉండడంతో నల్లమడుగు, అడవిలింగాల్ గ్రామ శివారులో పనులు ప్రారంభం కాలేదు. షెట్పల్లిలో 60 శాతం పనులు పూర్తయ్యాయి. మాల్తుమ్మెద గ్రామంలో చెక్డ్యామ్ పనులు 30శాతం నిర్వహించినట్లు ఎల్లారెడ్డి నీటి పారుదల శాఖ డీఈ వెంకటేశ్వర్లు తెలిపారు.
నీటి వృథాను అరికట్టేలా..
సాగునీటి రంగంలో చెక్డ్యాముల నిర్మాణంతో రైతులకు మేలు చేకూరుతుందని సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గ్రహించారు. రాష్ట్ర ప్రభుత్వ ముందుచూపుతో చెక్డ్యాముల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. చెక్డ్యాముల నిర్మాణంతో ప్రధానంగా వరద నీరు నిల్వ ఉంటుంది. ఈ నీటిని వేసవికాలంలో పంపిణీ చేసుకొనేందుకు వీలవుతుంది. అలాగే భూగర్భ జలాలు పెరుగుతాయి. మంజీర నదిపై చెక్డ్యాములను నిర్మించడంతో నది పరీవాహక ప్రాంతాల్లో తాగు, సాగునీరు పుష్కలంగా అందనున్నది. నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి కందకుర్తి వరకు ఉన్న మంజీరా నదిపై అనేక చోట్ల ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. తాగునీటి నిర్వహణ పథకాలు ఉన్నాయి. నదిలో నీరు ఉంటేనే వీటికి జీవం పోసినట్లవుతుంది. నీరు లేకపోతే సాగునీటి పథకాలన్నీ వృథాగా మారే అవకాశం ఉన్నది. చెక్డ్యాము నిర్మిస్తే వీటికి ఉపయోగకరంగా ఉంటాయి. వర్షాలు పుష్కలంగా కురిస్తే మంజీరా నుంచి ఏటా 10 నుంచి 30 టీఎంసీల నీరు గోదావరిలో కలుస్తుంది. ఈ ప్రవాహాన్ని నిలిపేందుకు నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి త్రివేణి సంగమమైన కందకుర్తి వరకు ఎలాంటి అడ్డుకట్టలు లేవు. వీటన్నింటినీ గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం చెక్డ్యాముల నిర్మాణం చేపట్టి నీటి వృథాకు చెక్పెడుతున్నది.
జిల్లాలో మొదటగా పూర్తయింది.. బాన్సువాడ చెక్డ్యామ్..
బాన్సువాడ మండలం చింతల్ నాగారం శివారులో మంజీరాపై నిర్మించిన చెక్డ్యాం నిర్మాణం పనులు పూర్తయ్యాయి. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పర్యవేక్షణతో జిల్లాలోనే అత్యంత వేగంగా నిర్మించిన చెక్డ్యాముగా పేర్కొనవచ్చు. రూ.15.98కోట్లతో 450 మీటర్ల పొడవు, 3మీటర్ల (10ఫీట్ల) ఎత్తుతో చెక్డ్యామ్ను నిర్మించారు. చెక్డ్యాం వద్ద సుమారు 3వేల నుంచి 4 వేల క్యూసెక్కుల నీరు నిల్వ ఉంటుందని అధికారులు తెలిపారు. చెక్డ్యాం నిర్మాణం కావడంతో సుమారు 3.5 కిలోమీటర్ల మేర నీరు నిల్వ ఉంటుందని, దీంతోపాటు ఇరువైపులా ఉన్న గ్రామాల రైతుల బోరు బావుల్లో భూగర్భ జలాలు పెంపొందుతాయని చెబుతున్నారు. ఈ చెక్డ్యాం నిర్మాణంతో బాన్సువాడ నుంచి బొల్లక్పల్లి వంతెన క్రింది వరకు జలకళ సంతరించుకున్నది. నీరు నిల్వ ఉండండతో రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారానికి ధన్యవాదాలు
బాన్సువాడ నియోజకవర్గంతోపాటు కామారెడ్డి జిల్లాలో చెక్డ్యాములను మంజూరు చేయడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. బాన్సువాడలో నిర్మించిన చెక్డ్యామ్తో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నిలుస్తున్నది. దీంతో చుట్టుపక్కల రైతుల బోరుబావుల్లో భూగర్భ జలమట్టం పెరుగుతుంది. ఈ ప్రాంత రైతులు, ప్రజల పక్షాన సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి ప్రశాంత్రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు.
– పోచారం భాస్కర్రెడ్డి, డీసీసీబీ చైర్మన్
రైతాంగానికి మేలు చేసే సర్కారు..
గతంలో మా పొలాలకు నీటిని అందించేందుకు పైపులను లోపలిదాకా వేసేవాళ్లం. చెక్డ్యామ్ నిర్మాణంతో మా బోర్లల్లో నీరు పైకి వచ్చింది. మంజీరా నదిలో ఎటుచూసినా నీరే కనిపిస్తున్నది. ముందుచూపుతో సర్కారు చేసిన పని రైతాంగానికి చాలా ఉపయోగపడుతున్నది. పోచారం సార్ను ఈ ప్రాంత రైతులం మరిచిపోము.
– సంతోష్రెడ్డి, రైతు, తాడ్కోల్.
మొగులును చూసే పనిలేదు..
చెక్డ్యాముల నిర్మాణంతో మొగులును చూసే పనిలేదు. ఎల్లవేళలా సాగునీరు, పట్టణ ప్రజలకు తాగునీరు సైతం అందుబాటులో ఉంటున్నది. చెక్డ్యామ్ నిర్మాణంతో సుమారు 4కిలోమీటర్ల మేర నీరు నిలిచి ఉంటుందని అధికారులు చెప్పడం చాలా సంతోషంగా ఉన్నది. రైతుల అవసరాలను ముందుగానే గుర్తించి, పనులను చేయించడంలో స్పీకర్ పోచారం సార్ను మించిన నాయకులు ఉండరు. ఆయనకు రుణపడి ఉంటాం.
– అశోక్రెడ్డి, రైతు, పాత బాన్సువాడ
బీర్కూర్ చెక్డ్యామ్ రీడిజైనింగ్ కోసం పంపాం..
బీర్కూర్లో చేపట్టే చెక్డ్యామ్ పనుల పౌండేషన్లు మారాయి. ఇసుక ఎక్కువగా ఉండడంతో బెడ్కటాఫ్ పోర్షన్లో పౌండేషన్లు తీయలేకపోతున్నాం. దీంతో షీట్ఫైల్ అనే నూతన పద్ధతిలో పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్కు పంపించాం. షీట్ఫైల్స్తో డిజైన్ ఇచ్చారు. ప్రస్తుతం నీరు ఉండడంతో పనులు నిలిచాయి. సీడీవో ఇచ్చిన ప్రకారం పనుల్లో మార్పులు జరిగాయి. నీరు తగ్గిన వెంటనే పనులను ప్రారంభిస్తాం.
– రమ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, బాన్సువాడ