అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణపై కేంద్ర సర్కారు కుట్రలకు తెర లేపింది. రాష్ట్ర ప్రభుత్వానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నది. తనిఖీల పేరుతో రాష్ట్రంపై దండయాత్రలు చేస్తున్నది. రైసుమిల్లుల్లో సోదాలు చేపట్టిన మోదీ ప్రభుత్వం.. బియ్యం సేకరణను నిలిపి వేసింది. ఇప్పుడు పేదల ‘ఉపాధి’ మీద దెబ్బ కొట్టే కుట్రలకు పాల్పడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజామోదంతోనే ఉపాధి పనులు చేపడుతూ, నిధులు దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకుంటున్నది. ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడంతో అనేకసార్లు ఉభయ జిల్లాలకు జాతీయ స్థాయి అవార్డులు సైతం లభించాయి. అయితే, బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతుండడంతో రాష్ట్రంపై కక్షగట్టిన కేంద్రం.. నిధుల విడుదలలో ఆటంకాలు సృష్టించేందుకు యత్నిస్తున్నది. గ్రామాల్లోకి కేంద్రాల బృందాలను పంపుతూ ఇబ్బందులను సృష్టిస్తున్నది. ప్రజల నోటికాడి బుక్కను లాక్కునేందుకు యత్నిస్తున్న ప్రధాని మోదీ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిజామాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే దేశ ప్రగతికి ప్రథమ సోపానం అన్న నినాదంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాటుపడుతున్నారు. స్వరాష్ట్రంలో ఇప్పుడున్న పల్లెలన్నీ ప్రగతికి దర్పణంలా మెరుస్తున్నాయి. ఎనిమిదేండ్ల క్రితం ఇవే పల్లెలను పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. ట్యాక్సుల పేరిట జనాల నుంచి సొమ్ములు రాబట్టుకోవడం తప్ప వారు చేసిందేమీ లేదు. విప్లవాత్మకమైన కార్యక్రమాలతో దూసుకుపోతున్న తెలంగాణపై కేంద్ర సర్కారు కక్షకట్టి ఇబ్బందులకు గురి చేసేందుకు పూనుకున్నది. ఇందులో భాగంగా మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిలిపేసి ఇక్కట్లు సృష్టించేందుకు సిద్ధమవుతున్నది. మొన్నటికి మొన్న రైస్మిల్లుల్లో లోపాల పేరుతో ఎఫ్సీఐ ద్వారా కేంద్రప్రభుత్వం తనిఖీలను చేపట్టి బియ్యం సేకరణను నిలిపేయడంతో 50రోజులుగా మిల్లులు మూతపడ్డాయి. ఇదే రీతిలో కుంటి సాకులను వెతికే పనిలో కేంద్ర బృందాలు కొద్ది రోజులుగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పర్యటిస్తున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో సాగుతున్న ఈ తంతులో కోడిగుడ్డుపై ఈకలు వెతుకుతున్నట్లు అన్న చందంగా మారింది. పూడికతీసిన గోతిని, ఎత్తిపోసిన మట్టిని చూపించాలంటూ నిండుకుండలా మారిన చెరువుల్లో ఆధారాలు వెతుకుతున్న తెలివితేటలు కేవలం కేంద్ర బృందాలకు దక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది.
గ్రామ సభలే కీలకం..
ఉపాధి హామీ పథకం నిధుల మంజూరులో గ్రామసభలు కీలకంగా మారుతుంటాయి. గతంలో ఇష్టారీతిగా పనుల గుర్తింపు ఉండేది. ప్రజా ప్రతినిధులు తమకు అనుకూలంగా వాటిని ఎంపిక చేయించి ప్రజల సొమ్ము ను దుర్వినియోగం చేసేవారు. సామాజిక తనిఖీల్లో ఈ విషయం బహిర్గతమైంది. ఈ నేపథ్యంలో దాదాపు నాలుగేండ్లుగా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని గ్రామసభలో ఆయా పనులకు ఆమోద ముద్ర తీసుకుంటున్నారు. ప్రతి పంచాయతీకి ఈ పథకం కింద ఒక ఉద్యోగిని నియమించారు. చేపట్టాల్సిన పనుల్లో భూగర్భ జలాల పెంపొందించే వాటికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. కుంటలు, చెరువుల పూడికతీత, పంట కాలువలను శుభ్రం చేయడం, నీటి కుంటలు, కాంటురు కందకాలు, సమతల కందకాల తవ్వకం, వర్షపు నీరు మళ్లించేందుకు కాలువల నిర్మాణంపై దృష్టి పెడుతున్నారు. పండ్ల తోటలు, పొలాల గట్లపై మొక్కల పెంపకం వంటి పనులను ఎంపిక చేస్తున్నారు. అంతర్గత మట్టి రహదారులను నిర్మిస్తున్నారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధు ల సహకారం తీసుకుని ఏమేమి పనులు చేయాల్సిన అవసరం ఉందో పరిశీలిస్తున్నారు. వాటి ద్వారా ఎం త మంది ఉపాధి పొందుతారనేది లెక్కలు వేస్తున్నా రు. ఇలా నిధుల దుర్వినియోగం కాకుండా తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. సామాజిక తనిఖీల్లో బహిర్గతమయ్యే వారిని గుర్తిం చి, తప్పు చేసిన వారిపై క్రిమినల్ కేసులు సైతం నమోదు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి.
పారదర్శకతకు జాతీయ గుర్తింపు..
ఉపాధి హామీ పనుల అమల్లో అనేకసార్లు అవార్డులను సైతం ఉభయ జిల్లాలు గెలుచుకున్నాయి. 2014-15లో పారదర్శకత, జవాబుదారీతనం విభాగంలో జాతీయ అవార్డు వచ్చింది. సామాజిక భాగస్వామ్యం విభాగంలోనూ అవార్డు లభించింది. జిల్లా స్థాయిలో పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసినందుకు నిజామాబాద్కు జాతీయ అవార్డు వచ్చింది. 2015-16లో పారదర్శకత, జవాబుదారీతనం విభాగంలో మరోసారి అవార్డు దక్కింది. గ్రామస్థాయిలో నిజామాబాద్ జిల్లాకు ఘనత దక్కించుకుంది. పథకం పాలనా విభాగంలోనూ నిజామాబాద్ జిల్లా గన్నారం పంచాయతీకి అవార్డు దక్కింది. ఇక అత్యధికంగా పనిదినాలు కల్పించిన జిల్లాగా కామారెడ్డికి వరుసగా మూడుసార్లు అవార్డులు దక్కడం విశేషం. నిజామాబాద్ జిల్లాలో ఉపాధి హామీ పనులు జరిగే మండలాలు 27 ఉన్నాయి. 2లక్షల 76వేల 340 కుటుంబాలకు జాబ్ కార్డులు ఉన్నాయి. గుర్తింపు ఉన్న ఉపాధి హామీ కూలీలు మొత్తం 5లక్షల 62వేల 199 మంది ఉన్నారు. నిత్యం పనికి వచ్చేవారు 3లక్షల 1వేయి 418 మంది. ఇందులో ఎస్సీలు లక్షా 85వేల 949, ఎస్టీలు 64,927 మంది కాగా ఇతరులు లక్షా 87వేల 950 మంది ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో 22 మండలాల్లో 2లక్షల 58వేల 910 కుటుంబాలకు జాబ్ కార్డులు ఉన్నాయి. గుర్తింపు ఉన్న ఉపాధి హామీ కూలీలు మొత్తం 5లక్షల 38వేల 919 మంది ఉన్నారు. నిత్యం పనికి వచ్చే వారి సంఖ్య సుమారు 2లక్షల వరకు ఉంటుంది.
కూలీల పొట్టకొట్టేలా..
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తెలంగాణ రాష్ట్రం విజయవంతంగా అమలు చేస్తున్నది. బీజేపీ పాలిత రాష్ర్టాల కన్నా ఎక్కువ ప్రగతి కనిపిస్తుండడంతో బీజేపీ సర్కారు కక్షకట్టి నిధుల విడుదలలో ఆటంకాలు సృష్టించేందుకు యత్నిస్తున్నది. చాకచక్యంగా అతి తెలివి తేటలను ప్రదర్శిస్తూ తనిఖీల పేరిట లోపాలను వెతుకుతున్నారు. వాటిని అడ్డం పెట్టుకుని నిధులు మంజూరు కాకుండా చేసి అభివృద్ధికి మోకాలడ్డు పెట్టడానికి కేంద్ర సర్కారు పాల్పడుతుండడం హాస్యాస్పదంగా మారింది. తెలంగాణ ప్రజల నోటికాడి బుక్కను లాక్కుంటూ పైశాచిక ఆనందం పొందుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీరును ప్రజలు తీవ్రంగా తప్పు పడుతున్నారు. రాజకీయంగా టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ను ఎదుర్కోలేక అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం ఏంటంటూ మేధావి వర్గం ప్రశ్నిస్తున్నది.
కక్షపూరిత ధోరణి మానుకోవాలి..
ధర్పల్లి, జూలై 20: తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్షగట్టింది. పేదలు చేసుకునే ఉపాధి కూలీని దెబ్బకొట్టాలని చూస్తున్నది. లక్ష్యం మేర నిరుపేదలు లబ్ధి పొందేలా ఉపాధి పనులు కల్పిస్తూ అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నది. కేంద్ర ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుంది.
–విక్రమ్రెడ్డి, రైతు, మైలారం, ధర్పల్లి
కేంద్ర ప్రభుత్వ తీరు శోచనీయం..
ధర్పల్లి, జూలై 20: కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకంపై తనిఖీల పేరిట తెలంగాణపై కక్షగట్టి సక్రమంగా జరిగే పనులను జరగకుండా భయభ్రాంతులకు గురిచేస్తున్నది. పూడికలు తీసిన చెరువులు భారీ వర్షాలతో నిండిపోయాయి. ఇప్పుడు అక్కడ తీసిన పూడికను ఎలా చూయించాలి. చిన్నచిన్న కారణాలు, కుంటి సాకులు చెప్పి తెలంగాణలో రాజకీయ లబ్ధి పొందడానికి కేంద్రం కొత్తగా తనిఖీల పేరిట నాటకమాడుతున్నది. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలు మానుకోకపోతే తగిన గుణపాఠం చెబుతాం.
– పెండ గంగాధర్, ఎంపీటీసీ దుబ్బాక, ధర్పల్లి
ఉపాధి పనులు లేకుండా కుట్ర..
గాంధారి, జూలై 20: తనిఖీల పేరుతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతూ.. భవిష్యత్తు లో కూలీలకు పనులు కల్పించకుండా కుట్ర చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ విధానాలతో చాలా మంది ఉపాధిని కోల్పోయి రోడ్డున పడుతారు.
– శివరాజ్, సీతాయిపల్లి, గాంధారి
అభివృద్ధిని ఓర్వలేకనే..
గాంధారి, జూలై 20: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేకనే.. కేంద్ర ప్రభు త్వం ఉపాధి పనులకు నిధులను నిలిపివేసేలా కుట్రలు చేస్తున్నది. దీంట్లో భాగంగానే ప్రత్యేక బృందాలతో తనిఖీల పేరు తో ఇబ్బందులు పెడుతున్నది. కూలీల పొట్టకొట్టడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తున్నది.
– అయ్యాల సంజీవ్, గండివేట్, గాంధారి
నిధులు నిలిపివేసే కుట్ర..
గాంధారి, జూలై 20: తెలంగాణ రాష్ర్టానికి నిధులు నిలిపివేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. దీంట్లో భాగంగానే సామాజిక తనిఖీల పేరుతో ఇప్పటి వరకు చేసిన పనులను ప్రత్యేక బృందాలు పరిశీలిస్తున్నాయి. ఏదో ఒక రకమైన కుంటి సాకులను కారణంగా చూపించి నిధులు రాకుండా చూస్తున్నారు.
–బిచ్చంనాయక్, మేడిపల్లి, గాంధారి