నిజామాబాద్ నగరానికి చెందిన ఓ యువకుడు సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టాడు. దీంతో ఎదురుగా బైక్పై వస్తున్న వ్యక్తి తలకు తీవ్రగాయమై దవాఖాన పాలయ్యాడు.
కామారెడ్డికి చెందిన ఓ యువకుడు నిజామాబాద్కు బయల్దేరాడు. డిచ్పల్లి సమీపంలోకి వచ్చేసరికి ఫోన్కాల్ రావడంతో లిఫ్ట్ చేసే క్రమంలో మొబైల్ కిందపడిపోయింది. దానిని తీసుకునేందుకు సడన్ బ్రేక్ వేయడంతో బైక్ స్కిడ్ అయి కిందపడడంతో తీవ్రగాయాలయ్యాయి.
.. ఇలా సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడంతో, ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడంతో రోజూ ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
బాన్సువాడ రూరల్, ఆగస్టు 28 : నేటి ఆధునిక జీవితంలో సెల్ఫోన్తో విడదీయరాని బంధం ఏర్పడింది. ప్రతి సెకను అంటిపెట్టుకొని ఉండాలన్న ఆసక్తి.. ఏ పరిస్థితుల్లో ఉన్నా కాల్ లిఫ్ట్ చేయాలనే ఆతృత.. అనేక అనర్థాలకు దారి తీస్తున్నది. సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం నేరమని తెలిసినా కొందరు ముందువెనుకా గమనించకుండా ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతున్నారు. ట్రాఫిక్ రద్దీలోనూ సెల్ఫోన్ మాట్లాడుతూ క్షణాల్లో జీవితాలను తలకిందులు చేసుకుంటున్నారు. వారే కాకుండా ఎదుటివారికి ప్రమాదం జరిపి తీవ్ర నష్టాన్ని మిగిలిస్తున్నారు.
యుక్త వయస్సులో అధిక సెల్ఫోన్ వినియోగం యువత పాలిట శాపంగా మారుతున్నది. చెవిలో ఇయర్ఫోన్లు పెట్టుకుంటూ బైక్పై ఇద్దరి నుంచి ముగ్గురు కూర్చుండి రయ్ రయ్మంటూ దూసుకెళ్తూ సంగీత సాగరంలో మునిగి తేలుతూ ప్రమాదాలబారిన పడి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తున్న సంఘటనలు తరచూ సంభవిస్తున్నాయి. ఫోన్ వాడకం అవసరమే కానీ, అనవసరపు సమయాల్లో అధికంగా ఫోన్ వాడుతూ యువత ప్రాణాలు కోల్పోతున్న కథనాలు నిత్యం చూస్తున్నాం.
ఇయర్ ఫోన్స్..
చెవుల్లో ఇయర్ఫోన్స్, బ్లూటూత్ పెట్టుకొని పరధ్యానంగా డ్రైవ్ చేసే వారు చుట్టు పక్కల శబ్దాలు వినిపించక ప్రమాదాలకు కారణమవుతున్నారు. సెల్ఫోన్ డ్రైవింగ్ కన్నా ఇయర్ఫోన్స్ డ్రైవింగ్ మరింత ప్రమాదకరం. సెల్ఫోన్ వాడే వ్యక్తి కేవలం కాల్ వచ్చినప్పుడు మాత్రమే లిఫ్ట్ చేసి మాట్లాడతారు. ఇయర్ఫోన్స్తో డ్రైవింగ్ చేసేవారు ఎక్కువ మంది కాల్ మాట్లాడడం కన్నా సంగీతం వింటూ ప్రమాదాలకు కారకులుగా మారుతున్నారు. ఇలా వాహనాలు నడపడంతో అమాయక ప్రజలు బలవుతున్నారు. ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఆ ప్రభావం కుటుంబం బతికున్నంత కాలం ఉంటుంది. ఇంటి పెద్దదిక్కు మరణిస్తే ఆ కుటుంబ జీవనవిధానం మొత్తం ఛిద్రమవుతుంది.
ప్రమాదాల్లో 70 శాతం యువతే..
మారతున్న శాస్త్రసాంకేతిక రంగాలను అంది పుచ్చుకుంటున్న యువ త వాటివల్లే ప్రమాదాల బారినపడుతున్నారు. ఇయర్ఫోన్స్ వాడుతూ ప్రమాదాలబారిన పడుతున్న వారిలో 70శాతం యువతే ఉందని పలు సర్వేలు పేర్కొనడం ఆందోళన కలిగించే విషయం. ముఖ్యంగా కళాశాలలకు వెళ్తున్న ప్రతి ఒక్కరికీ స్మార్ట్ఫోన్ ఉందంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మొబైల్స్కు ఇయర్ఫోన్లు పెట్టి వాహనాలు నడుపుతూ, నడుచుకుంటూ పాటలు వింటూ ఎందరో రోడ్డుపై కనిపిస్తున్నారు. దీంతో వెనుక నుంచి వస్తున్న వాహనాల హారన్ వినపడని పరిస్థితి ఉంటుంది. ఇయర్ఫోన్లు పెట్టుకొని రోడ్డును దాటడం, యూటర్న్ల వద్ద ప్రమాదాలకు గురై తనువు చాలిస్తున్నారు.
డ్రైవింగ్ సమయంలో సెల్కి దూరంగా..
వాహనాలు నడుపుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మొబైల్లో మాట్లాడొద్దు. వాహనంపై వెళ్తున్నప్పుడు తరుచూ ఫోన్లు వస్తుంటే వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి మాట్లాడాలి. ఇయర్స్ఫోన్స్ ఉన్నాయి కదా అని ఫోన్లో మాట్లాడడంతో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. మొబైల్ నెట్ను ఆన్చేసి ఉంచడంతో తరుచూ సామాజిక మాధ్యమాల మెస్సేజ్లు వస్తుంటాయి. సాధ్యమైనంత వరకు నెట్ను ఆఫ్ చేసి ఉంచాలి.
ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం నేరం..
సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చట్టం 184ఏ ప్రకారం మొబైల్స్, ఇయర్ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుతూ వాహనాలు నడిపితే రూ. 500 జరిమానా విధిస్తారు. అదేవ్యక్తి రెండోసారి పట్టుబడితే రూ.1000 జరిమానా విధిస్తారు. మూడోసారి పట్టుబడితే అవసరమై తే డ్రైవింగ్ లైసెన్స్ను రద్దు చేస్తారు.