నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 11 : జిల్లావ్యాప్తంగా ముస్లింలు రంజాన్ పండుగను గురువారం ఘనంగా జరుపుకున్నారు. నెల రోజుల పాటు చేపట్టిన ఉపవాసాలను విరమించారు. ఉదయాన్నే నూతన దుస్తులు ధరించి మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఇండ్ల వద్ద బంధువులు, స్నేహితులకు పాయసాలు, విందు ఏర్పాటు చేసి రోజంతా సందడి చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలో ఈద్గా వద్ద ప్రార్థనలు చేస్తున్న ముస్లింలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నందిపేట్, మాక్లూర్ మండల కేంద్రాల్లో జడ్పీచైర్మన్ దాదన్నగారి విఠల్రావు రంజాన్ వేడుకల్లో పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.