ఖలీల్వాడి, జనవరి 2 : జిల్లాకేంద్రంలోని వినాయక్నగర్లో ఉన్న ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ నారాయణరెడ్డి సోమవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా ఏర్పాట్ల నడుమ కొనసాగుతున్న మరమ్మతు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నాణ్యతతో పనులు జరిగేలా పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన కలెక్టర్.. అవి నిరంతరం పని చేసేలా చూడాలన్నారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఇతర సామగ్రికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా గోడౌన్లోనే పూర్తిస్థాయిలో సదుపాయాలు కలిగి ఉన్న గదుల్లో భద్రపర్చాలని, ఏ చిన్న వస్తువు కూడా బయటికి వెళ్లకుండా నిఘా ఉంచాలన్నారు. షార్ట్సర్క్యూట్కు ఆస్కారం లేకుండా నాణ్యమైన సామగ్రిని వినియోగిస్తూ, విద్యుత్ సంబంధిత పనులను పక్కాగా జరిపించాలన్నారు. వచ్చే ఆదివారం నాటికి పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. మరమ్మతు పనుల్లో పాల్గొనే వారి పూర్తి వివరాలు సేకరించాలని, ఆధార్ జిరాక్స్, సెల్ఫోన్ నంబర్ తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, పంచాయతీరాజ్ ఈఈ శంకర్ రాథోడ్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.