రైతు సంక్షేమమే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుకు ఎప్పుడూ అండగా నిలబడుతుందే తప్ప ఆపద తెచ్చే ప్రయత్నం చేయదు. కానీ, కొందరు చేసిన తప్పిదాలు, విపక్షాలు చేసిన విషపు రాజకీయాలు ఒక దుష్ప్రచారానికి కారణమయ్యాయి. కామారెడ్డి మాస్టర్ప్లాన్లో భాగంగా రైతుల భూములు పోతున్నాయనే అబద్ధాలు ఒక ప్రణాళిక ప్రకారం వ్యాప్తి చెందాయి. కానీ, రైతును రాజును చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం.. మాస్టర్ప్లాన్ విషయంలో ఆందోళన వద్దని మొదటి నుంచి చెబుతూనే వచ్చింది. బృహత్ ప్రణాళిక ఇంకా ఖరారు కాలేదని, రైతులు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచిస్తూనే ఉన్నది. అందుకు అనుగుణంగానే కామారెడ్డి మాస్టర్ప్లాన్ ముసాయిదా రద్దుకు చర్యలు చేపట్టింది.
శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమైన కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్..ముసాయిదాను రద్దు చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానించింది. అదే సమయంలో రైతుల అభ్యంతరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకొని మాస్టర్ప్లాన్ను నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ప్రకటించారు. సర్కారు నిర్ణయంపై రైతాంగంలో హర్షం వ్యక్తమవుతున్నది. అన్నదాతలను ఆవేదనకు గురి చేసి, వారిని ఆందోళన బాట పట్టించి లబ్ధి పొందాలనుకునే విపక్ష పార్టీల ప్రయత్నాలు చివరకు బెడిసి కొట్టాయి.
– నిజామాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ప్రభుత్వం.. రైతు పక్షపాతి
మాస్టర్ప్లాన్ను రద్దు చేయడం సంతోషంగా ఉంది. ఈ మేరకు మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి తీర్మానించడంతో ప్రభుత్వం మా పక్షానే ఉన్నదని రుజువైంది. మా భూములు కూడా ఎక్కడికీ పోవని నమ్మకం కలిగింది.
-రాజయ్య, రైతు ఐక్య కార్యచరణ సంఘం అధ్యక్షుడు
నిజామాబాద్, జనవరి 20, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఎద్దేడ్చిన ఎవుసం… రైతేడ్చిన రాజ్యం బాగుపడదని ఉద్యమ సారథి, ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలుసు. అందుకే ఆయన పాలనాపగ్గాలు చేపట్టిన తొలి దఫాలోనే కాళేశ్వరం ప్రాజెక్టును శరవేగంగా నిర్మించారు. ఎకరాకు రూ.10వేలు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. చనిపోయిన రైతు కుటుంబాలను బీమాపథకం ద్వారా ఆసరాగా నిలిచారు. బీటలువారిన బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు అనువైన వాతావరణం కల్పించారు.
ఒక ప్రజాస్వామ్య దేశంలో, 70 ఏండ్ల స్వాతంత్య్ర పాలనలో ఏ ప్రభుత్వం, ఏ పాలకుడూ చేయని కార్యక్రమాలు, ఏ నాయకుడూ ప్రవేశపెట్టని పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేశారు. కేవలం ఎనిమిదేండ్లలోనే రాష్ర్టాన్ని యావత్ దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దారు. అనేక సంక్షేమ పథకాలను తీసుకు వచ్చి రైతును రాజు చేస్తున్న తరుణంలో.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కుటిల రాజకీయాలతో బద్నాం చేసేలా కుట్రలకు దిగుతున్నది. కామారెడ్డి మున్సిపాలిటీ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్పై బీజేపీ ఆడిన ఆటలే ఇందుకు నిదర్శనం. అభ్యంతరాలు చెప్పకుండా కేవలం బీఆర్ఎస్ సర్కారును ఇబ్బంది పెట్టేందుకు రైతులను పావుగా వాడుకున్నది. అన్నదాతను కాపాడేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి వారి అనుమానాలను నివృత్తి చేసింది. బృహత్ పట్టణ ప్రణాళిక ముసాయిదాను పూర్తిగా రద్దు చేసింది.
ఏకగ్రీవ తీర్మానం..
కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ ముసాయిదాను పాలకవర్గం శుక్రవారం రద్దు చేసింది. గురువారం విడుదల చేసిన ప్రకటన మేరకు మధ్యాహ్నం 12గంటలకు సమావేశమైన కౌన్సిల్.. ఏకగ్రీవంగా తీర్మానానికి ఆమోదం తెలిపింది. మొత్తం 49 మంది సభ్యులు మూకుమ్మడిగా మద్దతు తెలిపారు. 2021, మార్చి 27న కౌన్సిల్ తీర్మానం చేసిన విధంగా మాస్టర్ప్లాన్ ముసాయిదా లేకపోవడంపై కౌన్సిల్ తీవ్రంగా తప్పుబట్టింది. కౌన్సిల్లో చర్చించినదానికి, ప్రభుత్వానికి చేరిన డ్రాఫ్ట్కు తేడాలు ఉండడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇందుకు ఢిల్లీకి చెందిన డిజైన్ డెవలప్మెంట్ ఫోరంతోపాటు డీటీసీపీ జాయింట్ డైరెక్టర్ రమేశ్బాబు కారణమని గుర్తించారు. వీరిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ తీర్మానంలో పొందుపర్చారు. ఇదిలా ఉండగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కొంత కాలంగా రైతు పేరిట చేసిన రాజకీయాలకు కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంతో చెక్ పడింది. రైతుల మేలుకోసం పనిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. అన్నదాతకు కీడును తలపెట్టే పని చేయబోదని కామారెడ్డి మున్సిపాలిటీ తీసుకున్న నిర్ణయంతో స్పష్టమైంది. పంట పొలాలకు ఊపిరి పోస్తున్న కేసీఆర్ పాలనలో పచ్చని భూములను చెడగొట్టే పని జరగబోదనే సంకేతాలు వెలువడ్డాయి.
రైతు కోసం బీఆర్ఎస్..
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు దేశ, విదేశాల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. అన్నదాతలకు లోటు రానివ్వొద్దనే సీఎం కేసీఆర్ దృఢ సంకల్పానికి యావత్ రైతు సమాజం జేజేలు పలుకుతున్నది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్లలో కొన్ని రంగాల్లో అరకొర అభివృద్ధి జరుగగా, సంక్షేమం మాత్రం పూర్తిగా చచ్చుబడి పోయింది. దేశంలో ప్రస్తుతం గుండె తరుక్కుపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీలు చేసిన ప్రగతి చాలా తక్కువ. దానికి ఆ పార్టీల పరిణతి లేని తీరే కారణం. అమాయక ప్రజలను రెచ్చగొట్టి ఆందోళన పేరిట వారి జీవితాలతో చెలగాటమాడడమే ఇందుకు ఉదాహరణ.
కేసీఆర్ సూచించిన పథకాలు, విధానాలు ఇప్పటికే తెలంగాణలో అమలవుతున్నాయి. అవి రాష్ట్రంలో ప్రజాదరణను పొంది వ్యవసాయ తదితర ఉత్పత్తి, వివిధ సంక్షేమ రంగాల్లో అభివృద్ధి సూచీలను స్పష్టమైన రీతిలో మెరుగుపరుస్తున్నాయి. ఈ మాటను రాష్ట్ర ప్రభుత్వం చెప్పడమే కాకుండా ఈ విషయాలను జాతీయస్థాయిలో మదింపుచేసే కేంద్ర మంత్రిత్వ శాఖలు, స్వతంత్ర ఏజెన్సీలూ తేటతెల్లం చేస్తున్నాయి. పలు అంతర్జాతీయ సంస్థలు సైతం తరచూ ధ్రువీకరిస్తున్నవి ఇవే. ఇలాంటి విజయాలే కేసీఆర్కు ఆత్మవిశ్వాసాన్ని తెచ్చిపెట్టి బీఆర్ఎస్ ఆలోచనకు ప్రేరణ, పునాదులుగా మారుతున్నాయి.
రైతుల అపోహలు తొలగిపోయాయి..
మున్సిపల్ కౌన్సిల్లో మాస్టర్ప్లాన్ను రద్దు చేయడంతో రైతులు, ప్రజల్లో ఉన్న అపోహలు తొలగిపోయాయి. ప్రతిపక్ష నాయకులు అనవసరంగా రైతులను రెచ్చగొట్టారు. మాస్టర్ప్లాన్పై అసత్యప్రచారం చేసి ప్రజలను తప్పుదోవపట్టించారు. రైతులకు అన్యాయం జరుగనివ్వం.
-గడ్డమీది రాణి, 1వ వార్డు కౌన్సిలర్
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి..
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని మరోసారి నిరూపించింది. కౌన్సిల్లో మాస్టర్ ప్లాన్ను రద్దు చేసి రైతుల్లో నెలకొన్న అనుమానాలను దూరం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసమే పని చేస్తుంది.
-కాసర్ల గోదావరి, 12 వ వార్డు కౌన్సిలర్
ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టించాయి..
మాస్టర్ప్లాన్ను రెసిడిన్షియల్ జోన్గా పంపితే.. దానిని ఇండస్ట్రీయల్ జోన్గా మార్చారు. అయిన్పటికీ 60 రోజుల్లో అభ్యంతరాలు చెప్పాలని కోరాం. దీనిపై ప్రతిపక్షాలు అనవసరంగా రచ్చ చేశాయి. స్వార్ధ రాజకీయాల కోసం ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొట్టి తప్పుదోవ పట్టించాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల వెన్నంటే ఉంటుందని రుజువైంది.
-పోలీసు క్రిష్ణాజీరావు, 35 వ వార్డు కౌన్సిలర్
రైతుల సంబురాలు
విద్యానగర్, జనవరి 20 : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదానును మున్సిపల్ కౌన్సిల్లో రద్దు చేస్తూ తీర్మానం చేయడంపై రైతులు హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆనందంతో పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. బీఆర్ఎస్.. రైతు ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నదని కృతజ్ఞతలు తెలిపారు.
మాస్టర్ ప్లాన్ను నిలిపివేస్తాం
మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్
విద్యానగర్, జనవరి : 20 కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ప్రక్రియను నిలిపివేస్తామని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ స్పష్టంచేశారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఆయన కలెక్టర్ జితేశ్ పాటిల్, స్థానిక సంస్థల దనపు కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, మున్సిపల్ కమిషనర్ దేవేందర్తో మాస్టర్ ప్లాన్పై సమీక్ష నిర్వహించారు. రైతులు, ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలపై చర్చించారు.
కామారెడ్డి పట్టణంలో విలీనమైన గ్రామాలనుంచి ప్రజల అభిప్రాయాలను సేకరించి అందరి సమన్వయంతో కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామన్నారు. రైతులనుంచి భూమిని తీసుకునే ఉద్దేశం మాస్టర్ ప్లాన్లో లేదన్నారు. భూములు ఎక్కడికీ పోవని స్పష్టంచేశారు. కొత్త రోడ్ల నిర్మాణంతో రైతులకు నష్టం జరగకుండా చూస్తామన్నారు. ప్రస్తుతానికి మాస్టర్ ప్లాన్ ముసాయిదా ప్రక్రియను నిలిపివేయనున్నట్లు వెల్లడించారు.