జక్రాన్పల్లి, ఏప్రిల్ 24 : ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో
అనుభవం లేని డ్రైవర్లు బస్సులను నడపడం ప్రజల ప్రాణాలమీదికి వస్తున్నది. ఇందుకు తాజాగా మండలంలోని అర్గుల్ జాతీయ రహదారిపై జరిగిన బస్సు ప్రమాదమే నిదర్శనం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో కామారెడ్డి నుంచి ఆర్మూర్ వైపు వస్తున్న ఆర్మూర్ డిపోకు చెందిన పల్లె వెలుగు అద్దె బస్సు ప్రమాదానికి గురైంది.
కామారెడ్డి నుంచి ఆర్మూర్కు ప్యాసింజర్లను ఎక్కించుకుని వస్తుండగా అర్గుల్ వద్ద ఓ ప్రయాణికుడిని దింపడానికి డ్రైవర్ బస్సును ఆపాడు. సదరు ప్రయాణికుడు దిగిన తర్వాత బస్సు తీస్తుండగా వెనుక వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో బస్సు పక్కనున్న డివైడర్పైకి ఒక్కసారిగా దూసుకెళ్లగా, బస్సులో 20 మంది ఉండగా 12 మందికి స్వల్ప గాయాలయ్యాయి. అలాగే బస్సును ఢీకొట్టిన లారీని మరో లారీ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. దీంతో లారీ ముందుభాగం ధ్వంసమైంది. అనుభవంలేని డ్రైవర్లతో బస్సులను నడిపించడంతో ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికులతో పూర్తిస్థాయిలో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.